కొడిమ్యాల, ఆక్టోబర్ 16: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆడబిడ్డలు చదువుకున్నప్పుడే ఈ సామాజిక రుగ్మతకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు. నోబెల్ అవార్డు గ్రహీత కైలాస సత్యర్థి చేపడుతున్న జాతీయస్థాయి సదస్సుల్లో భాగంగా మండలంలోని గంగారాంతండా గ్రామంలో బాల్య వివాహ నిర్మూలనపై ఆదివారం సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి జ్వోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలతో రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లోనూ బాల్య వివాహాలు జరగడంలేదన్నారు. అయితే బాల్యవివాహాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు ఇటీవలే వాఖ్యానించడాన్ని ఉటంకిస్తూ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అమ్మాయిలు చదువులో ముందంజలో ఉన్నారన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో 1500 సీట్లకు గానూ 1141 మంది బాలికలు వివిధ కోటాలో సీట్లు సాధించడాన్ని ఉదహరించారు. బాలలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ఏర్పాటు చేసిందని చెప్పారు. సీఎం కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు విరివిగా నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకంతో బాల్యవివాహాల నిర్మూలన జరిగిందన్నారు. కైలాస్ సత్యర్థి కరీంనగర్ వచ్చిన సందర్భంలో ఈ స్కీం అమలుతీరును మెచ్చుకున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా అతివల రక్షణకు షీటీంలను ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ గిరిజన తండాల్లోని బాలికలు ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏర్పా టు చేసిన గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సదస్సులో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు. కైలాస్ సత్యర్థి చిల్డ్రన్ ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్ చందన, ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగరావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, సర్పంచ్ భూక్యా బోజ్జనాయక్, ఎంపీటీసీ గుగులోత్ సుజాత, ఏఎంసీ చైర్మన్ నరేందర్రెడ్డి, నాయకులు వినోద్నాయక్, శంకర్నాయక్ ఉన్నారు.