వడ్లు కొనాల్సిందేనంటూ మోదీ సర్కారుపై ఢిల్లీలో గర్జించిన రైతాంగం
ఢిల్లీలో హోరెత్తిన ముఖ్యమంత్రి నిరసన దీక్ష
సీఎం వెంటే మంత్రులు కేటీఆర్, కొప్పుల, గంగుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు
మద్దతుగా నినదించిన ఉమ్మడి జిల్లా కర్షకలోకం
దిగొచ్చే దాకా ఉద్యమాన్ని వదిలేదే లేదని స్పష్టీకరణ
పండించిన ప్రతి గింజనూ కొనాల్సిందేనని డిమాండ్
లేకుంటే బీజేపోళ్లను ఊళ్లకు రానివ్వమని హెచ్చరిక
కేసీఆర్ 24 గంటల అల్టిమేటంపై జోరుగా చర్చ
ఇప్పుడు కేంద్రం అసలు రంగు బయట పడుతుందంటున్న రైతు సంఘాల నాయకులు
ధాన్యం కొనుగోలు కోసం దేశ రాజధాని కేంద్రంగా టీఆర్ఎస్ రణభేరి మోగించింది. తెలంగాణ రైతాంగ సమస్యను దేశం నలుదిక్కులా వినపడేలా నినదించింది. మోదీ సర్కారు తీరును ఎండగడుతూనే.. వడ్లను కేంద్రమే కొనాలంటూ తేల్చిచెప్పింది. రైతన్న పక్షాన ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్షకు మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరు కాగా.. వడ్లు కొంటరా..? కొనరా..? 24గంటల్లో తేల్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే ఢిల్లీలో దీక్షకు దిగడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి కాగా.. ఉమ్మడి జిల్లా రైతులు సంపూర్ణంగా మద్దతు పలికారు. టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములమవుతామని చెబుతూనే.. కేంద్రం దిగొచ్చేదాకా బీజేపీ నాయకులను ఊళ్లలోకి అడుగుపెట్టనివ్వబోమంటూ స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భూమి కోసం, భుక్తి కోసం, బానిస బతుల విముకి ్తకోసం జరిగిన పోరాటాలు చూశాం. చివరకు ఓ ప్రాంతం విముక్తి కోసం లేదా సామాజిక సమస్యల పరిష్కారం కోసం జరిగిన ఉద్యమాలనూ చూశాం. కానీ, ధాన్యం కొనుగోలు కోసం స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ రాజధానిలో నిరసన దీక్ష చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. వడ్లు కొనకుండా అరిగోస పెడుతూ.. దీక్షలు చేయాల్సిన పరిస్థితిని కల్పించిన కేంద్రం తీరుపై రైతన్నలు భగ్గుమంటున్నారు. ఆత్మహత్యల నుంచి అన్నదాతలను బయట పడేసి.. అనేక పథకాలు అమల్లోకి తెచ్చి.. రైతును రాజుగా చేసే దిశగా అడుగులు వేస్తున్న, వేయిస్తున్న రాష్ర్టానికి మద్దతు ఇవ్వకుండా.. పండించిన పంటను కొనుకుండా కొర్రీలు పెడుతుండడంపై మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు, ప్రాజెక్టులకు పైసా ఇవ్వకపోగా.. అష్టకష్టాలు పడి అన్ని సౌకర్యాలు కల్పించుకొని.. పండించిన పంటలను కొనకుండా చేతులెత్తేయడంపై ఆగ్రహిస్తున్నారు. రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. నెల రోజుల నుంచి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పెద్దసంఖ్యలో హాజరై, హోరెత్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్యంలో సోమవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కలిసి పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించిన దీక్షలో పాల్గొని, మోదీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినదించారు. కేంద్రం తన మొండి వైఖరి వీడాలని, తెలంగాణలో పండించిన ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
వదిలేదే లేదు : మంత్రులు, ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో చేపట్టిన దీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్, మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీలు భానుప్రసాద్రావు, ఎల్ రమణ, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్రెడ్డి, వొడితల సతీశ్ కుమార్, డాక్టర్ సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్ దీక్షలో పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను గోస పెట్టవద్దని, ఇతర రాష్ట్రాల్లో పంటలను కొంటూ ఇక్కడ కొనకుండా ఆగం చేయొద్దని కేంద్రానికి హితవుపలికారు.
అయోమయానికి గురి చేస్తున్న బీజేపీ ఎంపీలకు రైతులు కర్రుకాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. తెలంగాణలో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని, అప్పటిదాకా వదిలేదే లేదని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, లేకుంటే రైతుల కోసం ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. వీరితోపాటు జడ్పీ అధ్యక్షులు పుట్ట మధూకర్, కనుమల్ల విజయ, న్యాలకొండ అరుణ, దావ వసంత, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, టీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ వైస్ చైర్మన్లు, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, మున్సిపల్ అధ్యక్షులు, ఇతర నేతలు హాజరయ్యారు.
బండిని నమ్మిమోస పోయినం
మేం కొంటం. కేంద్రంతో మాట్లాడుతం అని ఎంపీ బండి చెప్పిన తొండి మాటలు నమ్మి మోసపోయినం. బీజేపోళ్లవన్నీ పచ్చి అబద్ధాలే. నేనున్నా అన్న బండి ఇప్పుడు హైదరాబాద్లో దొంగ దీక్ష పట్టిండు. ఢిల్లీలో కేసీఆర్ సార్ వెంట ఉండి కేంద్రం మెడ మీద కత్తి పెట్టయినా సరే రైతులకు న్యాయం జెయ్యాలె. మమ్మల్ని తప్పుదారి పట్టించిన ఎంపీ బండి సంజయ్ బాధ్యత వహించాలె.
– పిల్లి నర్సయ్య, రైతు (ముస్తాబాద్)
ఇక్కడితో అయిపోయే ముచ్చట కాదు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేంద్రం ధాన్యం కొంటంది. ఇన్నేండ్లలో లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందో బీజేపీ సర్కారు చెప్పాలి. నిజానికి బీజేపీ సర్కారు గద్దెనెక్కిన తర్వాతనే రైతులకు గడ్డుకాలం మొదలైంది. ఏ ఒక్క పనైనా చేసిందా..? నల్ల చట్టాలు అన్నది. కొనుగోలు కేంద్రాలు తీసేసింది.. ఇప్పుడు ధాన్యమే కొననంటంది. అంటే వాళ్లు ఏంజేసినా చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నట్టున్నరు.. ఎవరు పట్టనట్లు ఉన్నా టీఆర్ఎస్ మాత్రం ఊరుకోదు. మొన్నటిదాకా జిల్లాలో చేసిన ఉద్యమం ఇప్పుడు ఢిల్లీ దాకా చేరింది. ఇది ఇక్కడితో అయిపోయే ముచ్చట కాదు. ఇంకా ఉంది. ధాన్యం కొనకపోతే తీవ్ర పరిణామాలుంటయి.
– నక్కల రవీందర్రెడ్డి, రైతు బంధు మండల కన్వీనర్
(జగిత్యాల టౌన్)
మా ఉసురు తగులుద్ది..
కేంద్రం వడ్లు కొనకుంటే మా ఉసురు తగులుద్ది. మేం ఎండనకా..? వాననకా కష్టపడి పండించిన వడ్లను కొననంటే ఎట్లా..? కేసీఆర్ సారు ప్రాజెక్టులు కట్టి చెరువులు, కుంటలు నింపి పుష్కలంగా నీరిస్తున్నడు. మేం ఇప్పుడిప్పుడే గాడిన పడి సంతోషంగా బతుకుతుంటే బీజేపీ సర్కారు మా పొట్టకొడుతంది. మట్టిల బొర్రి, మట్టిని తిని పంటలను పండించిన మా రైతులను ముంచడం కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు తీసుకున్న ముడి బియ్యం ఇప్పుడెందుకు తీసుకోరు. రైతులను ఇబ్బంది పెట్టినోళ్లు ఇప్పటిదాకా ఎవరూ బాగుపడలే. కేసీఆర్ సారు దీక్షతోనే సోయి రావాలి.
– సొల్లు ముత్యం రెడ్డి, రైతు(ఇబ్రహీంపట్నం)
కేంద్రం కుట్రలను ఢిల్లీలో ఎండగట్టిండు..
వడ్ల కొనుగోలుపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రం కుట్రలను సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఎండగట్టిన్రు.. ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గోయల్ వ్యాఖ్యలను తిప్పికొట్టిండు. గతంలో పలుమార్లు బీజేపీ సర్కారుకు లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతోనే ఆందోళనకు పిలుపునిచ్చిన్రు.. 24 గంటల్లో ధాన్యం కొనుగోలుపై తేల్చాలని అల్టిమేటం ఇచ్చి మరోసారి రైతుల పక్షపాతినని నిరూపించిండు.. మాలాంటి వాళ్లందరం ఆయన వెంటే ఉండి అన్నదాతకు అండగా ఉంటాం.
– పాకాల రాజయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ (ధర్మారం)
రైతులకు పెద్ద దిక్కు కేసీఆరే..
బీజేపీ సర్కారు ఇన్నేండ్లలో రైతులను ఏనాడైనా పట్టించుకున్నదా? మీరే ఆలోచించాలి. వడ్లు కొనుగోలు చేసేందుకు ఇబ్బందెందుకు..? ఇది కరెక్ట్ కాదు. బీజేపీ అనాలోచిత విధానాలతో రాష్ట్రమే కాదు.. దేశ రైతాంగమే విసుగెత్తిపోతంది. భవిష్యత్తులో దేశ రైతాంగానికే పెద్ద దిక్కుగా సీఎం కేసీఆరే ఉంటరు. రైతులకు మద్దతుగా ఢిల్లీలో చేపట్టిన రైతు దీక్షతో సీఎం కేసీఆర్ను దేశప్రజలు దేశ్కీ నేతగా గుర్తించారు. వ్యవసాయ రంగ అభివృద్ధిపై చిత్తశుద్ధితో రైతుల కోసం దీక్ష చేపట్టే ఇలాంటి నాయకుడి సేవలు దేశానికి అవసరం. సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్ పిలుపుమేరకు కొనేదాకా కొట్లాడుతం. కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగిరాక తప్పదు.
– రాజేశ్కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్(ధర్మపురి)
కేసీఆర్ సారు అనుకున్నది సాధిస్తడు..
కేసీఆర్ సారు అనుకున్నడంటే ఆయన ఖచ్చితంగ సాధిస్తడు. చావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణను తెచ్చిండు. ముఖ్యమంత్రి అయినంక ప్రాజెక్టులు కట్టిచ్చిండు. ఉచితంగనే 24 గంటలు కరెంట్ ఇత్తుండు. ఆయన తెచ్చిన పథకాలతోనే రైతులకు రందిలేకుండా పోయింది. ఇప్పుడు వడ్ల కొనుగోలు కోసం ఢిల్లీకి పోయి కొట్లాడుతున్నడు. ఆయన ఉన్నంత కాలం మాకు ఏ బాధలేదు. ఢిల్లీ నుంచి శుభవార్త తీసుకువస్తడనే నమ్మకం ఉన్నది.
– టీసీ రాజన్న, రైతు, రత్నాపూర్ (మల్లాపూర్)
నిరుడు లెక్కనే వడ్లను కొనాలె..
కేంద్ర సర్కారు కిరికిరి లేకుంగా వడ్లను కొనుగోలు చేయాలి. ఎప్పుడు లేంది ఈ సారి కిరికిరి పెట్టుడేంది. నిరుడు లెక్కనే కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లను సేకరించాలె. గైట్లెతేనె రైతులం బాగుంటం. ప్రభుత్వం వడ్లను కొనకుంటే షావుకారి చెప్పిన ధరకు అమ్ముకోవాల్సి వత్తది. నిండ మునుగుడు తప్ప మిగిలేది ఏం ఉండదు. బీజేపోళ్లు మనసు మార్చుకోకుంటే రోడ్లపైకి వచ్చి కొట్లాడుతం. – గండు రంగయ్య, రైతు (పెద్దపల్లి జంక్షన్)
ఇబ్బందులు పెట్టుడు సరికాదు
వరి ధాన్యం కొనే విషయంల రైతులను ఇబ్బందులు పెట్టుడు కేంద్ర ప్రభుత్వానికి తగదు. యాసంగిల పండించిన పంటను మొత్తం కేంద్రమే కొనాలె. సీఎం కేసీఆర్ నాయకత్వంల రైతులు ఢిల్లీలో ధర్నా చేయడం సబబే. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిందే..
– కొప్పుల సత్యనారాయణ, రైతు, కిష్టంపేట (కాల్వశ్రీరాంపూర్)
కొనేదాకా కొట్లాడుతం..
రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనేదాకా ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త నిద్ర పోడు. ఎంతవరకైనా వెళ్తాం.. బరిగీసి కొట్లాడుతం. ఉద్యమ నేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రం కోసం ఏవిధంగానైతే ఉద్యమించినమో అదేతీరున వడ్ల కొనుగోలుపై పోరాటం చేస్తాం. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం.
–ఆకుల కిరణ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు (మంథని)
వడ్లు కొనేదాకా వదిలిపెట్టం…
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వడ్లను కొనేదాకా వదిలిపెట్టం. వాళ్లు ఏలే రాష్ర్టాలకు ఓ న్యాయం, మాకో న్యాయమా?, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతుల గోస కనవడుతలేదా..? లేక కావాలనే రాజకీయం జేస్తండ్రో మాకు అర్థమైతలేదు. ఎండనకా, వాననకా కష్టపడితే నాలుగు గింజలు పండుతున్నయి. వాటిని కూడా కొనమని కేంద్ర ప్రభుత్వం జెప్తంది. రైతులు ఏంగావాల్నో.. ఎట్ల్ల బతుకాల్నో బీజేపోళ్లే జెప్పాలె. ఇన్ని రోజుల సంది ఊళ్లళ్లనే ధర్నాలు జేసినం. ఇంకా రైతుల బాధలు కనవడుతలేవంటే.. ధర్నాలు, రాస్తారోకోలు జేత్తం. వడ్లను దెచ్చి రోడ్లమీద వోసి ఢిల్లీకి వినవడేటట్లు రైతుల గొంతువినిపిస్తం. వడ్లను కొనేదాకా సావో.. రేవో దేల్సుకునుడే. రైతులను ఏడ్పిచ్చిన రాజ్యం ఎట్లా బాగుపడుతదో.. ప్రధాని నరేంద్ర మోదీ ఎట్లా రాజ్యం ఏలుతడో జూత్తం.
– గొట్టుముక్కుల రవీందర్రావు, రైతు, బేతిగల్,(వీణవంక)
వరి వేయాల్నని చెప్పింది బండి సంజయే కదా..
పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, వరికి బదులు ఇతర పంటలు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు గ్రామాల్లో అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తే.. కేసీఆర్తోని సంబంధం లేదు.. రైతులు వరి వేయండి.. కేంద్రాన్ని ఒప్పించి వడ్లు కొనిపించే బాధ్యత నాది అని చెప్పి రైతులను రెచ్చగొట్టి వరి వేసేలా చేసింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయే కదా?. రైతులను రెచ్చగొట్టి మరీ వరివేసేలా చేసింది వాళ్లే. ఇప్పుడేమో వడ్లు కొనం.. బియ్యం కొంటం.. అని మాట మార్చుతున్నరు. అప్పుడెందుకు వరి వేయాలని చెప్పిన్రు, ఇప్పుడెందుకు వడ్లు కొనమని చెబుతున్నరు. పంజాబ్, హర్యానా మాదిరిగా తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనాలని రెండు నెలలుగా సీఎం కేసీఆర్ ఉద్యమిస్తున్నరు. ఆయనకు మా రైతుల మద్దతు ఉంటది. పూటకో మాట మాట్లాడుతూ అయోమయానికి గురి చేస్తున్న బీజేపీ నాయకులను నమ్మే పరిస్థితి లేదు. కేంద్రం దిగివచ్చి వడ్లు కొనాలె. లేదంటే భవిష్యత్తులో ఆ పార్టీకి నూకలు చెల్లినట్టే.
– సామంతుల శ్రీనివాస్, యువ రైతు, (గంగాధర)
ఎందుకు కొనదు?
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మా ఊరికి నీళ్లిచ్చిండు. మల్లన్న సాగర్ నుంచి ఎగువ మానేరుకు నీళ్లు ఎత్తిపోసిండు. వానకాలం, ఎండకాలమని లేకుండా చెరువుల్లో నీళ్లు వచ్చినయ్. కేసీఆర్ దయవల్ల కరువు దూరమైంది. పంటలు మంచిగా పండినయ్. ఇప్పుడేమో కేంద్రం వడ్లు కొనకుండా ఆగం చేస్తున్నది. మోదీ సర్కారుకు ఏం బుట్టిందని వడ్లు కొననంటున్నది. ఈళ్లు ఉన్నన్ని రోజులు రైతులకు అన్యాయం జరుగదు. అందుకే రైతుల పక్షాన కేసీఆర్ సర్కారు యుద్ధం చేస్తున్నది. మేమంతా ఆ సారు వెంటే ఉంటం.
– బైతి మల్లేశం, రైతు, తెర్లుమద్ది(ముస్తాబాద్)
కొనకుంటే ఊకుండేది లేదు
ఒకప్పుడు తెలంగాణ ఎట్లుండె? తెలంగాణ రాష్ట్రం అచ్చిన తర్వాత ఎట్ల మారింది. చూస్తేనే తెలుస్తది. కేసీఆర్ సార్ సీఎం అయినంక రైతుల పక్షాన ఉన్నడు. సాగునీరు, రైతుబంధు, రైతబీమా, 24 గంటల కరెంటు ఇత్తున్నడు. గిన్ని జేత్తుండు కాబట్టే ఏడ జూసినా పచ్చని పొలాలు గనపడుతున్నయ్. వడ్లు ఇరగవండినయ్. గివన్ని జూసి కేంద్ర మోడికి కన్నుగిట్టిందేమో..? మా వడ్లు కొనకపోతే ఊకుండేది లేదు. పోరాటం జేత్తున్న మా మంత్రి కేటీఆర్ సార్ ఎన్కాల ఉండి మేము కొట్లాడుతం.
– బద్ద రాములు రైతు, తెర్లుమద్ది (ముస్తాబాద్)
కేంద్రం పునాదులు కదులుతయ్..
ధాన్యం కొనుగోలులో బీజేపీ సర్కారుకు ఇంత మొండిపట్టు పనికిరాదు. రైతన్నపై ఇంత కక్షగట్టడం ఎందుకు. దేశానికి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టడం సరికాదు. మేమొక్కటే అడుగుతున్నం. ఇన్నేండ్లు పారాబాయిల్డ్ రైస్ కొన్నరు. మరి ఇప్పుడెందుకు తీసుకోరు. అప్పుడు రాని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందో చెప్పాలె? పంజాబ్ రాష్ట్రంలో కొంటరట.. మాయి కొనరట. ఇక ఊరుకోం. ఇన్ని రోజులు స్థానికంగా ధర్నాలు చేసిన టీఆర్ఎస్.. ఇప్పుడు ఢిల్లీ దాకా వచ్చింది. ఇప్పటికైనా తలొగ్గాలి. లేదంటే ఢిల్లీ పునాదులు కదలడం ఖాయం.
– గడ్డం శ్రీనివాస్, రైతు, వెల్దుర్తి (జగిత్యాల రూరల్)
రైతులు టెన్షన్ పడుతున్నరు..
యాసంగి కోతలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమ వడ్లు కొంటరో, కొనరోనని రైతులు టెన్షన్ పడుతున్నరు. పంటలు పండేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నీళ్ల కోసం అహర్నిశలు శ్రమిస్తే.. ఫలితం వచ్చే ముందు కేంద్రం వివక్ష చూపుతున్నది. సీఎం కేసీఆర్కు రైతుల నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేకే ఇలా చేస్తుందనిపిస్తున్నది. ఇన్ని ఎకరాల పొలాలు చేతికి వచ్చాక, వడ్లు కొనం అంటే ఊరుకునేదే లేదు.
–కేతిరెడ్డి వనిత దేవేందర్రెడ్డి, ఎంపీపీ, తిమ్మాపూర్ (తిమ్మాపూర్రూరల్)
కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర
70 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ధాన్యాన్ని ఏవిధంగా కొనుగోలు చేశాయో ఇప్పుడు అదేవిధంగా కొనాలి. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలకు తెరలేపింది. ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నది. బీజేపీ సర్కారు వైఖరిని తెలంగాణ సాధన సమితి ఎండగడుతున్నది. రైతుల పక్షాన పోరాడుతాం.
– ఎరుకల రాజన్న, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి (పెద్దపల్లి)