మానకొండూర్, జూలై 13: వ్యవసాయానికి నిరంతర విద్యుత్ వద్దన్నందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెంపలు వేసుకుని, ముక్కు నేలకురాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. రైతుల్లో దేవున్ని చూ స్తున్న సీఎం కేసీఆర్ కావాలా..? రైతుల్లో రాబంధుల్ని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కావాలా..? రైతు లు ఆలోచించాలని కోరారు. తెలంగాణ ద్రోహి, కర్షక వ్యతిరేకి రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పే వరకు గ్రామాల్లో తిరగనీయవద్దని పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మానకొండూర్లో నియోజకవర్గ రైతులు, బీఆర్ఎస్పార్టీ శ్రేణులు దీక్షాకార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయి హాజరై మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టకొట్టేందుకు చూస్తున్నదని మండిపడ్డారు. గత కాంగ్రెస్ పాలనలో నాణ్యమైన కరెంట్లేక, ఎరువుల కొరతతో రైతులు పొలాలు అమ్ముకున్న రోజులు ఉన్నాయని గుర్తుచేశారు.
అర్ధరాత్రి మోటర్లు ఆన్చేయడానికి వెళ్లిన రైతులు పాములు, తేలు కాట్లకు గురై మరణించిన రోజులు ఉన్నాయని, ఇవ్వాళ తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. ఉమ్మడి పాలనలో నాణ్యమైన కరెంట్ అడిగిన పాపానికి అప్పటి సీఎం చంద్రబాబు రైతులపై కాల్పులు జరిపించి నలుగురు రైతులను పొట్టన పెట్టుకున్నాడని గుర్తు చేశారు. చంద్రబాబు శిష్యుడైన రేవంత్రెడ్డి తెలంగాణ సంక్షేమ పథకాలను అడ్డుకుంటూ ఇప్పడు తెలంగాణ రైతులపై విషం కక్కుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ వైఖరిని గమనించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, ఆర్బీఎస్ మానకొండూర్ మండల కన్వీనర్ రామంచ గోపాల్రెడ్డి, సర్పంచ్ రొడ్డ పృధ్వీరాజ్, బీఅర్ఎస్వై నియోజకవర్గ అధ్యక్షుడు గూడురు సురేశ్, మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు తాళ్లపెల్లి శేఖర్గౌడ్, రావుల రమేశ్, గంట మహిపాల్, గంప వెంకన్న, మహిపాల్రెడ్డి, వివిధ సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోవడం లేదు. ఉచిత కరెంట్ను వద్దనడం రైతులను అవమానించడమే. స్వరాష్ట్రంలో 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు తదితర సంక్షే మ పథకాలతో సాగు సంబురంగా సాగుతున్నది. ఆర్థికంగా ఎదుగుతున్న అన్నదాతలను కాంగ్రెస్ మళ్లీ చీకట్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహించాలి.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు