తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి ఊరూరా.. వాడ వాడలా ర్యాలీలు తీశారు. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాస రచన, క్విజ్, వేషధారణ, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ‘మన ఊరు మనబడి’ ద్వారా అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్న పాఠశాలను, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాలను ప్రముఖులు హాజరై ప్రారంభించారు. తొమ్మిదేండ్లలో విద్యారంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ గ్రామ ప్రజలకు, తల్లిదండ్రులకు కరపత్రాలు పంపిణీ చేశారు. కాగా, కరీంగనర్లో మంత్రి గంగుల కమలాకర్, జమ్మికుంటలో మండలి విప్ కౌశిక్రెడ్డి, గంగాధరలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
– కరీంనగర్ జూన్20(నమస్తే తెలంగాణ)
కరీంనగర్ జూన్20(నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాస రచన, క్విజ్, వేషధారణ, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అనేక పాఠశాల్లో విద్యార్థులకు రాగి జావ అందించారు. అన్ని ప్రభుత్వ, పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఈ వేడుకలు జరిగాయి. ప్రతి పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి ఊరూరా.. వాడ వాడలా ర్యాలీలు తీశారు. తొమ్మిదేండ్లలో విద్యారంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ గ్రామ ప్రజలకు, తల్లిదండ్రులకు కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామ కూడలిలో విద్యా రంగంలో సాధించిన అభివృద్ధిపై ప్రదర్శనలిచ్చారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆరెపల్లిలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్ని డిజిటల్ తరగతి గదులను, పాఠశాల ఆధునీకరణ పనులను ప్రారంభించారు.
రాంనగర్లో మహిళా గ్రంథాలయాన్ని, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్మించిన తాత్కాలిక గదిని మంత్రి గంగుల ప్రారంభించారు. ఎస్సారార్ డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతైన వారికి కలెక్టర్ బహుమతులు పంపిణీ చేశారు. శాత వాహన విశ్వవిద్యాలయం సైన్ కళాశాలలో నిర్వహించిన విద్యా దినోత్సవంలో ప్రిన్సిపాల్ జయంతి పాల్గొన్నారు. గంగాధరలో నిర్వహించిన కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. రామడుగులో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ఎమ్మెల్యే గ్రంథాలయాన్ని ప్రారంభించారు. చొప్పదండి మండలం భూపాలపట్నంలో జరిగిన వేడుకల్లో జడ్పీటీసీ మాచర్ల సౌజన్య పాల్గొన్నారు. మానకొండూర్ మండలం కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు. జమ్మికుంటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. వీణవంకలో ఎంపీపీ రేణుక పాల్గొన్నారు.