ఇది మన తెలంగాణ శ్వేత సౌధం, మన పాలన, పనితీరుకు చిహ్నం. సర్వ సంస్కృతుల మేళవింపుగా దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున నిర్మించిన అద్భుత కట్టడం. రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటే నయా కళాఖండం.. అదే మన తెలంగాణ నూతన సచివాలయం! డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేసుకున్న ఈ కీర్తి కిరీటం, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ఆవిష్కృతం కాబోతుండగా సకల జనుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అమెరికా వైట్ హౌస్ను తలదన్నేలా రూపుదిద్దుకున్న ఈ భవనాన్ని చూసి మేధావులు, ఇంజినీర్లు అబ్బురపడుతున్నారు. తెలంగాణ చరిత్రలోనే ఇది చారిత్రక నిర్మాణమని, ఈ నిర్మాణాన్ని వివరించేందుకు మాటలు రావడం లేదని, చూసేందుకు రెండు కళ్లు చాలవని చెబుతున్నారు. రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తుందని, దీనికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమంటున్నారు.
– కరీంనగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖ్యాతిలో మరో కలికితు రాయి ఆవిష్కృతం కాబోతున్నది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఏర్పాటు రాష్ట్ర కీర్తిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రజలకు అంకితం చేయబోతున్నారు. నూతన పాలనా సౌధానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర సచివాలయాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నిర్మించారని, ఇది తెలంగాణ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తుందని చెబుతున్నారు. నేటి తరంతోపాటు వచ్చే వందేళ్ల వరకు ఈ భవన సముదాయం తెలంగాణ ప్రజలకు సేవలందించే విధంగా నిర్మాణం చేపట్టారని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇంతటి ఖ్యాతిని చరిత్రలో నిలుపబోతున్న సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో కేవలం 20 నెలల్లోనే పూర్తి చేయించారని, అది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమంటున్నారు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారని, వందేళ్ల వరకు కూడా చెక్కు చెదరని విధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించారంటున్నారు. ఆధునికత, సంప్రదాయక కళ ఉట్టిపడుతున్నదని, సర్వ సంస్కృతుల మేళవింపుగా నిలుస్తున్నదని అభిప్రాయపడుతున్నారు. నేడు ఈ అద్భుత సౌధాన్ని ముఖ్యమంత్రి కే కేసీఆర్ ప్రారంభించబోతున్నారని, ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని చెబుతున్నారు.
అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయం..
దేశంలోనే అరుదైన నిర్మాణం మన సచివాలయం. దీనికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షనీయం. వందేండ్లకు సరిపడే విధంగా నిర్మాణం ఉన్నది. కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటే అధికారులు కూడా చురుకుగా పనిచేయగలుగుతరు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నూతన సచివాలయాన్ని నిర్మించారని చెప్పవచ్చు. సచివాలయం పూర్తిగా ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇంత మంచి కార్యాలయం కట్టినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. ఇప్పుడు పనులపై ఎవరు వెళ్లినా సచివాలయంలో ఒకే చోట మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటరు. పనులు త్వరగా జరిగే అవకాశం ఉంటది..
– పంతకాని లక్ష్మినారాయణ, ఎన్పీడీసీఎల్ ఇంజినీర్ (కరీంనగర్)
ఇది దేశంలోనే అద్భుత నిర్మాణం
రాష్ట్ర సచివాలయ నిర్మాణం దేశంలోనే అద్భుత నిర్మాణం. అమెరికా తర్వాత ఇంత గొప్ప నిర్మాణాలు ఏ దేశంలో లేవు. ఈ నిర్మాణం అమెరికా వైట్ హౌస్ను మించిపోయింది. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన మరో అద్భుతం. రాష్ట్ర సచివాలయాన్ని ఇలా నిర్మించుకుంటామని ఎన్నడూ… ఎవ్వరూ అనుకోలేదు. ఇది తెలంగాణ ప్రభుత్వ మరో చారిత్రాత్మక నిర్మాణం. ఇలాంటి ఇంద్ర భవనంలో రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలన్నీ కొలువు దీరనుండడం ఒక శుభ సూచకం. అలాంటి శుభ తరుణాన్ని మనమంతా పంచుకోవడం నిజంగా ఆనందంగా ఉన్నది.
-దేవళ్ల తులసీదాస్, రిటైర్డ్ ఛీఫ్ ఇంజినీర్ (మంథని)
ఖ్యాతిని మరింత ఇనుమడిస్తుంది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయం నేషనల్ బిల్డింగ్ కోడ్కు అనుగుణంగా ఉంది. ఈ భవనం చరిత్రలో నిలిచి పోతుంది. ఇంత పెద్ద భవనాన్ని ఇంత తక్కువ సమయం కేవలం 20 నెలల్లోనే పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. ప్రకృతి, పర్యావరణానికి అనుగుణంగా సచివాలయాన్ని తీర్చిదిద్దారు. గాలీ వెలుతురు వచ్చే విధంగా నిర్మాణం ఉన్నది. అందుకే ఇది నేషనల్ బిల్డింగ్ కోడ్కు అనుగుణంగా ఉందని ప్రతి ఇంజనీరూ అభిప్రాయ పడుతున్నారు. నిర్మాణంలో ఉత్తమమైన నాణ్యత ప్రమాణాలు పాటించారు. అత్యాధునికమైన ఫర్నిచర్ వాడారు. ఇది మన తెలంగాణ ఖ్యాతిని మరింత ఇనుమడిస్తుంది.
– కోల అన్నారెడ్డి, ఇంజినీర్ (కరీంనగర్)
చారిత్రాత్మక నిర్మాణం
తెలంగాణ రాష్ట్రంలో అనేక చారిత్రాత్మక నిర్మాణాలు ఉన్నా వాటన్నింటికీ మించిన నిర్మాణం మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం. ఇలాంటి నిర్మాణాలను చేపట్టడం పరిపాలనా దక్షులకు మాత్రమే సాధ్యమవుతుంది. యావత్ తెలంగాణ చరిత్రలోనే ఇది చారిత్రాత్మ నిర్మాణం. పరిపాలన సౌలభంగా ఈ నిర్మాణం నిలువనున్నది. ఈ నిర్మాణాన్ని వివరించేందుకు మాటలు రావడం లేదు. అంత గొప్ప అద్భుతమైన నిర్మాణం. సచివాలయాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఈ సచివాలయం నుంచి సేవలందించే మంత్రులు, ఉన్నత అధికారులకు మరింత గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చి యావత్ ప్రజలకు మేలవుతుంది.
-కొలుగూరి వెంకటేశ్వర్రావు, రిటైర్డ్ పీఆర్ ఈఈ (పెద్దపల్లి)
లండన్ ప్యాలెస్ను చూసిన ఫీలింగ్ కలిగింది
మూడు నెలల క్రితం నేను యునైటెడ్ కింగ్డం వెళ్లాను. అక్కడ లండన్ ప్యాలెస్ చూశా. ఇటీవల హైదరాబాద్కు తిరిగి వస్తున్న క్రమంలో ట్యాంక్ బండ్ పై నుంచి చూస్తేనే లండన్ ప్యాలెస్ చూసిన ఫీలింగ్ నాకు కలిగింది. అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఎలివేషన్స్తో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నది. అద్భుతమైన లొకేషన్లో తీర్చిదిద్దిన తీరు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఏ మాత్రం తీసిపోదు. ఇది ప్రపంచంలోనే గొప్ప అద్భుతమైన కట్టడం. బయటి నుంచి చూస్తేనే ఇంత అద్భుతంగా కనిపిస్తున్నది. ఒక సివిల్ ఇంజినీర్గా చాలా ఆనంద పడుతున్నా.
-భాగ్యనగర్ వెంకటవిజయేందర్, సివిల్ ఇంజినీర్ బాలాజీ కన్స్ట్రక్షన్స్ (పెద్దపల్లి)
చరిత్రలో నిలిచిపోతుంది
ఇది తెలంగాణ ప్రభుత్వ మహాద్భుత నిర్మాణం. ఇంత గొప్ప నిర్మాణం అసలు ఈ భారత దేశ చరిత్రలోనే లేదు. అంతగొప్పగా ఇంజినీరింగ్ డిజైన్లతో పరిపాలనకు అనుకూలంగా ఈ భవనాన్ని నిర్మించారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు కూడా ఇలాంటి నిర్మాణాలను చేయాలనే సంకల్పం కలిగేలా ఆధునికతకు రంగులద్ది నిర్మించారు. పెరిగిన సాంకేతికతకు అనుగుణంగా నిర్మించారు. ఈ కట్టడం వందేళ్లు చరిత్రలో చారిత్రాత్మకంగానే నిలిచిపోతుందనిపిస్తుంది. అలాంటి సౌధం నుంచి పాలన సాగడం వల్ల రాష్ర్టానికి మేలవుతుంది.
-సిగిరి నారాయణ, ఎలినీ ఇంజినీరింగ్ వర్క్స్ (రామగుండం)
ఇది గ్రీన్ బిల్డింగ్
ఇది పూర్తిగా గ్రీన్ బిల్డింగ్. మంచి ఎలివేషన్ ఉన్నది. గ్రీన్ బిల్డింగ్లో రాష్ట్రంలోనే ఇది రెండోది. మొదటిది పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం. అంత కన్నా అద్భుతంగా ఈ బిల్డింగ్ను తీర్చిదిద్దారు. చుట్టు గ్రీనరీ ఉంది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ఇదే విధంగా నిర్మిస్తారని భావిస్తున్నా. ఆర్కిటెక్చర్ పరంగా చూస్తే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. మన పూర్వీకుల కట్టడాలను తలపిస్తుంది. అత్యాధునిక టెక్నాలజీని మేళవిస్తుంది. బయటి నుంచి ఎక్కడి నుంచి చూసినా లోపలి భాగం మొత్తం కనిపిస్తుంది. పూర్తిగా ఎల్ఈడీ లైట్స్ను ఏర్పాటు చేశారు. ఇలాంటి భవనాలు అరుదైనవనే చెప్పవచ్చు. ఇంత గొప్ప బిల్డింగ్ను తక్కువ కాలంలోనే, ఎక్కడా నాణ్యత లోపం లేకుండా నిర్మించడం హర్షించాల్సిన విషయం.
– శ్రీరాముల శ్రీనివాస్, సివిల్ ఇంజినీర్ (కరీంనగర్)