కార్పొరేషన్, జూన్ 9: మన పిల్లల భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ పాలననే మరోసారి రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోయి ఉంటే ఇంత అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చేవా? అని ప్రశ్నించారు. 75 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలోనే సీఎం కేసీఆర్ సాధించారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఇక్కడ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. నాడు సమైక్యపాలనలో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయని, వాటిని కాపాడాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బీసీ కులవృత్తులకు లక్ష రూపాయల పథకాన్ని తీసుకువచ్చి వచ్చి అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకం నిరంతరాయంగా సాగుతుందని, ప్రతి నెలా 15న బీసీ కులవృత్తుల లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రేకుర్తిలోని శుభం గార్డెన్లో సంక్షేమ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కులవృత్తులను కాపాడేందుకు చేపట్టిన లక్ష రూపాయల పథకాన్ని మంత్రి ప్రారంభించారు. కరీంనగర్ నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు చెక్కులను, పలువురికి కల్యాణలక్ష్మి, షాదీముబరాక్ చెక్కులను, బద్దిపల్లి, కొత్తపల్లి మండలంలోని పలువురికి భూమి పట్టాలను అందించారు.
గొర్రెల పంపకం, పలువురికి ఉపాధి కింద చెక్కులను అందించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి, జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు దేశంలో 75 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు, సీఎంలు, పీఎంలు మారారు తప్ప తెలంగాణ ప్రజల బతుకులు, జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. 1956కు ముందు తెలంగాణ రాష్ట్రం ఎంతో గొప్పగా, సంపన్నంగా ఉండేదన్నారు. నాడు ఆంధ్ర ప్రాంతం వారిని మద్రాస్ నుంచి తరిమికొడితే దిక్కూ దివానం లేక సంపన్నంగా ఉన్న తెలంగాణపై వారి కన్నుపడిందని, బలవంతంగా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేశారన్నారు. అప్పటి నుంచి సమైక్యపాలకులు తెలంగాణ వనరులు, సంపదను దోచుకెళ్లారని దుయ్యబట్టారు. మన భూములను బీడు పెట్టి వారి ఆంధ్ర ప్రాంతాలను సస్యశ్యామలం చేసుకున్నారని విమర్శించారు. చివరకు నియామకాల్లోనూ అన్యాయం చేసి తెలంగాణ యువత దుబాయ్ వలసపోయేలా చేశారని, తెలంగాణను పూర్తి గుడ్డి దీపం చేశారని ఆరోపించారు.
సాగు, తాగునీరు, కరెంటు కోసం ఎంతో గోసపడ్డామని, ఈ బాధలన్నీ తీర్చుకోవాలనే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కరీంనగర్ నుంచి సీఎం కేసీఆర్ ఉద్యమాన్ని చేపట్టి రాష్ర్టాన్ని సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎలా ఉందో..? ఇప్పుడెలా అభివృద్ధి సాధించామో ప్రజలకు కండ్లకు కనిపిస్తుందన్నారు. మన వనరులు, సంపదను ఇక్కడే ఖర్చు చేయడం వల్లే ఇంత అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. 2014కు ముందు కరీంనగర్ నియోజకవర్గంలో 1845 మందికి ఆసరా పింఛన్లు ఇస్తే ఇప్పుడు 38,026 మందికి ఇస్తున్నామన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఓవర్సీస్ పథకం కింద 20 లక్షలు అందిస్తున్నామని, పేద విద్యార్థులకు కార్పొరేట్కు దీటుగా గురుకులాల్లో విద్యనందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను కేవలం కేసీఆర్ మాత్రమే కాపాడగలుగుతారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైన తొమ్మిదేళ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని, అది ప్రజలకు కనిపిస్తున్నదన్నారు.
మండు వేసవిల్లోనూ చెరువులు, జలశయాలు మత్తళ్లు దుంకుతున్నాయంటే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం వల్లేనన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం 2వేల కోట్ల నిధులను మంజూరు చేశారని, వాటితో నగరాన్ని, నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలన్నారు. విపక్షాల మాటలు నమ్మి అధికారం అప్పగిస్తే తెలంగాణ గుడ్డిదీపం అవుతుందని, మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. ఆ పార్టీలు ఎన్నికల వచ్చినప్పుడే ఓట్లు వేసుకొని పోతాయని, కాని తాము అనునిత్యం ప్రజల మధ్యే ఉంటున్నామని తెలిపారు. తాము ఎప్పుడూ ఎన్నికల కోసం పని చేయడం లేదని, భవిష్యత్తు తరాల కోసం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ సంక్షేమం, అబివృద్ధి కోసం బీఆర్ఎస్కు ఓటేయాలని, భవిష్యత్తు తరాలను బాగు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మేయర్ యాదగిరి సునీల్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, ఎంపీపీలు లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, ఐలేందర్, నాయకులు రాజశేఖర్, శ్యాంసుందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్జెండర్లకు ఆర్థిక సహాయం పంపిణీ
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లకు సంక్షేమ శాఖ ద్వారా ఉపాధి కోసం ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి గంగుల కమలాకర్ అందించారు. దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా శుక్రవారం స్థానిక శుభం గార్డెన్లో జరిగిన వేడుకల్లో వీరికి ఒక్కొక్కరి ఉపాధి కోసం 50 వేల చొప్పున చెక్కులను అందజేశారు.
మాలాంటోళ్లకు ఎంతో ఉపయోగం
సీఎం కేసీఆర్ అందిస్తున్న ఈ లక్ష రూపాయల పథకం మాలాంటి కులవృత్తి దారులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం వస్తున్న సాంకేతిక పరికరాలను కోనుగోలు చేయాలంటే ఆర్థిక స్థోమ త లేని మాకు ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పథకంతో ఆయా పరికరాలను కోనుగోలు చేసుకునేందుకు అవకాశం వ చ్చింది. దీని వల్ల మా వృత్తి పనుల్లోనూ వేగం, నాణ్యత పెరుగుతుంది. ఇలాంటి పథకాలు తీసుకువచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం. ఎప్పటికీ ఆయనకు అండగా నిలుస్తం.
– రవీంద్రాచారి, విశ్వబ్రాహ్మణ
అండగా నిలుస్తం
గతంలో ఎవరూ కులవృత్తి చేసుకునే మా గురించి ఎవరూ ఆలోచించింది లేదు. కానీ, సీఎం కేసీఆర్ మా గురించి ఆలోచించి ఆర్థిక సహాయం గా ఒకేసారి లక్ష రూపాయలు అందించడం ఎంతో సంతోషంగా ఉంది. కుల వృత్తి చేసుకునే మాకు ఈ అమౌంట్ ఎంతో పెద్దది. దీనివల్ల మావృత్తిని మరింతగా పెం చుకునేందుకు, కొత్త సామగ్రి కొనుగోలు చేసుకునేందుకు ఉపయోగించుకుంటం. అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు ఎప్పటికీ అండగా నిలుస్తం.
– గుంజపడుగు పవన్, నాయీబ్రాహ్మణ