శంకరపట్నం, జనవరి 4: బోధనోపకరణాలతో బోధన సులభతరమవుతుందని, తొలిమెట్టులో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించిన కృత్యమేళా విజయవంతమైందని మండల నోడల్ అధికారి వైద్యుల రాజిరెడ్డి పేర్కొన్నారు. కేశవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన కృత్య మేళా బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థుల్లో అభ్యసన స్థాయిలను మెరుగుపరచడానికి టీఎల్ఎం మేళా నిర్వహించినట్లు వెల్లడించారు. తరగతి గదిలో ప్రతి ఉపాధ్యాయుడు బోధనోపకరణాలతో బోధించాలని ఆదేశించారు.
బోధనాభ్యసన సామగ్రి ద్వారా విద్యార్థికి త్వరగా అర్థమై, సృజనాత్మకతకు దోహదపడుతుందన్నారు. టీచింగ్ ఎయిడ్స్తో ఉపాధ్యాయుడికి బోధన సులువవుతుందని చెప్పారు. బహుళ తరగతికి ఉపయోగపడేలా స్థానికంగా లభించే వస్తువులతో టీఎల్ఎం తయారు చేసుకోవచ్చని తెలిపారు. ఇక్కడ ప్రదర్శించిన ఎయిడ్స్లో ఒక్కో సబ్జెక్ట్ నుంచి 5 ఉపకరణాలను జిల్లా స్థాయి ప్రదర్శనకు పంపనున్నట్లు వెల్లడించారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం, ఈవీఎస్ సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు తయారు చేసిన టీచింగ్ ఎయిడ్స్ను మేళాలో ప్రదర్శించారన్నారు. మండలంలోని 32 ప్రాథమిక పాఠశాలల నుంచి 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యారని తెలిపారు. మేళాను ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు సందర్శించారన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ నోడల్ అధికారులు మమతాగౌతమి, రోజారమణి, ఆనందం, ఎస్ఆర్పీ శ్రీలత, డీఆర్పీ కొండల్రెడ్డి, ఎమ్మార్పీలు భూపతి, శ్రీనివాస్, కోటేశ్వర్రావు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
తిమ్మాపూర్ రూరల్, జనవరి 4: మండలంలోని ఎల్ఎండీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండురోజుల పాటు నిర్వహించిన మండల స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళా బుధవారం ముగిసింది. చివరిరోజున జిల్లా వృత్తి విద్యాశిక్షణాసంస్థ ప్రిన్సిపాల్ శ్రీరాం మొండయ్య, జిల్లా సమగ్ర శిక్షా కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్రెడ్డి మేళాను సందర్శించారు. బోధనా సామగ్రి తయారీలో ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మండలం నుంచి 20 అత్యుత్తమ బోధనా సామగ్రిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో నోడల్ అధికారులు దేవశంకర్, జయపాల్రెడ్డి, లక్ష్మణ్రావు, సీఆర్పీలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.