మండలంలోని కాట్రపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు డ్రెస్కోడ్ పాటిస్తూ ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు విద్యార్థులతో సహా నిత్యం యూనిఫాంలో వస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి డ్రెస్కోడ్ పాటిస్తున్నారు.
– హుజూరాబాద్, జనవరి 22
ఉపాధ్యాయులు అందరూ ఒకే రకమైన డ్రెస్ ధరిస్తున్న విషయం గ్రామస్తులకు తెలిసింది. లైట్ స్కైబ్లూ రంగు చొక్కా, డార్క్ కలర్ ప్యాంట్ ధరించి కాట్రపల్లి గ్రామంలో కనబడితే ఆ ఉపాధ్యాయుడు మనసారేనని గుర్తుపట్టి నమస్కరిస్తుంటారు. ఉపాధ్యాయులు డ్రెస్కోడ్ పాటిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు నిత్యం పాఠశాలకు శుభ్రంగా ఉతికిన యూనిఫాం వేసి పంపిస్తున్నారు. విద్యార్థుల మాదిరిగానే బుధ, శనివారం తప్ప మిగతా రోజులలో టీచర్లు యూనిఫాంలో వస్తున్నారు. అంతేకాకుండా అందులో ముగ్గురు ఉపాధ్యాయులు సొంత డబ్బులతో ల్యాప్టాప్ కొని దానితో విద్యార్థులకు వినూత్న పద్ధతిలో పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులకు కూడా కంప్యూటర్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.
105 మంది విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాల అంటేనే ఓ పది పదిహేను మంది విద్యార్థులు ఉంటారనే అపోహ కాట్రపల్లిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తే తప్పనే నిర్ణయం మార్చుకుంటారు. ఆ పాఠశాలలో మొత్తం105 మంది విద్యార్థులుండగా అందులో 55మంది అబ్బాయిలు, 50మంది అమ్మాయిలు ఉన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో వచ్చిన రూ.6లక్షల25వేల నిధులతో పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడానికి తీర్మానించారు. ఈ మేరకు పనులు జరుగుతున్నాయి.
విద్యార్థులకు ఆదర్శంగా ఉండేందుకు…
విద్యార్థులకు ఆదర్శంగా ఉండేందుకు ఉపాధ్యాయులమందరం డ్రెస్కోడ్ పాటిస్తున్నాం. విద్యార్థులు తమను చూసి బుద్ధిగా యూనిఫాంతో బడికి వస్తారనేది తమ ఉద్దేశం. గ్రామంలో కూడా తమను మన ఊరు బడి ఉపాధ్యాయులేనని గుర్తింపు ఉంటుంది. ఉపాధ్యాయులు రకరకాల రంగుల బట్టలు ధరించి పాఠశాలకు వచ్చిన దానికంటే ఒకే రకమైన డ్రెస్ వేసుకొని వస్తే విద్యార్థుల ఆలోచనలో మార్పు వస్తుంది. పాఠశాలలోని ఉపాధ్యాయులం అందరం కలిసి డ్రెస్కోడ్ పాటించాలని నిర్ణయించుకున్నాం. పాఠశాలలో ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంది.
– ఎస్ ప్రవీణ్, (ప్రధానోపాద్యాయుడు)