గోదావరిఖని ఆగస్టు 30: ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల అమలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు. వాటిని అమలు చేస్తామని గోదావరిఖని పర్యటనలో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కొత్త గనులకు అనుమతులు తీసుకువచ్చి కార్మికులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఆయనదేనని స్పష్టం చేశారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొంటారా..? లేదా.. కేంద్రంతో మాట్లాడి సింగరేణి సంస్థకే తెలంగాణలోని బొగ్గు గనులు కేటాయించే విధంగా ఒప్పిస్తారో? శనివారం నాటి పర్యటనలో తేల్చాలన్నారు.
గోదావరి ఖని ప్రెస్క్లబ్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గతేడాది సింగరేణి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిన నేపథ్యంలో కనీసం 4వేల కోట్ల లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడిచినా సింగరేణి లాభాలను ప్రకటించకపోవడం విడ్డూరమని విమర్శించారు. తక్షణమే లాభాలు ప్రకటించి ప్రతి కార్మికుడికీ 35శాతం వాటా ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పెర్క్స్పై విధించిన ఆదాయ పన్ను తక్షణమే ఇప్పించేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. వంద శాతం కారుణ్య నియామకాలను అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు వందశాతం పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు.
కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం, ఇల్లు నిర్మించుకోవడానికి 20లక్షల వడ్డీలేని రుణం హామీలను అమలు చేస్తారో? లేదో? చెప్పాలన్నారు. గతంలో అనుమతి పొందిన కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తారా? కార్మికులకు అప్పగిస్తారో తేల్చిచెప్పాలన్నారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని కొన్ని కార్మిక సంఘాలు కోరడం విడ్డూరమన్నారు. సింగరేణి యాజమాన్యంతో లోపాయికారితనంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. యాజమాన్యం అనుకూల సంఘాలతోనే సమావేశాలు నిర్వహించడం అనేక అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, నాయకులు చెలుకలపల్లి శ్రీనివాస్, పల్లె సురేందర్, బొగ్గుల సాయి, పులిపాక శంకర్, రోడ్డ సంపత్, గుండు శ్రావణ్, కొమురయ్య ఉన్నారు.
ఎన్నికల వేళ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గోదావరిఖని పర్యటనలో స్పష్టం చేయాలని సింగరేణి కార్మిక సంఘాలైన టీబీజీకేఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించి మాట్లాడారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడిన 29వేల కోట్లను చెల్లించాలన్నారు. కొత్త గనులను ప్రారంభించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, వెంటనే లాభాల వాటాను ప్రకటించాలని కోరారు.