కొత్తపల్లి, డిసెంబర్ 22 : మానేరు తీర సమీపంలోని కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో రూ. 7.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను శుక్రవారం మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కలిసి ఈ ట్రాక్ను ప్రారంభించనున్నారు. కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్కుమార్ ఉన్న సమయంలో ఖేలో ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్కు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను మంజూరు చేయించారు. ఇటీవల ట్రాక్ నిర్మాణం పూర్తి కావడంతో అధికారులు దీనిని ప్రారంభానికి సిద్ధం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ట్రాక్ నిర్మాణం పూర్తి చేశారు.
అంబేద్కర్ స్టేడియంలో సిద్ధమైన బాస్కెట్బాల్ కోర్టు
అంతర్జాతీయ ప్రమాణాలతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను నిర్మించడంతో కరీంనగర్ జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలు నిర్వహణకు వేదిక కానుంది. జాతీయ, అంతర్జాతీయ పోటీలతో పాటు ఏషియన్, ఒలంపిక్ క్రీడలను సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్పైనే నిర్వహిస్తారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ట్రాక్పై సాధన చేస్తే మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే క్రీడాకారులకు టెక్నిక్తో కూడిన శిక్షణ అందుతుంది. సింథటిక్ ట్రాక్పై సాధన చేసిన క్రీడాకారులకు కీళ్ల, మడిమ నొప్పులు, జాయింట్ పెయిన్స్లాంటివి వచ్చే అవకాశం ఉండదు. జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించే దిశగా జిల్లా క్రీడాకారులు ముందుంటారు. కరీంనగర్ క్రీడా పాఠశాల విద్యార్థులతో పాటు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఈ ట్రాక్ ఒక వరంలాంటిదే.