‘కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాంతానికి ఒక్క డిగ్రీ కాలేజీ మంజూరైంది. అది ఎక్కడ పెట్టాలో అనేక తర్జనభర్జనల తర్వాత అటు వేములవాడ, ఇటు సిరిసిల్ల కాకుండా అగ్రహారంలో ఏర్పాటు చేసిన్రు. నాడు ఒక్క డిగ్రీ కళాశాల కోసం కొట్లాడుకునే పరిస్థితి నుంచి ఈ రోజు సిరిసిల్లకు మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కళాశాల, నర్సింగ్, అగ్రికల్చర్ వంటి కళాశాలలతో ఎడ్యుకేషన్ హబ్గా మార్చుకున్నం. ఇదంతా సీఎం కేసీఆర్ పాలనదక్షతకు నిదర్శనమే’ అని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు.
సిరిసిల్లలో మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించగా, అనంతరం నిర్వహించిన బీఆర్ఎస్ నేతల కృతజ్ఞత ర్యాలీలో పాల్గొని, మాట్లాడారు. తానొక్కటే అడుగుతున్నానని, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్ కావాలా..? ఢిల్లీకి గులాంలుగా ఉండే ప్రభుత్వాలు కావాలా..? ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. తనకు తల్లి జన్మనిస్తే.. రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సిరిసిల్ల ప్రజలేనని.. ఇది మనస్ఫూర్తిగా చెబుతున్నానన్నారు. ఇక్కడి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎల్లకాలం పనిచేస్తానని స్పష్టం చేశారు.
-కరీంనగర్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్/ తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 15: దేశంలోనే తెలంగాణ ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇదంతా సీఎం కేసీఆర్ పాలన ఘనతేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్లలో మెడికల్ కళాశాలను వర్చువల్ విధానంలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సిరిసిల్లలో మెడికల్ కళాశాలను వర్చువల్ విధానంలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు కృతజ్ఞత ర్యాలీలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ‘నేను 1993లో బైపీసీ విద్యార్థినే.
మా అమ్మకు నన్ను డాక్టర్ చేయాలనే కోరిక ఉండే. నాన్నకు ఐఏఎస్ చేయాలని కోరిక ఉండే. కానీ నాకు అప్పుడు ఎంసెట్లో 1600 ర్యాంక్ వచ్చినా వైద్యకళాశాలలో సీటు రాలే. డాక్టర్, ఐఏఎస్ కాకుండా ప్రజాసేవ చేస్తున్నా’ అని ఆనందంగా చెప్పారు. తాను 2009లో కాంగ్రెస్ హయాంలో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో తొలిసారి ఈ ప్రాంతానికి డిగ్రీ కళాశాల మంజూరైందని, దానిని అటు వేములవాడ, ఇటు సిరిసిల్ల కాకుండా ఎక్కడ పెట్టాలో తెలియక అగ్రహారంలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
నాడు ఒక్క డిగ్రీ కళాశాల కోసం కొట్లాడుకునే పరిస్థితి నుంచి సిరిసిల్లకు మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కళాశాల, నర్సింగ్, అగ్రికల్చర్ వంటి కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని, ఇదంతా సీఎం కేసీఆర్ పాలనదక్షతకు నిదర్శనమని కొనియాడారు. 65 ఏండ్లలో ఒక్కడిగ్రీ కళాశాల సిరిసిల్లకు వచ్చిందని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్గా మారిందని వ్యక్తపరిచారు. గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్ రాష్ట్రంలో ప్రథమంగా నెలకొల్పామని, ఇటీవల ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాలను మంజూరు చేసినట్లు వెల్లడించారు.
విద్య, వైద్యంలో సాధించిన విజయాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయన్నారు. తాను తొలిసారి 2009లో ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో సిరిసిల్ల దవాఖాన దయనీయ స్థితిలో ఉండేదని, అప్పటి సూపరింటెండెంట్గా నిర్మల దేవి పనిచేసేదని గుర్తుచేసుకున్నారు. దవాఖాన ఉన్నా, వైద్యులు లేకపోవడంతో రోగులు అనేక అవస్థలు పడేవారని గుర్తు చేశారు. తాను వైద్యుల నియమాకం కోసం ఎన్నో అభ్యర్థనలు చేసి ఎట్టకేలకు వైద్యులను నియమించి సేవలు అందించానని గుర్తు చేశారు. నాడు సిరిసిల్ల దవాఖాన ఎట్లుండే..? నేడు ఎలా మారిందో.. సేవలు ఎలా అందుతున్నాయో.. ప్రజలు ఆలోచించాలని సూచించారు.
వైద్య కళాశాల ఏర్పాటుతో జిల్లాలో వంద మంది వైద్యులు సేవలందించనున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో క్యాన్సర్, గుండెపోటు, లివర్ వంటి రోగాలకు సూపర్స్పెషాలిటీ వైద్యసేవలు సిరిసిల్లలో అందనున్నాయని ప్రకటించారు. దేశంలో 27 రాష్ర్టాల్లో ఒక్క ఏడాదిలో 55 శాతం వైద్యులను అందిస్తే కేవలం తెలంగాణలోనే ఒక ఏడాదిలో 43 శాతం వైద్యులను తయారు చేసిందని, ఇదంతా సీఎం కేసీఆర్ పాలన వల్లే సాధ్యమైందని వ్యక్తపరిచారు. తెలంగాణలో ఒక లక్ష మందికి 22 మంది వైద్యులు సేవలు అందించే నిష్పత్తి ఉందని వివరించారు.
సమైక్య పాలనలో పది జిల్లాలో కేవలం ఐదు మెడికల్ కళాశాలలు ఉండేవని, 1947 నుంచి 2014 దాకా తెలంగాణలో కేవలం రెండు మెడికల్ కళాశాలలు మాత్రమే ఏర్పాటు చేశారని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో 21 మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. వచ్చే ఏడాదిలో మరో ఎనిమిది వైద్యకళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బంగారు దేశం కావాలన్నా.. బంగారు తెలంగాణ కావాలన్నా విద్య, వైద్యం మెరుగ్గా ఉండాలని, ఆ దిశలోనే సీఎం కేసీఆర్ విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని చెప్పారు. కేంద్రం సున్నా సాయం చేసినా, సీఎం కేసీఆర్ తన ప్రభుత్వ నిధులతో దేశానికి దారి చూపే వ్యవస్థను తయారుచేస్తున్నారన్నారు.
రాష్ర్టాన్ని గత 60 ఏండ్లలో ఎంతో గొప్ప గొప్ప నాయకులు పాలించినా వ్యవసాయానికి సాగు నీరు ఇవ్వలేపోయారని, ఫలితంగా పొలాలు బీళ్లుగా మారి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. కానీ సీఎం కేసీఆర్ అనేక ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశారన్నారు. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్కపేట రిజర్వాయర్ను నిర్మించి, పూర్తిగా నీటితో నింపి ప్రారంభానికి సిద్ధం చేశారని, ఇది రైతుల కండ్లలో ఆనందాన్ని నింపుతుందన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్ కావాలా.. ఢిల్లీకి గులాంలు ఉన్న ప్రభుత్వాలు కావాలా..? ఒక్కసారి ఆలోచించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 65 ఏండ్లలో జరుగని అభివృద్ధి తొమ్మిదేండ్లలో జరిగితే బీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు.
ఎన్నికల్లో పైసలు, మందును తాము నమ్ముకోలేదని, సిరిసిల్ల ప్రజలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. పైసలకు అమ్ముడుపోయే ప్రజలు సిరిసిల్లలో లేరని వివరించారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానంటూ స్పష్టం చేశారు. తనకు తన తల్లి జన్మనిస్తే రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సిరిసిల్ల ప్రజలేనని, ఇది మనస్ఫూర్తిగా చెబుతున్నానని ఉద్ఘాటించారు. సిరిసిల్ల ప్రజలకోసం తాను ఎల్లకాలం పనిచేస్తానన్నారు. సిరిసిల్లకు నర్సింగ్, జేఎన్టీయూ, మెడికల్, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల, గంభీరావుపేటకు కేజీ టూ పీజీ, ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
అంతకుముందు మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం మెడికల్ కళాశాలలో మంత్రి కేటీఆర్ అధ్యాపకులు, వైద్యవిద్యార్థులతో మాట్లాడారు. స్వరాష్ట్రం ఏర్పాటైన వెంటనే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఏటా పదివేల మంది వైద్యవిద్య పూర్తి చేసుకొని వైద్యులుగా బయటకు వస్తారన్నారు. దేశంలో 43 మంది వైద్య విద్యార్థులు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే వస్తున్నారని తెలిపారు. కొత్తగా మెడికల్ కళాశాలలో చేరుతున్న విద్యార్థులకు అభినందలు తెలిపారు. వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడే రక్షకులని, దేవుళ్లతో సమానమని, అంతటి పవిత్రమైన వృత్తి వైద్యవృత్తి అని స్పష్టం చేశారు. వైద్యవృత్తిలో రాణిస్తూ తెలంగాణకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ప్రపంచంలో గొప్ప రాష్ట్రం
తెలంగాణను ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారు. శుక్రవారం ఒకే రోజు తొమ్మిది మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించడం అనందంగా ఉన్నది. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం దేశంలోనే చిన్నది. కానీ, ఇక్కడి ప్రభుత్వం ఏటా పది వేల మంది వైద్యవిద్యార్థులను తయారు చేస్తున్నది. నేను చదువుకునే రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం మూడు వైద్యకళాశాలలు ఉండేవి. అందులో కేవలం 350 సీట్లు ఉండేవి. కానీ, సీఎం కేసీఆర్ పాలనలో 21 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నాం. ఏటా పది వేల సీట్లు విద్యార్థులకు అందిస్తున్నది. నేను ఇప్పుడు చదువుకుంటే బాగుండు అనిపిస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో రకాల విద్యసదుపాయాలు కల్పిస్తున్నది. మా ఎడ్యుకేషన్ డేస్లో ఇలాంటి వసతులు లేవు.
– బీ వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు