బోయినపల్లి రూరల్, జూలై 3: ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (సర్) ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం బోయినపల్లిలో తహసీల్దార్ షరీఫ్ మహ్మద్ను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి, సర్పై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రతి గ్రామంలో బీఎల్వోలు, బీఎల్ఏలను వినియోగించి ప్రజలకు ఫారం ఎలా నింపాలో స్పష్టంగా వివరించాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. మలాపూర్కు చెందిన తుంటి మధూకర్ ఇంటికి అందించిన ఫారంలో చిరునామా వంటి వివరాలు సరిచూసుకోకుండా ఆన్లైన్ నమోదు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అలాగే స్థానిక వైద్యుడు భీమనాథుని రమేశ్ నింపిన ఫారాన్ని చూపిస్తూ, అవగాహన లేక చాలామంది తప్పుగా ఫారాలు నింపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులు తమ సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి, బీఎల్వోలతో కలిసి గ్రామాల్లో ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులో ఇప్పటికే ఎనిమిది రోజులు పూర్తయ్యాయని, ఇంకా చాలా చోట్ల సరైన అవగాహన లేక ఫారాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రస్తుత గడువు సరిపోదని, మరికొంత సమయం పొడిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, నిమ్మ శ్రీనివాస్రెడ్డి, కొనుకటి శేఖర్, అకెనపల్లి కరుణాకర్, బత్తిని కమల్గౌడ్, బోయిని రాజు, భీమనాథుని రమేశ్, జంగిడి సంజీవ్, తుంటి మధూకర్, మధు తదితరులు పాల్గొన్నారు.