కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 10: వేసవి వచ్చిందంటే చాలు నగరాలు, పట్టణాల్లో భూగర్భజలం అడుగంటిపోతున్నది. నీటి కటకట తీవ్రమవుతున్నది. ఇలా ఎద్దడి రాకుండా ఉండాలంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో గత కేసీఆర్ ప్రభుత్వం సైతం నగరాలు, పట్టణాల్లో నిర్మించే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కచ్చితంగా తవ్వుకోవాలనే నిబంధనను తీసుకొచ్చింది. అయితే చాలా మంది ప్రజలు విస్మరించినట్లు తెలుస్తున్నది.
ఇటీవల కర్ణాటకలోని బెంగళూర్లో నీటిని కొనుక్కొని వాడుకునే దుస్థితి రావడం, రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటుతుండడం ప్రతి ఒక్కరినీ భయపెడుతుండగా.. రాష్ట్ర మున్సిపల్ శాఖ అప్రమత్తమైంది. అసలు నగరాలు, పట్టణాల్లో ఏ మేరకు ఇంకుడు గుంతలు ఉన్నాయో పరిశీలించేందుకు సిద్ధమైంది. మొదటగా మూడు గుంటల విస్తీర్ణంలో నిర్మించిన ఇండ్లకు ఇంకుడు గుంతలు ఉన్నాయో.. లేదో.. తేల్చాలని నిర్ణయించింది.
ఆ మేరకు ప్రత్యేక సర్వే చేయాలని భావించింది. జియోట్యాగింగ్ కోసం ప్రత్యేక యాప్ను రూపొందించి ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. అధికారులు ఆయా ఇండ్లకు వెళ్లి ఇంకుడు గుంత ఉందో.. లేదో పరిశీలించడంతోపాటు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా, కరీంనగర్ నగరపాలక సంస్థలో వార్డు ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది 20 మందికి బాధ్యతలు అప్పగించగా, హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లోనూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు కట్టబెట్టారు.
వచ్చే నాలుగు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేయగా, అధికారులు బుధవారం నుంచే సర్వే ప్రారంభించారు. ఇంకుడు గుంతలు లేని ఇండ్ల వారికి నోటీసులు జారీ చేయనున్నారు. రానున్న రోజుల్లో చట్టపరమైన చర్యలు ఉండొచ్చని చెబుతున్నారు.