Korutla | కోరుట్ల, మే 9 : నిషేదిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు. పట్టణంలోని పలు కిరాణాషాపులు, ప్లాస్టిక్ దుకాణాలు, కూరగాయల షాపులు, టిఫిన్ సెంటర్లలో శనివారం మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా వ్యాపారులు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు రూ. 10,200 జరిమానా విధించారు. ఈమేరకు వ్యాపారులకు బట్ట సంచులు, పేపర్ సందుల వినియోగంపై అవగాహన కల్పించారు.
ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేదించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయించిన, కొనుగోలు చేసిన దుకాణదారులకు భారీ జరిమానాలు విధించడంతో పాటు దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. వ్యాపార కార్యకలాపాలతో వెలువడిన చెత్తను తడి, పొడి, హానికరక చెత్తగా వేరు చేసి షాప్ వద్దకు వచ్చే మున్సిపల్ వాహన సిబ్బందికి అందించాలని తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఇంచార్జీ శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, రికార్డు అసిస్టెంట్ జగదీష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.