వేములవాడ, నవంబర్ 9: యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి, స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్ల పాలనలో జరిగిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని పిలుపునిచ్చారు. వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నమ్మితో కష్టాలు తప్పవని, రాష్ట్రం అంధకారం అవుతుందని హెచ్చరించారు. గురువారం వేములవాడ అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయగా, వినోద్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్లో సీఎం పదవీ కోసం పోటీ చేయని నాయకులు కూడా తమకు వస్తుందని కలలు కంటున్నారని చెప్పారు. గతంలో ఇలానే పదవుల కోసం కొట్లాడుకొని అల్లర్లు సృష్టించారని, 300 మందిని బలి తీసుకున్నారని మండిపడ్డారు.
ఇప్పుడు కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న తీరు రాష్ర్టాభివృద్ధికి విఘాతం కలిగించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని, తొమ్మిదిన్నరేండ్లలో కర్ఫ్యూ అంటే ఏంతో తెలియని విధంగా కేసీఆర్ పాలన అందించారని ప్రశంసించారు. కాంగ్రెసోళ్ల మాయమాటలు గోసపడుతామని, మరోసారి హైదరాబాద్ ప్రశాంతత దెబ్బతినేలా వాళ్ల మాటలు వినిపిస్తున్నాయని విమర్శించారు.
ఆ పార్టీ చివరి ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. కానీ, నేడు సీఎం కేసీఆర్ వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు 24గంటల కరెంట్ ఇస్తున్నారని కొనియడారు. తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరించి, ఓట్లు అభ్యర్థించాలని కార్యకర్తలకు సూచించారు. మరోసారి గులాబీ జెండా ఎగువేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, జగిత్యాల జడ్పీ వైస్చైర్మన్ హరిచరణ్రావు, మార్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్రెడ్డి, జడ్పీటీసీలు మ్యాకల రవి, ఏశ వాణి, నాగం భూమయ్య, గట్ల మీనయ్య, ఎంపీపీలు బూర వజ్ర మ్మ, బండ మల్లేశంయాదవ్, చంద్రయ్యగౌడ్, బైరగోని లావణ్య, రేవతి, స్వరూపారాణి, సెస్ డైరెక్టర్లు నామాల ఉమ, రేగులపాటి హరిచరణ్రావు, ఆకుల దేవరాజు, పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగారామ్, ఉమ, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు ఊరడి ప్రవీణ్, గోస్కుల రవి, మ్యాకల ఎల్లయ్య, దయ్యాల కమాలకర్, గడీల గంగాప్రసాద్, సత్తిరెడ్డి, ఏఎంసీ చైర్మన్లు ప్రభాకర్రావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.