కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలను ఎండగడుతూ శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థి సంఘాలు పోరాటాలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్లో జరిగిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( ఎస్ఎఫ్ఐ ) రాష్ట్ర స్థాయి 4వ మహా సభకు వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. జాతీయ నూతన విద్యా విధానంపై విద్యార్థి సంఘాలు సమీక్షించాలని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు స్కిల్ ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపకులు ఉన్నా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక పోవడానికి గల కారణాలను విశ్లేషించాలని విద్యార్థి సంఘాల నాయకులకు సూచించారు.
విద్యార్థుల సమస్యలకు సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యా రంగ విధానాలు, సంస్కరణలపై దృష్టిని సారించాలని ఆయన చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఎడాపెడా విక్రయించడం, ప్రైవేటీకరణ చేయడం వంటి చర్యలను విద్యార్థి సంఘాలు ఎండగట్టాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. సామాజిక అంశాలపై, మతతత్వ రుగ్మతలపై కూడా విద్యార్థి సంఘాలు ప్రధానంగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని వినోద్ కుమార్ చెప్పారు.