కొత్తపల్లి, మే 24: కరీంనగర్లో జోగినపల్లి జగన్మోహన్రావు స్మారక రాష్ట్రస్థాయి టీ-20 క్రికెట్ పోటీలను జూన్ 10 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీ ఆగమరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్రికెట్ సంఘ భవనంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీఎల్ టీ-20 పేరుతో నిర్వహించనున్న ఈ పోటీల్లో తెలంగాణలోని 8 ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్, మెదక్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఐపీఎల్ తరహాలో ఈ పోటీలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విజేత జట్టుకు రూ. 2 లక్షలు, రన్నరప్కు రూ. లక్ష, తృతీయ బహుమతి రూ.
50 వేలు, నాల్గో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 25 వేలను నగదు ప్రోత్సాహకంగా అందిస్తామని తెలిపారు. ప్రతి జట్టులో మొత్తం 20 మంది సభ్యులు ఉంటారని, మ్యాచ్కు ముందు 16 మందిని ప్రకటించాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీల ప్రారంభ వేడుకలను కరీంనగర్లో నిర్వహిస్తామని, క్రీడాకారులకు ఉచితంగా క్రీడా దుస్తులు, కిట్లు, వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. ఫైనల్ మ్యాచ్లను, ముగింపు వేడుకలను హైదరాబాద్లో నిర్వహిస్తామన్నారు. మ్యాచ్లన్నీ యూట్యూబ్లో లైవ్గా ప్రసారమవుతాయన్నారు. 25 ఏళ్లలోపు క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శిగా సుమారు 35 ఏళ్ల పాటు పని చేసిన జే జగన్మోహన్రావు పేరిట స్మారక క్రికెట్ పోటీలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో క్రికెట్ సంఘం జిల్లా సభ్యులు ఎన్ మురళీధర్రావు, పీ మనోహర్రావు, కే రవీందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.