తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆంధ్రోళ్లకు ఇంకా ఆశ చావలేదని, కేసీఆర్ను ఓడగొట్టి రాష్ర్టాన్ని మళ్లీ ఆంధ్రాలో కలుపాలని చూస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీల ముసుగులో ఆంధ్రా నాయకులు హైదరాబాద్లో అడ్డా వేశారని, దొంగలకు సద్ది మోయద్దని సూచించారు. ఆయన ఆదివారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
ముందుగా బొమ్మకల్, మొగ్దుంపూర్, మల్కాపూర్ గ్రామాల నుంచి బీజేపీ, కాంగ్రెస్కు చెందిన పలువురు నాయకులు, కరీంనగర్లోని పలు డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. భగత్నగర్ రెడ్డి సంక్షేమ సంఘం, దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. సాయంత్రం నగరంలోని 4, 5, 27 డివిజన్లలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి ప్రసంగించారు.
– కార్పొరేషన్, నవంబర్ 5
కార్పొరేషన్, నవంబర్ 5: ‘తెలంగాణపై ఆంధ్రోళ్లకు ఇంకా ఆశ చావలేదు. కేసీఆర్ను ఓడగొట్టి తెలంగాణను ఆంధ్రాలో కలుపాలని చూస్తున్రు. కాంగ్రెస్, బీజేపీల ముసుగులో హైదరాబాద్లో అడ్డా వేసింన్రు. అవి ఢిల్లీ పార్టీలు. బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ. దొంగలకు సద్ది మోయద్దు. తెలంగాణను ఢిల్లీ, ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టి ఆగం కావద్దు. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే పథకాలను ఎత్తేస్తయి. బీఆర్ఎస్ మరోసారి వస్తే దివ్యాంగులకు 6 వేలు ఇస్తం. కారు గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి’ అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ దివ్యాంగులకు విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్తోనే దివ్యాంగులు ఆత్మ గౌరవంతో బతుకుతున్నారని, సాయం చేసిన వారిని మరవద్దని సూచించారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా నిలిచి బీఆర్ఎస్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఆదివారం స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. దివ్యాంగులు ఎంతో మంది వైకల్యాన్ని జయించి ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో నిలిచారన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులకు 75, 150 పింఛన్లు ఇచ్చారని వాపోయారు.
కానీ సీఎం కేసీఆర్ వారిని ఆదుకోవాలని 1500కు పెంచారని, అనంతరం వాటిని 3వేలు, ఇప్పుడు ఎవరూ అడగక ముందే 4 వేల పింఛన్ ఇస్తున్నారన్నారు. దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటర్ సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. దేవుడు అన్యాయం చేసినా సీఎం కేసీఆర్ మాత్రం దివ్యాంగులకు న్యాయం చేస్తున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే 6 వేల పింఛన్ ఇస్తామని భరోసా ఇచ్చారు. సమైక్య పాలనలో అరిగోస పడ్డామన్నారు. స్వయం పాలనలో దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మరోసారి కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు.
ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు తమ సమస్యలను మంత్రి గంగులకు వివరించారు. దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఫించన్లు అందిస్తుందని, కానీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరారు. దీనిపై ప్రభుత్వం, పాలకులు దృష్టి పెట్టాలని విన్నవించారు. దీంతో మంత్రి స్పందించి తప్పకుండా దివ్యాంగులకు మానేరు రివర్ ఫ్రంట్, ఇతర ప్రాజెక్టుల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా మాట్లాడి తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. మంచి మనస్సు ఉన్న మీరు ఆశీర్వాదం అందిస్తే తప్పకుండా అంతా మంచి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగులతో ఫొటోలు దిగేందుకు దివ్యాంగులు పోటీపడ్డారు. ఆత్మీయ సమ్మేళనంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పొన్నం ప్రభాకర్, దివ్యాంగుల సంఘ నాయకులు సంపత్, శ్రీనివాస్, భాస్కర్ పాల్గొన్నారు.