ఎన్నికల సమయంలో వచ్చే కాంగ్రెస్, బీజేపీని నమ్మొద్దని, నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కరీంనగర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఉదయం కొత్తపల్లి మండలంలోని నాగులమల్యాల, కొండాపూర్, ఐలోనిపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్లో పట్టణ వ్యాపార, వర్తక సంఘం, ఎల్ఐసీ ఏజెంట్ల సంఘం ఆధ్వర్యాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. సాయంత్రం నగరంలోని 14, 15, 16 డివిజన్లల్లో ఇంటింటి ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ప్రసంగించారు.
– కార్పొరేషన్/ కొత్తపల్లి, నవంబర్ 3
కొత్తపల్లి, నవంబర్ 3: ఎన్నికలప్పుడు మాత్రమే గ్రామాలకు వచ్చే కాంగ్రెస్, బీజేపీని నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని, ప్రతిక్షణం ప్రజల మధ్య ఉండి అభివృద్ధి చేసే బీఆర్ఎస్ నాయకులను ఆశీర్వదించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామంలోని లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పూజలు చేసి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం కొండాపూర్, ఖాజీపూర్, ఐలవోనిపల్లెలో ప్రచారం చేయగా, ప్రజలు డప్పు చప్పుళ్లతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన ప్రసంగించారు.
సమైక్యపాలనలో నాగులమల్యాల రావాలంటే రోడ్లు లేని దుస్థితి ఉండేదని, సాగు నీరు లేక రైతులు భూములమ్ముకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక పల్లెలకు మంచిరోజులు వచ్చాయన్నారు. ఎడారిగా మారిన చెరువులకు స్వయం పాలనలో పూర్వ వైభవం తీసుకువచ్చానని, ప్రతి గ్రామంలో నిండిన చెరువులతో పంటలు పుష్కలంగా పండుతున్నాయన్నారు. ప్రతి గ్రామాన్ని పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేశామని, కళ్లముందు కనిపిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తాను కౌన్సిలర్గా పనిచేసినా, మంత్రిగా పనిచేసినా.. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటున్నానని, ఆపదలో ఆదుకునే నాయకుడికే పట్టం కట్టాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారని, వారిని నమ్మితే మన బిడ్డల జీవితాలు అంధకారంలోకి వెళ్తాయన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ ఆ తర్వాత ఎంపీగా గెలిచినా ఎప్పుడైనా గ్రామాలకు వచ్చి ఒక్క పైసా అభివృద్ధి చేశారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయని నాయకులకు ఓట్లడిగే అర్హత లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పటి వరకు ఖరారు చేయలేదని, ఎవరెక్కువ డబ్బులిస్తే ఆ వ్యక్తికి సీటు ఇచ్చే ఆ పార్టీకి ఓట్లు ఎలా వేస్తామని ప్రశ్నించారు.
భూ కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడే నాయకులకు ఓట్లడిగే అర్హత లేదన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే దొంగ పార్టీల అభ్యర్థులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని దొంగలు, దోపిడీదారుల చేతుల్లో పెట్టవద్దన్నారు. మళ్లీ తప్పు చేసి తెలంగాణను గుడ్డి దీపం చేసుకోవద్దని, భవిష్యత్తు తరాల నోటిలో మన్ను కొట్టవద్దని కోరారు. ప్రజల మద్దతు చూస్తుంటే తాను నాలుగోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్న ధీమా ఉందన్నారు. ఈ సందర్భంగా నాగులమల్యాలలోని నాగుల చెరువు, లింగన్న కుంటను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు, తనకు మరోసారి ఓటు వేసి గెలిపిస్తే ఐదేళ్లు సేవ చేస్తానన్నారు. ఈ ప్రచారంలో ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్, జడ్పీటీసీ పిట్టల కరుణారవీందర్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, మాజీ శాసనసభ్యుడు కోడూరి సత్యనారాయణగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్గౌడ్, సర్పంచ్లు నాయిని ప్రసాద్, ఇల్లందుల రాజమ్మ, ఎంపీటీసీలు కొమ్ము హేమలత, మండల కో ఆప్షన్ సభ్యుడు షరీఫ్, ఉల్లందుల అనిల్, సట్టు శ్రీను, పంజాల రమేశ్ పాల్గొన్నారు.