కార్పొరేషన్, అక్టోబర్ 5: ‘కరీంనగర్ గడ్డపై ఒకసారి గెలిచిన వారు మళ్లీ గెలిచిన చరిత్రలేదు..అలాంటిది ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు.. మళ్లీ తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. రూ.133 కోట్ల సీఎం ఆష్యూరెన్స్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదట మేయర్ సునీల్రావుతో కలిసి 39వ డివిజన్ విద్యానగర్లో రూ.4 కోట్లతో సీసీ రోడ్డు, ఎస్డబ్ల్యూజీ పైప్లైన్, డ్రైనేజీ, కల్వర్టు పనులను కార్పొరేటర్ కొండపల్లి సరితా సతీశ్తో కలిసి భూమిపూజ చేశారు. డివిజన్లో కాలినడకన పర్యటించారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. అకడి నుంచి 38వ డివిజన్కు చేరుకోగా మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. సంతోష్నగర్లో అభివృద్ది పనుకు కార్పోరేటర్ కచ్చు రవితో కలిసి ప్రారంభించారు.
43వ డివిజన్ సవరన్ స్ట్రీట్లో కార్పోరేటర్ సరిళ్ల ప్రసాద్తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలోని డివిజన్లన్నింటినీ సమానంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. వేలాదికోట్లు వెచ్చించి నగర రూపురేఖలు మార్చామన్నారు. చాలా రోజుల తర్వాత కరీంనగర్ వచ్చిన వారు ఇకడి అభివృద్ధిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనని మరోసారి ఆశీర్వదిస్తే నగరాన్ని మరింత అభివృద్ది చేసి చూపిస్తానన్నారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి వద్దకు వెళ్లి నిధుల కోసం అడిగితే వెకిలిగా నవ్వారే తప్పా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కానీ స్వయం పాలనలో కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేలకోట్ల నిధులను విడుదల చేశారన్నారు. ఇప్పుడు ఢిల్లీ పాలకుల చేతుల్లోకి తెలంగాణ వెళ్తే మళ్లీ రాష్ట్రం గుడ్డిదీపంగా మారుతుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఒకవేళ తప్పు జరిగితే తెలంగాణ 50 ఏండ్లు వెనకి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.