కొత్తపల్లి, సెప్టెంబర్ 20 : ఆధునిక ప్రపంచంలో అనేక దేశాలు క్రీడల్లో దూసుకెళ్తుంటే మన దేశం మాత్రం వెనుకబడిపోయింది. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా క్రీడాకారులకు ప్రోత్సాహం అందకుండాపోగా, ప్రస్తుత బీజేపీ సర్కారు పాలనలోనూ అదే పునరావృతమవుతున్నది. ఈ పరిస్థితి మారాలంటే నాయకత్వ మార్పు జరగాలి.. అది కేసీఆర్తోనే మొదలుకావాలని’ క్రీడాకారుల లోకం ఒక్కటై చెబుతున్నది. స్వరాష్ట్రంలో క్రీడారంగానికి దక్కుతున్న ప్రాధాన్యం, ఆటగాళ్లకు అందుతున్న ప్రోత్సాహం దేశంలోని క్రీడాకారులందరికీ వర్తించాలంటే సార్ జాతీయ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముక్తకంఠంతో చెబుతున్నది. ఒక్క క్రీడాకారులకే కాదు, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అంటున్నది.
క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు
తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యమిస్తున్నది. క్రీడాకారులకు కొండంత చేయూతనిస్తున్నది. గ్రామీణ స్థాయి నుంచే ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగానే ఊరికో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నది. జిల్లాస్థాయిలో స్టేడియాలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నది. ప్రభుత్వోద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు 2 శాతం కోటాను భర్తీ చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే వందలాది మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. జాతీయ, అంతర్జాతీయ, ఏషియన్, ఒలింపిక్స్ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు కోట్లాది రూపాయలను బహుమతిగా అందజేస్తూ వారి ఉన్నతికి పాటుపడుతున్నది. ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే క్రీడాకారులకు ఇలాంటి ప్రోత్సాహకాలు, చేయూతనందిస్తుండగా.. కేంద్రం మాత్రం మొండిచెయ్యి చూపుతున్నది. రాష్ట్ర పరిస్థితులతో పాటు దేశ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే క్రీడారంగానికి మంచి ప్రాధాన్యం దక్కుతుంది. దేశంలోని క్రీడాకారులందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అందుకే క్రీడాకారులు, క్రీడా రంగాల ప్రతినిధులు కేసీఆర్కు మద్దతునిస్తున్నారు. క్రీడా రంగంపై కేంద్రం తీవ్రమైన వివక్ష చూపుతున్న నేపథ్యంలో కేసీఆర్లాంటి నాయకుడు దేశానికి అవసరమని ముక్తకంఠంతో చెబుతున్నారు.
– నందెల్లి మహిపాల్, కరీంనగర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యక్షుడు
క్రీడాకారులకు కొలువులు వస్తాయి..
ప్రభుత్వం రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తుంది. అత్యధిక లాభాలతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న ఎల్ఐసీని ప్రైవేటు పరం చేసే కుట్ర పన్నుతుంది. ఇక వర్గమనేది కాకుండా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణనే గర్వంగా చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాలి. ప్రభుత్వం రంగంలో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం క్రీడాకారులందరికీ సంతోషకరమైన వార్త. ఇది దేశంలోని క్రీడాకారులకు వర్తించాలి. రాష్ట్రంలోని క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభచూపినపుడు ఎంతగానో గౌరవించి ప్రోత్సహిస్తున్నారు. అలాంటి ప్రోత్సాహం అన్ని రాష్ర్టాలలోని క్రీడాకారులకు అందిస్తే మన దేశ ఖ్యాతి ఖండాంతరాలకు చాటుతుంది. ప్రపంచ స్థాయి పోటీలలో మన దేశానికి కీర్తి, ప్రతిష్టలు తీసుకొస్తారు.
– దేవత ప్రభాకర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్
అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు.
కేసీఆర్తోనే దేశ మార్పు సాధ్యం
స్వాతంత్య్రం వచ్చిందని చెప్పుకోవడం తప్పితే దేశంలో అంతగా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తే సరిపోదు. దేశం మొత్తం రావాలి. అది ఒక్క విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. మోడీ చేతికి పగ్గాలిస్తే.. భవిష్యత్లో సింగరేణి లాంటి ఎన్నో భారీ పరిశ్రమలు వాళ్ల బంధుగణం చేతిలోకి వెళ్లడం ఖాయం. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అతి తక్కువ టైంలోనే అనేక ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయ రంగానికి కేసీఆర్ జీవం పోశారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో క్రీడారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ఒక పెను మార్పు వస్తుందని గట్టిగా నమ్ముతున్నా.
– వీర్ల సంపత్కుమార్, ఆలిండియా క్రికెట్ క్రీడాకారుడు, సింగరేణి ఉద్యోగి, గోదావరిఖని.
విజన్ ఉన్న నాయకుడు..
విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరే అని వేరే చెప్పనక్కర్లేదు. దేశ రాజకీయాల్లో సమర్థవంతమైన నాయకత్వం కొరవడింది. పాలన గాడి తప్పుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా రానురానూ దిగజారుతోంది. ఇవ్వాళ దేశానికి మోడీ చేసిందేమీ లేదు. పేదల నడ్డి విరుస్తున్నడు. ధరల భారం మోపుతున్నడు. క్రీడారంగాన్ని దెబ్బతీస్తున్నడు. ఇలాంటి టైంలో తెలంగాణను ఎనిమిదేండ్లలోనే అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే పెనుమార్పులు రావడం మాత్రం ఖాయం. తెలంగాణను ఎలా ఆదర్శంగా నిలబెట్టాడో, దేశ రాజకీయాల్లోకి వస్తే దేశాన్ని ప్రపంచానికి దిక్సూచిగా నిలుపుతడనే నమ్మకం ఉంది.
– గాండ్ల రాజు, అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు, సింగరేణి ఉద్యోగి, గోదావరిఖని.
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి
మన రాష్ర్టానికి చెందిన వ్యక్తి కేంద్ర రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించడం గర్వించదగ్గ విషయం. దక్షిణాది రాష్ర్టాల నుంచి దేశ ప్రధాని అయితే ఇక్కడి రాష్ర్టాల వారి సమస్యలు అన్నీ తెలుస్తయి. కేసీఆర్ దేశ ప్రధాని అయితే రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి ప్రారంభించినట్లు దేశంలో అన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాలలు, యూనివర్సిటీలు ఏర్పాటవుతాయి. రాష్ట్రంలో క్రీడాకారులకు అందిస్తున్న చేయూతను, దేశంలో అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు వస్తాయి. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా పేదలకు అమలవుతాయి. అందుకే కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాలని కోరుకుంటున్నా.
– పడాల విశ్వప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ (జగిత్యాల)
దేశం మరింత అభివృద్ధి సాధిస్తుంది..
కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లో అవకాశం ఇస్తే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుంది. పేద ప్రజల బాగోగులు చూస్తారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేస్తారు. రాష్ట్రంలో ఉన్న గ్రామాలు, మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యం మెరుగుపడుతుంది. ఒలింపిక్ వంటి క్రీడల్లో దేశం మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. క్రీడాకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న చేయూత, దేశంలో కూడా అమలైతే మన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభచూపి దేశానికి పేరు తెస్తారు.
– సిరికొండ వేణు, పీఈటీ (జగిత్యాల)
క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యం..
రాష్ట్రంలో క్రీడాకారులకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలనే తలంపుతో క్రీడారంగం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ జిమ్లలో ఆధునిక క్రీడా పరికరాలు అమర్చి వ్యాయామంతో కలిగే ప్రయోజనాలు గుర్తించేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం క్రీడారంగానికి నిధులు అరకొరగా అందించినా రాష్ట్రం మాత్రం సొంత నిధులతో క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందిస్తుంది. ఇందుకు సింధూశర్మ, నిఖత్ జరీన్లు ప్రభుత్వ శిక్షణకు తురుపు ముక్కలుగా నిలిచారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళితే క్రీడలకు మంచి భవిష్యత్ ఉండడం ఖాయం. క్రీడాకారులను ప్రోత్సహించడంలో సీఎం కేసీఆర్కు సాటి ఎవరూ రారన్నది జగమెరిగిన సత్యం. క్రీడాభివృద్ధి కోసం సర్కారు చేస్తున్న కృషితో యువత చదువుతో పాటూ క్రీడారంగంపై ఎక్కువ మక్కువ చూపుతుంది. నైపుణ్యం సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుంది.
– మహ్మద్ అబ్దుల్ బారీ, వాలీబాల్ సీనియర్ క్రీడాకారుడు, కోచ్, కోరుట్ల
దేశ ప్రజలకు శుభసూచకం..
ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉంది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేస్తున్నారు. ఆయన అమలు చేస్తున్న పథకాలను చూసి కేంద్ర మంత్రులే మెచ్చుకున్నారు. జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి పథకాలు మా రాష్ట్రంలో అమలు చేయాలంటూ అనేక రాష్ర్టాల ప్రజలు, రైతులు కోరుతున్నారు. దీనిపై అనేక పత్రికలలో వార్తలు కూడా వస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంలోనూ తెలంగాణకు మరే రాష్ట్రం పోటీ పడలేదు. ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై చిత్తశుద్ధి, కార్యదక్షత ఉన్న నాయకుడు కేసీఆర్. అలాంటి నాయకుడి నాయకత్వం ఈ దేశానికి చాలా అవసరం. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాలు యావత్ దేశంలోని ప్రజలందరికీ అందాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. ఆయనతోనే క్రీడాకారులకు మంచి గుర్తింపు దక్కుతుంది.
– చెన్నమనేని శ్రీకుమార్, వాలీబాల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు.
క్రీడాకారులకు ప్రోత్సాహం..
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్రీడాకారులందరికీ ఒక గుర్తింపు వచ్చింది. ప్రతిభ ఉన్నప్పటికీ క్రీడలను ప్రోత్సహించే ప్రభుత్వాలు లేక చాలా మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించలేక పోయారు. ఆట స్థలాలు, స్టేడియాలు లేక పోవడం కూడా క్రీడలకు ప్రాధాన్యం లభించలేదు. సీఎం కేసీఆర్ క్రీడలను ప్రోత్సహించేందుకు జిల్లా, మండల స్థాయిలో క్రీడా మైదానాల ఏర్పాటుపై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. జిల్లాలో మినీ స్టేడియాన్ని నిర్మించడం వల్ల రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారుల ఎంపిక ఇక్కడే జరుగుతుంది. క్రీడలను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని రాష్ర్టాలలోని తాలూకాలలో క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి పల్లె నుంచి క్రీడాకారులు ముందుకు వచ్చి తమ ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ముందుకొస్తారు.
– బొజ్జ చంద్రశేఖర్, అథ్లెటిక్ అసోసియేషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి.
సీఎం కేసీఆర్తో గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యం..
గతంలో గ్రామీణ క్రీడాకారులను పట్టించుకున్నవారే లేరు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడాకారులకు, క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి నిత్యం యువకులు కసరత్తు చేసుకునేందుకు, క్రీడల్లో నైపుణ్యం పెంచేందుకు అన్ని సౌకర్యాలు కల్పించారు. తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, టేబుల్ టెన్నిస్లో కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన శ్రీజ, వాలీబాల్ ఆసియా గేమ్స్లో పాల్గొన్న చందు లావణ్య, మారుమూల గ్రామం నుంచి ఏషియన్ క్రీడల వాలీబాల్ కోచ్గా పనిచేసిన కోసరి కృష్ణప్రసాద్ తదితరులను ప్రోత్సహించారు. ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు నివాస స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు నిధులు కూడా మంజూరు చేశారు. గతంలో తెలంగాణ క్రీడాకారులకు జాతీయస్థాయిలో పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కానీ సీఎం కేసీఆర్ చొరవతో ఎందరో క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ క్రీడలలో పాల్గొంటూ దేశానికి వన్నె తెస్తున్నారు. ఇంతలా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే జాతీయ క్రీడలకు ప్రాధాన్యత దకడమే గాక క్రీడలకు, క్రీడాకారులకు ఎంతో భవిష్యత్తు దొరుకుతుంది. క్రీడారంగం పుంజుకుంటుంది. భవిష్యత్తులో జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ మరిన్ని పతకాలు సాధిస్తుంది. తప్పకుండా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని కావాలని ఒక క్రీడాకారుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
– మోటపోతుల విక్రమ్, జాతీయ హాకీ క్రీడాకారుడు(హుజూరాబాద్టౌన్)
సీఎం కేసీఆర్తోనే శాట్స్లో ఉద్యోగం
అమ్మాయిలు యుద్ధక్రీడలు నేర్చుకోవడమే గగనమైన రోజుల్లోనే నేను కరాటే నేర్చుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించా. సుమారు 500 పైగానే అవార్డులు సాధించా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రభుత్వాలు, పాలకులు మారినా నాకు ఉపాధి కల్పించలేదు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి కేటీఆర్, హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకొని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్)లో డాటా ఎంట్రీ ఆఫీసర్గా ఉద్యోగ అవకాశం కల్పించారు. ఇప్పటికీ అదే జాబ్లో కొనసాగుతూ అమ్మాయిల ఆత్మరక్షణపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా. తెలంగాణ ప్రభుత్వమే నా ప్రతిభను గుర్తించి ఉద్యోగ అవకాశం కల్పించింది. కరాటే క్రీడలో అమ్మాయికి జాబ్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్దే. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే క్రీడా రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఏషియన్, ఒలింపిక్స్ స్థాయి పోటీల్లో సత్తాచాటుతూ పతకాలు సాధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వమే నాకు పెద్ద దిక్కైంది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా నాలాంటి ఎంతో మంది క్రీడాకారులు, క్రీడారంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
– అంజనా, అంతర్జాతీయ కరాటే క్రీడాకారిణి (కొత్తపల్లి)