నేడు సెలవు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. అలాగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.
మున్సిపల్ సమరం తుది అంకానికి చేరింది. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియగా, నేటి పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ సాగనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 10 : మున్సిపల్ పోరుకు గత నెల 27న షెడ్యూల్ విడుదలతో తెరలేచింది. ఆ మరుసటి రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,283 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, ఎక్కడికక్కడ ప్రచారం హోరెత్తింది. సోమవారం సాయంత్రం 5గంటలకు ప్రచారానికి తెరపడగా, బుధవారం పోలింగ్ ప్రక్రియ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుండగా, అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 10,30,961 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, 1,586 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు.
అలాగే డివిజన్లకు ప్రత్యేక రూట్లను నిర్ణయించి, జోనల్ అధికారులను నియమించారు. అన్ని బల్దియాల్లో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, బందోబస్తు నిర్వహిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి వంద మీటర్ల వరకు ఆంక్షలు విధించారు. అలాగే అన్ని బూత్ల వద్ద దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. కాగా, మంగళవారం అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో సామగ్రితో పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియను ఎన్నికల అధికారులు పరిశీలించి, సలహాలు సూచనలు ఇచ్చారు.

ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్పుతోపాటు గుర్తింపు కార్డు విధిగా తీసుకెళ్లాలి. ఎన్నికల కమిషన్ అనుమతించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి కచ్చితంగా చూపాలి. ఆధార్, ఓటరు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు తీసుకెళ్లచ్చు. ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంకు, పోస్టాఫీస్ పాస్బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు కూడా చూపి ఓటు వేయచ్చు.
2 కార్పొరేషన్లు : 126 డివిజన్లు
13 మున్సిపాలిటీలు : 341 వార్డులు
బరిలో నిలిచిన అభ్యర్థులు : 2,283 మంది
మొత్తం ఓటర్లు : 10,30,961 మంది
పోలింగ్ బూత్లు : 1,586
పోలింగ్ బూత్లోకి సెల్ఫోన్లను అనుమతించరు
సాయంత్రం 5 గంటల వరకు బూత్లో ఉన్నవారికే ఓటు వేసే అవకాశం
మోడల్ కేంద్రాల్లో మొదటగా ఓటు వేసి పది మంది ఓటర్లకు పూల మొక్కలు అందజేత
