జగిత్యాల, అక్టోబర్ 19: ‘కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వయసు మల్లి, మతి గతి తప్పింది. మద్యం తాగిన వ్యక్తి వలె ఏదోదే మాట్లాడుతున్నడు. ఎమ్మెల్సీ కవితపై వ్యంగ్యం గా మాట్లాడడం ఆయన స్థాయికి తగదు’ అని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మహిళలకు ఇచ్చే గౌర వం ఇదేనా.. అంటూ ప్రశ్నించారు. గౌరమ్మను అవమానించిన జీవన్ రెడ్డి పల్లెల్లో, వార్డుల్లోకి వచ్చినప్పుడు మహిళా సోదరీమణులు నిలదీయాలని కోరారు. వెంటనే భేషరతుగా ఎమ్మెల్సీ కవితకు జీవన్రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేశారు.
మరోసారి ఇలా అవాకులు, చవాకులు పేలితే ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించారు. జగిత్యాల బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిక అయిన బతుకమ్మతో పాటు, దైవంగా భావించే గౌరమ్మను అవమానించేలా ఆయన మాట్లాడడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజ యం ఖాయమని, జగిత్యాలలో బీఆర్ఎస్ జో రును చూసి జీవన్ రెడ్డికి భయం పట్టుకున్నదని, దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయి ఏదేదో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘రాను రాను రాజు గుర్రం ఏదో అయ్యింది’ అన్నట్లుగా జీవన్ రెడ్డి వైఖరి ఉందని ఎద్దేవా చేశారు.
నీ బిడ్డ వయసున్న ఆడబిడ్డ, సహచర మహిళా ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్సీ కవితను వ్యంగ్యంగా మాట్లాడడం ఆయన రాజకీయ నైతికతకు, అనుభవానికి తగదన్నారు. గత ఎన్నికల్లో జగిత్యాలలో క్లీన్ బౌల్డ్ చేశారనే భయం, ప్రస్తుతం గెలుస్తానా..? లేదా..? అనే ఆందోళన, కలవరమే ఆయనను సోయి తప్పేలా చేస్తున్నాయని, అందుకే ఇలాం టి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమైక్యాంధ్ర పాలనలో ఆనాటి సీఎం వైఎస్ఆర్ కాళ్లు ఒత్తుకుంటూ, పదవుల కోసం పెదవులు మూసుకొని కూర్చున్న ఆయన కవితను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
‘తెలంగాణ ఉద్యమంలో మీ కాంట్రీబ్యూషన్ ఏంటో చెప్పాలని జడ్పీ చైర్ పర్సన్ వసంత డిమాండ్ చేశారు. జీవన్రెడ్డి ఇంట్లోని మహిళలు బతుకమ్మ మధ్యలో మందు బాటిల్ పెట్టి బతుకమ్మ ఆడుతున్నారా..? చెప్పాలని ప్రశ్నించారు. సోనియా, రాహుల్కు హెరాల్డ్ పత్రికకు సంబంధించి నోటీసులు వచ్చాయని, మరి సోనియాను హెరాల్డ్ రాణి అని పిలువాలని భావిస్తున్నారా..? అని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోవడంతో అభివృద్ధి ఆగిపోయిందని, గెలిచి ఉంటే అభివృద్ధి మరింత ఉండేదని గతంలో పలు ప్రెస్మీట్లలో మాట్లాడిన జీవన్రెడ్డి, ఇప్పు డు ఏం అభివృద్ధి చేశారని మాట్లాడుతున్నారని, ఆయనది నోరా? మోరా..? అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.
ఇక్కడ పట్టణ అధ్యక్షులు గట్టు సతీశ్, మున్సిపల్ చైర్ పర్సన్ గోలి శ్రీనివాస్, అర్బన్ మండల ఎంపీపీ మూలసపు లక్ష్మి, రాయికల్ ఏఎంసీ చైర్ పర్సన్ మారంపెల్లి రాణి సాయి కుమార్, జగిత్యాల ప్యాక్స్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, కౌన్సిలర్లు సమిండ్ల వాణి శ్రీనివాస్, బద్దం లత జగన్, బాలే లత శంకర్, వొద్దినేని లత రాంమోహన్, సీనియర్ నాయకురాలు వజ్రమ్మ, నాయకులు సత్యం, గంగారెడ్డి ఉన్నారు.