మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలు, తొలి చారిత్రాత్మక యుగం నాటి మట్టి పాత్రలు, ఆట వస్తువులు, ఆభరణాలు, 20 కోట్ల ఏండ్లనాటి వృక్ష శిలాజాలు, పాతరాతి, సూక్ష్మరాతి యుగం నాటి పనిముట్లు, శాతవాహన కాలానికి చెందిన నాణేలు, వివిధ కాలాల నాటి లిపిలు.. ఇలా ఏండ్లనాటి చారిత్రక సంపదతో పెద్దపల్లిలోని కలెక్టరేట్లో మ్యూజియం సిద్ధమైంది.
కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ చొరవతో చారిత్రక వైభవానికి అద్దంపట్టేలా రూపుదిద్దుకున్నది. ఇంకా ఈ ప్రాంత పూర్వపు చరిత్రాత్మక ప్రదేశాలు, ప్రాచీన ఆలయాల విశిష్టతను తెలియజేసేలా చరిత్ర పరిశోధకులు, ఆర్కియాలజీ, పౌరసంబంధాల శాఖల అధికారులు ఫొటోల రూపంలో భద్రపరుచడమేకాదు, గోడలపై ఏర్పాటు చేయగా, ఈ ఆధునిక ప్రదర్శన శాల చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. త్వరలోనే మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
– పెద్దపల్లి, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ)
Peddapalli | పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రధాన ప్రాంగణ సమావేశ మందిరం లాబీలో ప్రత్యేకంగా మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఆదిమానవులు, శాతవాహనులు, కాకతీయుల కాలాలకు సంబంధించి సేకరించిన పనిముట్లు, వస్తువులు, వేల ఏండ్ల నాటి చేప, వృక్ష, ఆకు, జీవ శిలాజాలను ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా 180-65 మిలియన్ ఏండ్ల క్రితం నాటి చేప శిలాజాలు, 2544 ఏండ్ల క్రితం తొలి చారిత్రాత్మక యుగం నాటి మట్టి పాత్రలు, ఆట వస్తువులు, ఆభరణాలు, సూక్ష్మరాతి, పాతరాతి, కొత్తరాతి యుగం పనిముట్లు, 20 కోట్ల ఏండ్లనాటి వృక్ష శిలాజాలు,
కోట్ల ఏండ్ల క్రితం నాటి మొక్క శిలాజాలు, సూక్ష్మరాతి యుగం రాతి పనిముట్లు, జిల్లాలోని పెద్దబొంకూరు, ధూళికట్టల్లో లభ్యమైన శాతవాహన కాలానికి చెందిన నాణేలు, జిల్లాలోని తేలుకుంటలో లభ్యమైన క్రీస్తు శకం 4వ శతాబ్ధం నాటి విష్ణుకుండినుల నాణేలు, బ్రిటీషు కాలం నాటి నాణేలు, వివిధ కాలాల నాటి లిపిలు, అక్షరమాలను మ్యూజియంలో ప్రత్యేకంగా పొందుపరిచారు. ఈ మ్యూజియాన్ని త్వరలోనే రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఆలయాల ఫొటోలను మ్యూజియంలో పొందు పరిచారు. ఓదెల మల్లికార్జున స్వామి, మంథనిలోని శ్రీ గౌతమేశ్వర స్వామి, మహాలక్ష్మీ, భిక్షేశ్వరస్వామి, మహాగణపతి, కన్నాల వేంకటేశ్వర స్వామి, ముత్తారం గుట్టపై ముక్తేశ్వరస్వామి, రంగనాయక స్వాముల దేవాలయం, రాగినేడు శివాలయం, దేవునిపల్లిలో నృసింహస్వామి ఆలయం, నందిమేడారంలో అమరేశ్వర ఆలయం, త్రికూటాలయం, భారీ నంది విగ్రహం, ఖనిలోని జనగామ శివాలయం ఇలా ఆలయాల ఫొటోలను డిజిటలైజ్ చేసి ఇక్కడ ఉంచారు.
పలు ప్రాంతాల్లో లభ్యమైన వృక్ష, జంతు శిలాజాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. అందుకు కలెక్టరేట్ గేట్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఉన్న ప్రధాన రహదారి, పక్కన పార్క్లలో ప్రత్యేకంగా గద్దెలను నిర్మించి శిలాజాలను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు.
ఆలయాలతోపాటు చారిత్రాత్మక ప్రదేశాల డిజిటల్ ఫొటోలను మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. రామగిరి ఖిల్లా, దూళికట్ట బౌద్ధస్తూపం, మంథని మండలం ఖానాపూర్లోని మొసల్లమడుగు(ఎల్ మడుగు), రామగుండంలోని రామునిగుండాలు, సబ్బితం, పాండవలంక జలపాతాలు, కాల్వశ్రీరాంపూర్లోని వేద పాఠశాల, సుల్తానాబాద్ మండలంలోని మూడుజాముల కొదురుపాక, బసంత్నగర్లోని బుగ్గ గుట్ట, గుంజపడుగులోని కాసిపేట గుళ్లు, ఖమ్మంపల్లిలోని సందరెల్లి గుళ్లు ఇలా ఎన్నో ప్రదేశాల ఫొటోలను ఉంచారు. అలాగే గోదావరి బ్రిడ్జి, జిల్లాపరిధిలోని కాళేశ్వరం పంప్హౌస్లు, బ్యారేజీలు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, పాలకుర్తి మండలం అటవీశాఖ పార్ ఇలా ఎన్నో చిత్రాలను పొందుపరిచారు.
చరిత్రను భావితరాల వారు తెలుసుకునే విధంగా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ప్రత్యేక చొరవ తీసుకొని కలెక్టరేట్లో మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఇందుకు అధికారులు, సిబ్బంది ఎంతగానో శ్రమించారు. దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. ప్రజలు సందర్శించి మన ప్రాంత గొప్పతనాన్ని తెలుసుకోవాలి.
– సముద్రాల సునీల్, చరిత్ర పరిశోధకుడు (బేగంపేట)