Putta Madhukar | రామగిరి, ఏప్రిల్ 11 : అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మహనీయుల ఆలోచనలను అర్థం చేసుకోవడం అవసరమని, వారి ఆశయాలతోనే సామాజిక మార్పు జరుగుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే మాసోత్సవాల సందర్భంగా రామగిరి మండలం సెంటీనరీ కాలనీలో పూలే విగ్రహానికి శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవమానం, బానిసత్వం నిర్మూలనకే తన పోరాటమని తెలిపారు. మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్నానని చెప్పారు. బీసీలు, ఎస్సీలు ఐక్యంగా ఉండాలని, కుల విభజనలు మానుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు సమాజ సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు.
మహనీయుల చరిత్రను అర్థం చేసుకున్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూదరి సత్యనారాయణ గౌడ్, శెంకేసి రవీందర్, కాపుర బోయిన భాస్కర్, అత్తే చంద్రమౌళి, పల్లె ప్రతిమ పీవీ రావు, మంతెన చంటి, శంకర్ లాల్, అసం తిరుపతి, సాంబయ్య, మాచిడి రాజు గౌడ్, బడికెల శ్రీనివాస్, మైదం కుమార్, రాసకొండ లక్ష్మణ్, బొంకూరి పోషం తదితరులు పాల్గొన్నారు.