చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. నిన్నా మొన్నటిదాకా కిలో చికెన్(స్కిన్లెస్) ధర 220 పలుకగా, ఇప్పుడు ఒక్కసారిగా 150కి తగ్గింది. అదే విత్ స్కిన్ అయితే 120కే దొరుకుతున్నది. ఇక లైవ్ బర్డ్ విషయానికి వస్తే గతంలో కిలో ధర రూ.130 దాకా ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.100 లోపు పలుకుతోంది. ఇది ఒక రకంగా వినియోగదారులకు ఆనందాన్నే కలిగిస్తున్నప్పటికీ తగ్గుతున్న కోళ్ల ధరలు పౌల్ట్రీ రైతును కుదేలు చేస్తోంది. లేయర్ కోళ్ల పెంపకం దారుల పరిస్థితి ఫరవా లేదనిపిస్తున్నా బాయిలర్ రైతులకు కష్టం వచ్చిపడింది. కార్తీక మాసం కావడం, కోళ్ల ఉత్పత్తి పెరుగడమే ఇందుకు కారణమని చెబుతున్నా, పరిశ్రమలోకి కార్పొరేట్ కంపెనీలు ఎంటర్కావడమే మరో రీజన్గా వినిపిస్తున్నది.
కరీంనగర్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : బాయిలర్ కోళ్ల పెంపకం కత్తి మీద సాములా మారింది. ఒక పక్క పెరుగుతున్న ఫీడ్ ధరలు, తగ్గుతున్న కోళ్ల ధరలు కలగలిపి ఫౌల్ట్రీ రైతును కుదేలు చేస్తున్నాయి. లేయర్ కోళ్ల పెంపకం దారుల పరిస్థితి ఫరవా లేదనిపిస్తున్నా బ్రాయిలర్ రైతులకే కష్టాలు వచ్చి పడ్డాయి. ఫలితంగా ఇన్నాళ్లూ కొండెక్కిన చికెన్ ధర దిగివస్తోంది. నిన్నా మొన్నటిదాకా కిలో చికెన్ (స్కిన్లెస్) ధర 220 పలుకగా, ఇప్పుడు ఒక్కసారిగా 150కి పడిపోయింది. అదే విత్ స్కిన్ అయితే 120కే దొరుకుతున్నది.
కోళ్ల పెంపకం అనేది ఫౌల్ట్రీ రైతులకు తీవ్ర నిరాశను మిగిలిస్తోంది. గతంలో మంచి లాభసాటి పరిశ్రమగా కొనసాగిన ఫౌల్ట్రీ రంగంలోకి అనేక మంది ఉత్సాహంగా ప్రవేశించారు. మంచి లాభాలను కూడా ఆర్జించారు. ఈ రంగంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రవేశించడంతో మామూలు రైతులు సదరు సంస్థలతో పోటీ పడలేని పరిస్థితి నెలకొన్నది. క్రమంగా ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తోంది. గత కొన్నాళ్లుగా ఫౌల్ట్రీ రంగం ముఖ్యంగా బాయిలర్ రైతులు నష్టాలను చవిచూస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఒక పక్క ఫీడ్ ధరలు పెరగడం, కోడి పిల్లల ధరలు ఆకాశానికి అంటడం, పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. లేయర్ కోళ్ల పెంపకం రైతులు కాస్త అటీటుగా అటు లాభాలు కాకుండా ఇటు నష్టాలు కాకుండా అన్నట్లుగా కొనసాగుతుంటే బాయిలర్ కోళ్ల పెంపంలో ఉన్న రైతులు మాత్రం క్రమంగా తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్నారు.
కోళ్లకు ఇచ్చే దానా కింద వివిధ రకాల ఫీడ్స్ను అందిస్తుంటారు. మార్కెట్లో దానా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏడాది కిందటి వరకు రూ.1,500, 1,600 మాత్రమే ఉన్న మక్కల ధర ఇపుడు రూ.2,340 నుంచి రూ.2,400 వరకు పలుకుతోంది. మంచి ఆహారంగా అందించేందుకు సోయాబిన్ వంటి ఫీడ్ ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. రూ.5,200 క్వింటాలు అవుతోంది. ఈ లెక్కన ఒక్క కోడి కిలో బరువు వచ్చేందుకు కనీసం రూ.90 నుంచి 100 విలువైన దాన ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా కోడి పిల్లల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కోళ్లు పెంచడానికి అయ్యే కరెంట్ చార్జీలు, కూలీలకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అంతకు మించి మెడిసిన్ ఖర్చులు కూడా భరించాల్సి వస్తోంది.
ఇటీవలి కాలంలో బాయిలర్ కోళ్ల ధరలు బాగా తగ్గిపోతున్నాయి. వీటి ధరలు కార్పొరేట్ సంస్థలు, ట్రేడర్లు నిర్ణయిస్తుండడంతో సాధారణ రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. గతంలో కోడి కిలో ధర రూ.120 నుంచి రూ.130 దాకా ఉండేది. ఇపుడు రూ.50 నుంచి 60కి పడిపోయింది. ఒక్క కోడి కటింగ్ వచ్చే వరకు పెంచాలంటే కనీసం రూ.90 నుంచి రూ.100 పెట్టుబడి పెడుతున్న రైతులు, ఇపుడు ఎంత నష్టాన్ని ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కనీసం రూ.90కి కిలో కోడి అమ్మినా లాభ నష్టాలు లేకుండా పెట్టుబడి చేతికి వచ్చేది. కానీ ఇపుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఒక్కో కోడిపై రూ.40 నుంచి రూ.50 నష్టానికి అమ్ముకోవాల్సి వస్తోందని ఫౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. ఈ లెక్కన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 30 లక్షల కోళ్లు రీప్లెస్మెంట్ చేస్తుంటారు. అంటే ఒక్కో కోడిపై రైతులకు ఎంత నష్టం వస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
కోళ్ల ధరలు పడిపోవడంతో ప్రత్యక్షంగా రైతులపైనే కాకుండా పరోక్షంగా కూడా పలువురిపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కోళ్లను రవాణా చేసే వారిపై చికెన్ సెంటర్లు నడుపుకునే వారిపైనా దీని ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందనే భావన కనిపిస్తున్నా, గత కొంత కాలంగా నష్టాలు చవి చూస్తున్న బాయిలర్ రైతులు ఈ కారణాన్ని పూర్తిగా అంగీకరించడం లేదు. పెరుగుతున్న ఫీడ్ ధరలు, తగ్గుతున్న కోళ్ల ధరలు గత కొంత కాలంగా హెచ్చతగ్గులకు గురవుతున్న పరిశ్రమ పరిస్థితిని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. ప్రస్తుతం హోల్సెల్గా విక్రయించే చికెన్ ధరలను పరిశీలిస్తే లైవ్ కోడికి కిలో ధర రూ.100, చికెన్ ధర రూ.130, స్కిన్ లెస్ అయితే రూ.160 పలుకుతోంది. అంటే ఒకప్పుడు రైతుకు కిలో కోడికి పడిన ధర ఇపుడు హోల్ సెల్ చికెన్కు పలుకుతోంది. ఈ పరిస్థితిని తెలుసుకుంటే బ్రాయిలర్ కోళ్ల రైతులు ఎంతగా నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం పౌల్ట్రీ రైతులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాల నుంచి కోలుకోవడం కష్టమే. కొన్ని కార్పొరేట్ కంపెనీలు పౌల్ట్రీ రంగంలోకి రావడంతోనే రైతులకు ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల పోటీతత్వమే చిన్నచిన్న పౌల్ట్రీ రైతులకు ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. కొన్ని యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే నష్టాలను పూడ్చుకోవచ్చు. అదనపు ఖర్చులను తగ్గించుకోవాలి. ప్రభుత్వం కూడా చిన్నచిన్న పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలి. కిలో చికెన్ ధర రూ.200 ఉంటే రైతుకు పెట్టుబడి మీద పడదు.
– వెంకట్రెడ్డి, పౌల్ట్రీ రైతు(హుజూరాబాద్)
కార్తీక మాసం కావడంతో గిరాకీలు బాగా తగ్గాయి. దీనికితోడు కోళ్లు, చికెన్ ధరలు సైతం బాగా తగ్గాయి. గతంలో ఉన్న ధరకు ఇప్పటి ధరకు దాదాపు సగం వరకూ తగ్గింది. పేపర్ రేట్ తగ్గుతూ వస్తున్నది. బాయిలర్ ధరలు తగ్గాయి. కాకపోతే ఉన్నకాడికి బాయిలర్ కోళ్లు, చికెన్ మాత్రమే ఎక్కువగా సేల్స్ ఉంటది. కానీ ఇప్పుడు మార్కెట్లో ధరలు పడిపోయినై.
– ఎండీ ఆసీఫ్ఖాన్, చికెన్, వ్యాపారి పెద్దపల్లి
కోళ్ల ధరలు బాగా తగ్గాయి. పేపర్ రేట్ ప్రకారం కిలో కోడి రూ.70ఉంది. చికెన్ రేటు కూడా తగ్గించాం. కోళ్ల సైజు పెద్దగానే ఉన్నా, రేటు మాత్రం తక్కువగానే ఉంది. మొన్నటి వరకు ధరలు బాగానే ఉండేది. కానీ పేపర్ ధర తగ్గుతూ పోతున్నది. సేలింగ్ కూడా తక్కువగానే అవుతున్నది. అందుకే తక్కువగానే వేసుకొని అమ్ముతున్నాం. పగలంతా ఖాళీగానే ఉంటున్నం. పెద్దగా గిరాకీ ఉండడం లేదు.
– షేక్ ఇస్మాయిల్, చికెన్ వ్యాపారి, మంథని