రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్లటౌన్: ‘బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ లాంటి వస్త్ర ఉత్పత్తులు, కేసీఆర్ కిట్ బట్టల తయారీ, ఆర్వీఎం బట్టల తయారీ ఆర్డర్లు అధిక శాతం సిరిసిల్లకే ఇచ్చి నేతన్నలను ఆదుకోవాలి. సిరిసిల్లలో అధిక శాతం మంది పవర్లూం పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నందున సిరిసిల్లలో ఉన్న 20 వేల పైచిలుకు మరమగ్గాలకు 90శాతం విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి’ అని సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ కోరింది.
శనివారం చైర్పర్సన్ జిందం కళ అధ్యతక్షన నిర్వహించిన సమావేశంలో నేత కార్మికులు, ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని 18 అంశాలతో రూపొందించిన ఎజెండాను ప్రవేశపెట్టగా, సభ్యులు అన్ని అంశాలను చర్చించి ఆమోదించారు. ఏకగ్రీవంగా తీర్మానం చేసి, వాటి ప్రతులను ప్రభుత్వానికి పంపించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కమిషనర్ మీర్జా ఆలీబేగ్, టీపీవో అన్సారీ, సెస్ ఎండీ సూర్యచందర్రావు, సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ వివరాలను వెల్లడించారు.