మాతాశిశు సంరక్షణలో దూసుకెళ్తూ, రికార్డులు నెలకొల్పుతున్న సిరిసిల్ల పెద్ద దవాఖాన, మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందిస్తున్న సేవలకుగాను జాతీయ ఖ్యాతి దక్కింది. ప్రసూతి సేవల్లో పాటిస్తున్న జాతీయ స్థాయి ప్రమాణాలకుగాను రెండ్రోజుల క్రితమే ప్రతిష్టాత్మక ‘లక్ష్య’ సర్టిఫికెట్కు ఎంపికైంది. దీని కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 3లక్షల ప్రోత్సాహకం రానుండగా, వైద్యులు, సిబ్బందిలో హర్షం వ్యక్తమవుతున్నది.
– సిరిసిల్ల టౌన్, జూలై 13
సిరిసిల్ల టౌన్, జూలై 14: ప్రసూతి సేవల్లో సిరిసిల్ల జిల్లా దవాఖాన ముందు వరుసలో నిలుస్తున్నది. ప్రసూతి సేవల్లో మెరుగైన ప్రమాణాలకుగాను కేంద్రం ప్రభుత్వ ‘లక్ష్య’ సర్టిఫికెట్ను దక్కించుకుంది. మంత్రి కేటీఆర్ సహకారంతో కార్పొరేట్కు ధీటుగా మారిన దవాఖానలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల సంరక్షణ, ప్రసూతి సేవలో జాతీయ స్థాయి ప్రమాణాలకు గాను ఈ గుర్తింపు దక్కింది. ఈ నెల 12వ తేదీనే లక్ష్య సర్టిఫికెట్కు ఎంపిక కాగా, వైద్యయంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
ఉత్తమ సేవలకు ప్రోత్సాహం
ప్రసవాలు, మాతాశిశు సంరక్షణలో నాణ్యతాప్రమాణాలతో కూడిన వైద్యం అందించేలా ప్రసూతి విభాగాలు ఉండాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం దవాఖానలకు కొన్నేళ్లుగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. వాటిని పొందాలంటే ప్రసూతి, చిన్న పిల్లల విభాగాలలో జాతీయ స్థాయి ప్రమాణాలు విధిగా పాటించాలని సూచిస్తోంది. ఆ వసతుల్ని జాతీయ స్థాయి బృందం పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేస్తే లక్ష్య ధుృవపత్రాన్ని ప్రదానం చేయడంతోపాటు సదరు దవాఖానకు కేంద్రం నుంచి ప్రోత్సాహక నిధులు కూడా ఇస్తున్నది. కాగా, ఈ ప్రోత్సాహకం కోసం జిల్లా దవాఖాన కొద్దిరోజుల క్రితమే దరఖాస్తు చేసుకోగా, కేంద్ర బృందం వచ్చి పరిశీలించింది.
కేంద్ర బృందం సంతృప్తి
లక్ష్య అవార్డు(ధ్రువీకరణపత్రం) ఎంపికలో భాగంగా కేంద్ర బృందం గత ఏప్రిల్ 12, 13న జిల్లా దవాఖానను క్షేత్ర స్థాయిలో సందర్శించింది. వైద్య సేవలు, నాణ్యతా ప్రమాణాలపై సంతృప్తిచెందిన బృందం, లేబర్ రూం, థియేటర్ విభాగాల నిర్వహణకు లక్ష్య అవార్డును ప్రకటించింది. క్వాలిటీ, ఇన్ఫెక్షన్ కంట్రోల్, బయోమెడికల్ వేస్టేజీ నిర్వహణ, మందుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, వైద్యుల పనితీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అవార్డుకు ఎంపికచేసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. లక్ష్య అవార్డుకు ఎంపిక అవడంతో జాతీయ స్థాయి అవార్డుతో పాటు రూ.3లక్షల నగదు ప్రో త్సాహం ఆసుపత్రికి వచ్చింది. ఆయా విభాగాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ ని ధులను వినియోగిస్తామని వైద్యులు తెలిపారు.