సమైక్యపాలనలో మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో ఎటుచూసినా కరువు, దుర్భిక్షమే. ఎండిన చెరువులు, నీళ్లులేక బీళ్లుగా మారిన పొలాలు. ఎవుసం సాగక, బతుకు భారమై అన్నదాతలు అన్నమో రామచంద్రా.. అంటూ అరిగోసపడ్డారు. ఉపాధి లేక పొట్ట చేతపట్టుకుని, బొంబాయి, దుబాయిలకు వలస బాట పట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల జీవితాలు తీర్చిదిద్దారు. 24 గంటల నిరంతర కరెంట్ ఇచ్చారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఇంకా కాళేశ్వర జలాలను ఎగువ మానేరు ఒడికి చేర్చి కరువు నేలలో చివరి భూములనూ సస్యశ్యామలం చేశారు. పచ్చని పంటలతో అన్నదాత ఇంట్లో ధాన్యపు రాసులు కురిపించారు. అనేక పథకాలు తెచ్చి అండగా నిలిచి వలసలు వాపస్ వచ్చేలా చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జిల్లా రైతులు అండగా నిలిచారు. సెస్ ఎన్నికల్లో పదిహేనుకు పదిహేను స్థానాలను గెలిపించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. తమ జీవితాలను వెలుగులమయం చేస్తాడన్న నమ్మకంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటేశామని చెబుతున్నారు.
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : “ఎవరో వస్తారు.. ఏదో అంటారు. అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని నోటికచ్చింది మాట్లాడుతరు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తరు. ప్రభుత్వంపై బురదజల్లుతరు. బట్టకాల్చి మీదేస్తరు. మేం నమ్ముతమా..? మాకు అన్నీ తెలుసు. నాటి వాళ్ల పాలనలో మమ్ముల ఎంత ఇబ్బంది పెట్టిన్రో.. ఎంత ఏడిపించిన్రో.. మేం ఇంకా మర్చిపోలే. నీళ్లు లేక.. కరెంట్ లేక ఎవుసం ఆగమైంది. ఉపాధి లేక, తిందామంటే తిండి లేక కన్నీళ్లు మింగి బతికినం. ఏడన్నా పని దొరక్కపోదా..? అని దేశమంతా తిరిగినం. ఆ చీకటి రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి.. బీఆర్ఎస్ సర్కారు ఎప్పుడైతే వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండో మా జీవితాలు బాగుపడ్డయి. నీళ్లు, కరెంట్ ఒక్కటేమిటి అన్నీ జరిగినయ్. ఈ సంతోషం ఇలాగే ఉండాలని బతుకుదిద్దిన కేసీఆర్ వెంటే మేం ఉన్నాం. బీఆర్ఎస్ సర్కారే మా వెలుగు.. అభివృద్ధి, సంక్షేమం వైపే నిలిచాం. మొత్తానికి మొత్తం పదిహేను స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి కృతజ్ఞతను చాటుకున్నాం’ అంటూ సిరిసిల్ల రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. సెస్ ఎన్నికల రిజల్ట్ నేపథ్యంలో ‘నమస్తే’తో తమ మనోగతాన్ని పంచుకున్నారు.
వ్యవసాయం పండగలా చేసిండు
నాటి సమైక్య పాలనలో నీళ్లులేక, కరెంటు రాక అరిగోస పడ్డం. ఎవుసం మీద రోత పుట్టింది. ఉన్న రెండెకరాల్లో సాగు బంద్పెడితే పిచ్చిమొక్కలు మొలసినయ్. పనిలేక పొట్టతిప్పల కోసం కూలీ పని చేస్తూ జీవనం సాగించినం. ఆ బాధలు ఇంకా మరచిపోలే. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సార్ ఉచితకరెంటు ఇస్తానన్నడు. అందరు గిట్లనే చెప్పి మాటలతో మోసం చేస్తరనుకున్న. అన్నమాటను నిలబెట్టుకుని 24గంటలు కరెంటు ఇచ్చిండు. మిషన్ కాకతీయతో చెరువులు మంచిగ చేసిండు. మాకు పాణం లేసొచ్చినట్లయింది. మాకున్న భూమిలో పిచ్చిమొక్కలు తొలిగించి పంట సాగు చేస్తున్నం. కరెంటుంది. నీళ్లున్నయ్. వద్దనుకున్న ఎవుసం పోటీ పడి చేస్తున్నం. యాసంగి, వానాకాలంలో పుట్లకొద్ది గింజలు పండినయ్. అందుకే సెస్ ఎలచ్చన్లలో కేటీఆర్ సార్ చెప్పినోళ్లకే ఓటేసినం. ఇంకా మంచిగసేత్తడన్న నమ్మకం ఉంది. – అల్లూరి గంగారెడ్డి, రైతు (రుద్రంగి)
ఎల్లంపల్లితో బంగారు పంటలు
నాటి కరెంటు, సాగు నీటి గోస చెప్పుకుంటే కండ్లపొంటి నీళ్లస్తయ్. కరెంటు కోసం పొలం కాడ తెల్లందాక పడిగాపులుగాసినం. పాములు, తేళ్లు, అడివి పందులతో భయభయంగా బతికినం. భూములున్నా పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి ఉండేది. మా కుటుంబానికి ఎవుసమే దిక్కు. పడ్డ కష్టాలు చాలనుకుని దుబాయికి పోయిన. కానీ, తెలంగాణ వచ్చినంక 24 గంటల కరెంటు. మా ఊరికి ఎల్లంపల్లి నీళ్లొచ్చినయ్. ఎటు చూసినా పచ్చని పొలాలే. దుబాయి నుంచి వచ్చినంక మా చేన్లను చూసి నేనే నమ్మలేక పోయిన. ఇది మా ఊరేనా.? అనుకున్నా. ఇంత మంచిగున్న సౌలతులతో పంటలు బాగా పండుతుంటే దుబాయికెందుకని ఇక్కడే ఉండి సాగు చేసుకుంటున్న. ఎల్లంపల్లి నీళ్లతో మా పంట బంగారమైంది. ఎప్పుడూ ఇట్లనే ఉండాలని సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసిన. – సామ నగేశ్, రైతు(రుద్రంగి)
అభివృద్ధిని కండ్ల నిండా చూస్తున్నం..
అభివృద్ధిలో వెనుకబడ్డ సిరిసిల్లను మేం అడుగకుండానే మంత్రి కేటీఆర్ సార్ ఎంతో అభివృద్ధి చేసిండు. అవన్నీ మా కండ్లముందు కనిపిస్తున్నయ్. రోడ్లు, చెరువులు ఒకటి కాదు రెండు కాదు లెక్కలేనంత అభివృద్ధి చేసి జిల్లాను టాప్లో నిలిపిండు. రాష్ట్రంలోనే ఏకైక సహకార విద్యుత్ సంస్థ సెస్. అది డెవలప్మెంట్ అయ్యిందంటే కేటీఆర్తోనే. 34సబ్స్టేషన్లు, 220కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు ఏర్పాటు చేయించాడు. పల్లెల్లో వేలాడుతున్న వైర్లు, విరిగిన స్తంభాలన్నీ కొత్తవి వేయించిండు. పొలాలకు కరెంటు కావాలంటే వెంటనే మంజూరు చేయించిండు. ఇలా మా కరెంటు కష్టాలు తీర్చిండు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలే గెలిస్తే మరింత డెవలప్మెంట్ అయితుందని భావించినం. ఇంకా అభివృద్ధి చేస్తానని మంత్రి ఫోన్లో మాట్లాడి చెప్పిండు. అందుకే ఆ పార్టీ నేతలను గెలిపించుకున్నం.
– పాతూరి సురేందర్రెడ్డి రైతు, మండెపల్లి (తంగళ్లపల్లి)
రైతు కష్టాలు తీర్చిన కేసీఆర్ సైడే ఉన్నాం..
రైతులకు మేలు చేసింది కేసీఆరే. ఆయనకంటే ముందు మస్తుమంది ముఖ్యమంతులు వచ్చిన్రు. పోయిన్రు. కానీ మమ్ముల ఏనాడూ పట్టించుకోలె. కరెంట్ లేక, నీళ్లు రాక అరిగోసపడ్డం. ఎవుసం ఇడిచిపెట్టాలనుకున్నం. ఎవరిని కలిసినా మా బాధలు పట్టించుకోలె. కానీ తెలంగాణ వచ్చి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బతుకులు మారినయ్. నీళ్లచ్చినయి. కరెంట్ అచ్చింది. ఇపుడు పెట్టుబడి ఇచ్చి, రైతు సచ్చిపోతే వాల్ల కుటుంబానికి ఐదు లక్షలిచ్చి ఆదుకుంటుండు. అందుకే రైతుగా కరెంటు కష్టాలు తీర్చినందుకు మేం కేసీఆర్ సైడే ఉన్నాం.
–గుడి ఎల్లారెడ్డి, రైతు, కిష్టంపల్లి
(ఎల్లారెడ్డిపేట)
మల్కపేట రిజర్వాయర్తో నీళ్లస్తయ్..
కరెంటుపైనే ఆధార పడ్డ మాపొలాలకు గోదావరి నీళ్లు తెస్తానని కేటీఆర్ సార్ ఎన్నికల్లో మాటిచ్చిండు. మంత్రి అయినంక మల్లన్న సాగర్ నుంచి ఎగువ మానేరుకు నీళ్లు తెచ్చిండు. మండుటెండల్లో మత్తడి దూకిన నర్మాల మానేరుతో సిరిసిల్ల మానేరులోకి నీళ్లు వచ్చినయ్. ఇంకా చెరువులు, చెక్డ్యాంలు నిండాలంటే కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీలో కడుతున్న మల్కపేట రిజర్వాయర్ పనులు తొందరగా పూర్తి కావాలి. మానేరు, మూలవాగులపై చెక్డ్యాంలు కట్టాలన్న ఆలోచన ఇంత వరకు ఎవరు చేయలే. తెలంగాణ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టి సిరిసిల్ల, వేములవాడ వాగులపైన చెక్డ్యాంలు కడుతున్నది. వీటి వల్ల మా రైతులకు సాగునీటి కష్టాలు, ప్రజలకు తాగునీళ్ల గోస తీరుతుంది. ఇవన్నీ ఆలోచించే సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులందరూ గెలిచేలా ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు.
– మందాడి తిరుపతి రైతు, రామన్నపల్లె
రైతుగా మద్దతియ్యాలె గదా..
రైతులకు ఇంతగనం మంచి పనులు జేత్తున్న సర్కారుకు మద్దతియ్యాలెగదా. పంట, పంటకు పైసలియ్యవట్టె, కరెంటియ్యవట్టె, రైతుకెమన్నయితే రైతు బీమా కూడా ఇయ్యవట్టె. గిన్ని మంచిపనులు రైతులకోసం సేత్తె కేసీఆర్ సారును గెలిపించుకోకపోతె ఎవల్ని గెలిపించుకుంటం. గతంలో ఎవరన్నా మమ్ముల పట్టించుకున్నరా.. గోసపెట్టిన్రు. ఎవుసం ఆగమైంది. నీళ్లు లేవు. కరెంట్ లేదు. కనీసం మా బాధలు చెప్పుకుందామంటే కూడా వినలే. ఆ రోజులు మేం ఇంకా మరిచిపోలేదు. కేసీఆర్ వచ్చినంకనే ఎవుసం మంచిగైంది. బాధలు తీరినయి. ఈ పనులు ఇలాగే జరగాలంటే కేసీఆర్ వెంటే ఉండాలనుకున్నం. అందుకే సెస్ ఎలక్షన్లల్ల కేటీఆర్ సార్ నిలవెట్టిన కృష్ణహరిని గెలిపించుకున్నం.
– ఎడ్ల నర్సయ్య, రైతు (ఎల్లారెడ్డిపేట)