-మణుగూరు రూరల్, జనవరి 23: ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు కార్మికుల రక్షణ, ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది. దీంతో పాటు వారి మానసికోల్లాసానికి క్రీడలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. కంపెనీ స్థాయిలో పోటీలు నిర్వహిస్తూనే, కోలిండియా స్థాయిలో సత్తా చాటేలా ప్రోత్సహిస్తున్నది. ఇందుకు అవసరమైన వసతులు, పరికరాలు సమకూర్చుతున్నది. మణుగూరు ఏరియాలో కూడా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రెండు సింథటిక్ కోర్టుల ఏర్పాటుకు రూ. 13 లక్షలు కేటాయించింది. ఇప్పటికే నమూనాలు కూడా పరిశీలించగా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది.
మణుగూరు ఏరియాలో కార్మికుల సౌకర్యార్థం టీబీజీకేఎస్ ఇచ్చిన వినతుల మేరకు రెండు షటిల్ బ్యాడ్మింటన్ సింథటిక్ కోర్టుల ఏర్పాటుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తున్నది. క్రీడాకారులను మరింత పదునుపెట్టి ఆటల్లో తమ ఏరియాను ముందుస్థానంలో నిలిపేందుకు నిధులు మంజూరు చేస్తున్నది. రూ.13లక్షలతో రెండు చోట్ల ఈ సింథటిక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఇందుకు గానూ ఇప్పటికే ప్రత్యేక కమిటీ హైదరాబాద్లోని సింథటిక్ కోర్టుల నమూనాలను పరిశీలించి ప్రతిపాదనలు పంపగా, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
జపనీస్ టెక్నాలజీతో..
సింగరేణి వ్యాప్తంగా కార్పొరేట్, శ్రీరాంపూర్, ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 ఏరియాల్లో చైనా టెక్నాలజీ సింథటిక్ షటిల్ బాడ్మింట న్ కోర్టులు ఉండగా, మణుగూరులోని సీఈఆర్ క్లబ్లో, ఆఫీసర్స్క్లబ్లో రెండుచోట్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన జపనీస్ టెక్నాలజీ ‘యోనెక్స్’ సింథటిక్ కోర్టుతో పాటు ఫైవ్ స్ట్రిప్ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని కార్పొరేట్ అధికారుల నుంచి ఏరియా జీఎంల దృష్టికి టీబీజీకేఎస్ తీసుకెళ్లింది. కార్మికులకు మెరుగైన క్రీడా సదుపాయాలను కల్పించాలని కోరుతూ పలుమార్లు వినతిపత్రాలు అందజేసింది. ఈ నేపథ్యంలో వారి వినతులను పరిగణలోకి తీసుకున్న యాజమాన్యం ఇందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే హైదరాబాద్లో ప్రాచుర్యం పొందిన నమూనాలను పరిశీలించి జపనీస్ టెక్నాలజీ యోనెక్స్ సింథటిక్ కోర్టు ఏర్పాటుకు రూ.6.50లక్షల చొ ప్పున రెండు కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలిచ్చింది. త్వరలో క్రీడాకారులకు ఈ కోర్టులు అందుబాటులోకి రానున్నాయి. ష టిల్ ఆడే క్రీడాకారులకు ఎక్కువగా మోకాళ్లపై ఒత్తిడి ఉండడం తో చాలా మంది ఆటకు దూరమయ్యారు. ఈ సింథటిక్ కోర్టు ఏర్పాటు అనంతరం మోకాళ్లపై, శరీరంపై ఒత్తిడి తగ్గడంతో పా టు మరికొంత సమయం ఆటపై వెచ్చించే ఉత్సాహన్ని ఇస్తాయ ని క్రీడాకారులు చెబుతున్నారు. దీంతో ప్రతి రోజూ విధుల అనంతరం ఆరోగ్యం, ఉల్లాసం కోసం షటిల్ ఆడడంతో పాటు తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు దోహదపడుతాయని క్రీడాకారుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
క్రీడాకారుల సౌకర్యం కోసమే..
టీబీజీకేఎస్ వినతి మేరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యోనెక్స్ కంపెనీ సింథటిక్ కోర్టులు మణుగూరులో రెండు చోట్ల ఏర్పాటు చేసేందుకు యాజమా న్యం కసరత్తు చేస్తున్నది. త్వరలో పను లు ప్రారంభమవుతాయి. షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కోర్టు మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారుల సౌకర్యార్థం కోర్టుల ఏర్పాటుకు కృషి చేసిన టీబీజీకేఎస్, యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
-కోట శ్రీనివాసరావు, క్రీడాకారుడు
ఆటకు అనువుగా ..
ప్రస్తుతం ఉన్న షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులపై ఆడడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురికావడంతో పాటు అలసటకు గురవుతున్నాం. సింథటిక్ కోర్టులు ఏర్పాటైతే ఎక్కువ సమయం ఆడేందుకు అనువుగా ఉంటుంది. కొన్ని ఏరియాల్లో ఇవి ఇప్పటికే ఉన్నాయి. మణుగూరులోనూ సింథటిక్ కోర్టు ఏర్పాటుకు కృషి చేసిన టీబీజీకేఎస్ యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు
-విద్యాసాగర్, క్రీడాకారుడు