రేపటి సింగరేణి సమరానికి సర్వం సిద్ధమైంది. గుర్తింపు సంఘం ఎన్నికలకు అంతా రెడీ అయింది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం 11 ఏరియాల్లో పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ చేస్తుండగా, సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
గోదావరిఖని/ రామగిరి, డిసెంబర్ 25 : సింగరేణిలో ఏడోసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియగా, బుధవారం బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్లు ఉండనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదే రోజు రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.
మొత్తం 11 ఏరియాల పరిధిలో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్, కౌంటింగ్ సిబ్బందిని నియమించి, శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. కాగా, పోలింగ్ బూత్లను సోమవారం సంస్థ వ్యాప్తంగా ఆయా డివిజన్ల అధికారులు పరిశీలించారు. పోలింగ్ రోజు ప్రతి ఉద్యోగి తమ గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని సూచించారు.
ఈ ఎన్నికల్లో యువ కార్మికుల ఓట్లే ప్రధానం కానున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక టీబీజీకేఎస్ హయాంలో కారుణ్య నియామకాల ద్వారా దాదాపు 20వేల మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం యువ కార్మికులను తమవైపు తిప్పుకునేందుకు కార్మిక సంఘాలు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. జాతీయ సంఘాల నాయకులైతే అప్పుడే విందు రాజకీయాలకు తెరలేపినట్లు తెలిసింది. ఏదేమైనా గని కార్మికుల తీర్పు ఏ యూనియన్ను వరించనుందోనని నల్లనేలపై ఉత్కంఠ నెలకొంది.
టీబీజీకేఎస్.. సింగరేణి చరిత్రలో లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమేగాక లెక్కకు మించి హకులు సాధించి కార్మికుల మనసును చూరగొన్నది. కేసీఆర్ సర్కారు ప్రోత్సాహం, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సారథ్యంలో ఆది నుంచీ కార్మికుల పక్షాన నిలుస్తూ వస్తున్నది. సింగరేణి యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అనేక ప్రయోజనాలు సాధించింది. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకొని ఒక పోరాటం లేకుండా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ సాధించని అభివృద్ధి సాధించింది. నూతన హకులతో పాటు జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన హకులను కూడా సాధించి కార్మికుల గుండెల్లో గూడు కట్టుకున్నది. తాజాగా మూడోసారి బరిలో నిలిచింది. మరోసారి గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నది.