తిమ్మాపూర్ రూరల్, జనవరి 8: మన రైతు రాజైండు.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్థిరత్వం సాధించిండు.. సమైక్య పాలనలో కూలీ కోసం వలసెల్లిన అన్నదాతలు నేడు స్వరాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తెచ్చుకొనే స్థాయికి చేరిండు. రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల నుంచి మొదలు పండిన ధాన్యం విక్రయించే దాకా రైతులకు అన్ని వసతులను కల్పిస్తుండడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో కూలీలకు డిమాండ్ పెరగడంతో బిహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి కూలీలు ఇక్కడికి వలస వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి కోసం వలస పోయిన మన వాళ్లు.. ఇప్పుడు కూలీలను వలస తెచ్చుకుని పని చేయించుకునే స్థాయికి ఎదిగారు.
20 మంది.. ఆరేడు ఎకరాలు
తిమ్మాపూర్ మండలంలో యాసంగిలో వరి సుమారు 20వేల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసుకున్నారు. ఇందుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచారు. అయితే, నీళ్లు పుష్కలంగా ఉండడంతో చాలా మంది రైతులు వరి వేయడానికే ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇక్కడి కూలీలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రారంభంలో రూ.350 కూలితో ప్రారంభమై, రూ.500 ఇచ్చినా కూలీ దొరకని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి కొంత మంది మధ్యవర్తులు 20 మంది చొప్పున బ్యాచ్లను తీసుకువచ్చారు.
ఎకరానికి రూ.5వేలు
వలస కూలీలు 20 మందికి తగ్గకుండా బ్యాచ్లుగా వచ్చారు. ఎకరానికి రూ.4500 నుంచి రూ.5500 వరకు ఏరియాను బట్టి తీసుకుంటున్నారు. ఒక బ్యాచ్ రోజుకు ఐదు నుంచి ఏడెకరాలు వేస్తున్నారు. గుత్తాగా మాట్లాడుకొని నారు పీకడం, మడుళ్లలో పరుచుకోవడం అంతా వీరే చూసుకుంటుండడంతో రైతులు వీరితోనే నాటు వేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆశించిన విధంగా గ్రామాల్లో సాగు నమోదు అవుతుండగా.. రైతులు ఏ రందీ లేకుండా సాగు చేసుకుంటున్నారు. కాగా, తమ రాష్ట్రంలో వరి సాగు చాలా తక్కువగా ఉంటుందని వలస కూలీలు చెబుతున్నారు. ఇక్కడి ప్రభుత్వం అందిస్తున్న వసతులు చాలా బాగున్నాయంటున్నారు. మధ్యవర్తుల కమీషన్, ఖర్చులు పోనూ రూ. వెయ్యి వరకు కూలి పడుతున్నాయని చెబుతున్నారు. ప్రతి సీజన్లో నెల పాటు ఇక్కడ ఉండి వెళ్తున్నట్లు తెలిపారు.