రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్లకుర్మల సంక్షేమం కోసం రాష్ట్ర సర్కారు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నది. 75శాతం సబ్సిడీపై 1.75 లక్షల విలువైన 21 గొర్రెల యూనిట్ను 43.450కే అందిస్తున్నది. అందించిన గొర్రెలతో సంపద మూడింతలు పెరిగినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. గొల్లకుర్మలంతా ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. కాగా, సర్కారు ఇచ్చిన గొర్రెలతో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన మాంసం వ్యాపారం గ్రామీణ ప్రాంతాలకు సైతం బాగా విస్తరించింది. 2017జూన్లో ప్రారంభించిన ఈ పథకం రాష్ట్రంలో సత్ఫలితాలిచ్చింది.
జిల్లాకు 16,162 యూనిట్లు లక్ష్యం
2017 జూన్లో ప్రారంభమైన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం కింద జిల్లాలకు 16,162 యూని ట్లు లక్ష్యం నిర్ధేశించింది. పశుసంవర్థక శాఖ గ్రా మాల్లో సమావేశాలు నిర్వహించి ఆసక్తి ఉన్న గొల్లకుర్మల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వచ్చిన దరఖాస్తులను డ్రా పద్ధతిన తీసి, లబ్దిదారుల ఎం పిక చేసింది. పాదర్శకంగా ఎంపిక చేసిన లబ్ధిదారులను వెంట బెట్టుకుని అధికారులు పక్క రాష్ర్టాలతో గొర్రెల కొనుగోలు చేశారు. వాటిని వివిధ వాహనాల్లో తీసుకొచ్చి అప్పగించారు. నిర్ధేశించిన 16,162 యూనిట్లకు గాను మొదటి విడుతలో 11,542 యూనిట్లకు, 2,42,382 గొర్రెలను పంపిణీ చేశారు. మిగిలిన 4620 యూనిట్లకు రెండో విడుతలో పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నెలాఖరులో పంపిణీ
రెండో విడత గొర్రెల పంపిణీ ఈ నెలాఖరులోగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 18 తర్వాత పక్క రాష్ర్టాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కొనుగోలు చేసేందుకు ఐదుగురు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. 4,620 యూనిట్లకు పంపిణీ చేయనున్న గొర్రెలు 97,020 కాగా, అందులో ఒక్కో యూనిట్కు 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలును అందిస్తారు. వీటికయ్యే మొత్తం బడ్జెట్ 80కోట్ల 85 లక్షలు కాగా, అందులో 75 శాతం సబ్సిడీపోను లబ్ధిదారులు చెల్లించేది 20కోట్ల 21లక్షల 25వేలు.
ఒక్కో లబ్ధిదారుడు ఒక్కో యూనిట్కు 43,750 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే లబ్ధిదారులంతా దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకుల ద్వారా డీడీలు తీయిస్తున్నారు. బ్యాంకులో డీడీలు తీసే ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గొర్రెలు తేచ్చేందుకు వాహనాల కోసం అధికారులు టెండర్లు వేశారు. టెండ ర్లు దక్కించుకునేందుకు వివిధ ట్రాన్స్పోర్ట్కు చెందిన యజమానులు డీడీలు చెల్లించారు. ఈ నెల 17న టెండర్ల ప్రక్రియ పూర్తి కానున్నది. ఖమ్మం, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డితో పాటు వివిధ జిల్లాలకు చెందిన ట్రాన్స్పోర్టు కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కొ లారీలో 6 యూనిట్ల గొర్రెలు తీసుకొచ్చే అవకాశమున్నది. పెద్ద ఎత్తున వాహనాలు అవసరం ఉన్నందున జిల్లాలోని వాహనాలు సరిపోనందున వివిధ జిల్లాల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నారు.
అక్రమాలకు చెక్
గొర్రెల పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా ప్రభుత్వం చెక్ పెట్టింది. కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో ప్రత్యేక విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నది. అధికారులే స్వయంగా వివిధ రాష్ర్టాలకు వెళ్లి గొర్రెలను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో రాయలసీమ నుంచి తెప్పించారు. ఈ సారి మహారాష్ట్ర లేదా తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల నుంచి తెప్పించే ఆలోచన చేస్తున్నారు. లబ్ధిదారుల అభిప్రాయం మేరకు గొర్రెలు తెప్పించాలని నిర్ణయం తీసుకోనున్నారు. కొనుగోలు చేసిన గొర్రెలకు అక్కడే జియోట్యాగింగ్ చేస్తారు. లోడుతో వస్తున్న వాహనం ఎక్కడ ఉన్నది? కూడా పరిశీలించే అవకాశమున్నది. అలాగే పంపిణీ చేసిన గొర్రెలను సద్వినియోగం చేసుకునేలా ఎప్పటికప్పుడు బృందం గ్రామాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో కలెక్టర్కు రిపోర్టు ఇస్తుంది. లబ్ధిదారులు వాటిని అమ్ముకుంటే వెంటనే చర్యలు తీసుకునే అవకాశమున్నది.
గొర్రెల సంతలు
ఒకప్పుడు వివిధ శుభకార్యాల కోసం గొర్రెలు, మేకలు కావాలంటే పక్క జిల్లాలోని సంతలకు వెళ్లి కొనుక్కుని వచ్చేవాళ్లు. సర్కారు చేపట్టిన గొ ర్రెల పంపిణీ కార్యక్రమాల ద్వారా గొర్రెల ఉత్ప త్తి బాగా పెరిగింది. ఆరేండ్లలో గొర్రెల సంపద మూడు రేట్లు పెరిగింది. ఏ గ్రామంలో చూసినా సర్కారు పంపిణీ చేసిన గొర్రెల మందలే కనిపిస్తున్నాయి. గొర్రెలు, మేకలు కొనుగోలు చేసేందుకు జిల్లా వాసుల ఇబ్బందులు తీరాయి. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, పదిర గ్రామాల మధ్య ప్రతి మంగళవారం, సిరిసిల్ల అర్బన్ పెద్దూరు గ్రా మంలో ప్రతి శుక్రవారం మేకల సంతలను నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వ్యాపారులు కొనుకెళ్తున్నారు.
ఇక్కడే అమ్ముకుంటున్నం
సబ్సిడీ గొర్రెలతో సం పద పెరిగింది. నాడు ఇక్క డ సంతలు లేక గొర్రెలు, మేకలు కొందామంటే కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేటలకు పోయినం. వెంటాపూర్, పెద్దూరులో వార సంతలు పెట్టిన్రు. ఇక్కడే అమ్ముకుంటున్నం. ఇక్కడే కొంటున్నం. దూరం పోవాల్సిన అవసరం లేదిప్పుడు. నాడు గొర్రెలు, మేకలు 20 కన్నా ఎక్కువుండేవి కావు. ఇయ్యాల వందకు పైగున్నయ్. కాసేందుకు ముగ్గురం కలిసి గుట్టకు పోతున్నం. ఊళ్లల్లో మాంసం దుకాణాలు రెండు మూడైనయ్. జీతగాళ్లమైన మేము సర్కారు దయవల్ల ఇయాళ మేం మంచిగున్నం. బ్యారగాళ్లమై అమ్ముతున్నం, కొంటున్నం
– కిషన్, కాపరి (చంద్రంపేట సిరిసిల్ల)