She Team | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 14: సుల్తానాబాద్ మండలంలోని నర్సయ్యపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రజలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై, యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం ప్రతీ రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా నిఘా ఉంచినట్లు చెప్పారు.
ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని సూచించారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్స్ కు మోసపోతున్నారని, వాటి జోలికి పోవద్దని సూచించారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెట్ కళ్యాణి తో పాటు తదితరులు పాల్గొన్నారు.