సిరిసిల్లలో సకల హంగులతో షాదీఖాన రూపుదిద్దుకున్నది. అమాత్యుడు కేటీఆర్ చొరవతో ముస్లిం మైనార్టీల రెండు దశాబ్దాల కల సాకారమైంది. మంత్రి మంజూరు చేసిన రూ.1.13 కోట్లతో అధునాతన భవనం ముస్తాబైంది. గ్రౌండ్ఫ్లోర్లో భోజనశాల, వంట గదులు, మొదటి అంతస్తులో వివాహం, రిసెప్షన్ హాల్తో నిర్మించిన ఈ భవనాన్ని నేడు రామన్న చేతులమీదుగా ప్రారంభించనుండగా, ముస్లిం వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. – సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల రూరల్, మార్చి 5
సిరిసిల్ల టౌన్, మార్చి 5 : తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నది. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. దేశంలో ఎక్కడాలేనివిధంగా మైనార్టీ ఆడబిడ్డల పెండ్లిళ్లకు షాదీముబారక్ కింద రూ.లక్ష నూట పదహార్లు సాయం అందజేస్తున్నది. రంజాన్ను అధికారంగా నిర్వహిస్తూ కానుకలు పంపిణీ చేస్తున్నది. ఇదే కోవలో ముస్లింల వివాహాలు, ఇతర శుభ కార్యాల నిర్వహణకు షాదీఖానాలను నిర్మించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా సిరిసిల్ల పట్టణం బీవై నగర్లో అన్ని వసతులతో షాదీఖానను నిర్మించి అందుబాటులో తెచ్చింది.
ఏర్పాట్ల పరిశీలన..
సిరిసిల్లలో నిర్మించిన షాదీఖానను మంత్రి సోమవారం ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆదివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి స్థానిక మసీద్ కమిటీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు.
మంత్రికి రుణపడి ఉంటాం..
సిరిసిల్లలో 20 ఏండ్లుగా పెండింగ్లో ఉన్న షాదీఖాన నిర్మాణ పనులు మంత్రి కేటీఆర్ చొరవతో పూర్తికావడంతో మసీదు కమిటీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. సౌకర్యాలతో షాదీఖాన అందుబాటులోకి రావడం అనందంగా ఉన్నదన్నారు. ఫంక్షన్హాల్లో పెళ్లి చేయాలంటే దాదాపు రూ.40వేలు ఖర్చు అయ్యేదని, ఇప్పుడు షాదీఖాన నిర్మాణంతో ముస్లింలకు అర్థిక భారం తప్పనున్నదని పేర్కొన్నారు. నిధులిచ్చిన మంత్రికి రుణపడి ఉంటామని చెప్పారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో అసంపూర్తి
సిరిసిల్లలోని బీవైనగర్లో 20 ఏండ్ల క్రితం షాదీఖాన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే, అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగాయి. మసీదు కమిటీ సభ్యులు ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించినా పైసలు విడుదల కాలేదు. పనులు ముందుకుసాగలేదు. దీంతో భవన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.
మంత్రి రామన్న ప్రత్యేక దృష్టి
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షాదీఖానల నిర్మాణానికి విరివిగా నిధులు విడుదల చేస్తున్నది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ మసీదు కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బీవైనగర్లో అసంపూర్తిగా ఉన్న షాదీఖాన భవనానికి నిధులు ఇవ్వాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే నిధులు మంజూరు చేయించారు. విడుతల వారీగా రూ. 1.13 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో అన్ని హంగులతో షాదీఖాన భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. సోమవారం ఆయన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.