మెట్పల్లి రూరల్, సెప్టెంబర్ 8 : కొత్త పింఛన్ల పంపిణీ ఊరూరా పండుగలా కొనసాగుతున్నది. ఇప్పటికే దివ్యాంగులకు రూ.3016, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులకు రూ.2016 చొప్పున ఇస్తూ రాష్ట్ర సర్కారు కొండంత అండగా నిలుస్తున్నది.
ఈ సారి 57 ఏండ్లు నిండిన వారికి సైతం పింఛన్లు మంజూరు చేయడమే కాకుండా, వీటికి సంబంధించిన పత్రాలను వేగంగా పంపిణీ చేస్తున్నది. సీఎం కేసీఆర్ తమ పెద్దకొడుకులా పింఛన్ అందిస్తున్నాడని భావిస్తూ వృద్ధులు మనసారా దీవిస్తూనే ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. గురువారం మెట్పల్లి మండలం వెల్లుల్లలో పింఛన్ మంజూరు పత్రం అందుకున్న వృద్ధులు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుతో కలిసి ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి ఇలా పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.