‘పదేండ్ల కింద తెలంగాణ ఎట్లుండె.. తెలంగాణ ప్రభుత్వంలో ఎట్లయిందో కళ్ల ముందే కనిపిస్తున్నది.. అభివృద్ధిని చూసి మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి కేసీఆర్ను దీవించండి. తప్పకుండా మీ సేవలో ఉంటాం’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇల్లంతకుంట మండలంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం 50 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘ భవనం, పల్లె దవఖానలను ప్రారంభించి, బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
– రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) / ఇల్లంతకుంట
మండుటెండల్లో సైతం వాగులు, వంకలను పారించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. నాడు కూలీ కోసం ఎదురు చూసిన ప్రజలు సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులుగా మారి ఇతర రాష్ర్టాల వారికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగారు. కాంగ్రెస్, బీజేపీ మాయ మాటలు విని మోస పోవద్దు. అభివృద్ధిని చూసి ఓటేయండి. బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించండి.
-మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) / ఇల్లంతకుంట : మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఇల్లంతకుంట మండలంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ‘40 ఏండ్లు కాంగ్రెస్, నడిమిట్ల తెలుగుదేశపోళ్లు.. వాళ్లు పోయి వీళ్లువచ్చినా.. వీళ్లు పోయి వాళ్లచ్చినా తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు’ అని విమర్శించారు.
ఎడకాలం వచ్చిందంటే బాయిలకాడికెళ్లి నీళ్లు మోసుకున్నామని, బోరింగులు కొట్టి నీళ్లు తెచ్చుకున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావని గుర్తు చేశారు. తాగునీళ్లకే ఇబ్బంది పడ్డ ఈప్రాంతం ఇవాళ్ల సస్యశ్యామలమైందన్నారు. తాగునీటితోపాటు సాగునీరు తెచ్చుకున్నామని, నీళ్ల కష్టం తీరిందన్నారు. ఎదిగిన బిడ్డ పెండ్లి చేయాలన్న తల్లి బాధను గుర్తించిన కేసీఆర్ మనుసు పెట్టి ఎవరు అడగకున్నా, ఎన్నికల కోసం ఓట్ల ముందు చెప్పకుండానే కల్యాణలక్ష్మితో రూ.లక్షా నూట పదహార్ల ఆర్థిక సహాయం చేశారని చెప్పారు. కులాలు, మతాలు, రాజకీయాలని చూడకుండా 12.70 లక్షల మంది ఆడబిడ్డలకు సాయం చేసినట్లు తెలిపారు. గతంలో ప్రైవేటు దవాఖానలో కాన్పు కావాలంటే రూ.50 వేలకు పైగా ఖర్చు అయ్యేదని, సర్కారులో కాన్పులు చూసి ప్రైవేటోళ్లంతా ఎట్ల బతకాలి? అని అడుగుతున్నారని చెప్పారు.
అమ్మ ఒడి, న్యూట్రిషన్, కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల శాతం పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం సర్కారు దవఖానలో ప్రసవాలు అయితే, 70 శాతం ప్రైవేటులో జరిగేవని, ఆ పరిస్థితి నేడు ఉల్టా అయిందన్నారు. కాంగ్రెస్ కాలంలో ఆడపిల్లల చదువులకు కాలేజీలు లేక, చదువుకొనలేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ 78 మహిళా రెసిడెన్సియిల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, ఆడపిల్లలు ఉన్నత చదువులకు ఎదిగేలా చేశారన్నారు. మంచినీళ్లు కావాలంటే అక్కాచెల్లెళ్లు పడ్డ కష్టాలు వర్ణణాతీతమన్నారు. ఎమ్మెల్యే ఏఊరికి పోవాలన్నా ముందు పోలీస్ బండి, లేదా బోరు బండైనా పోవాల్సిన పరిస్థితి నాడు ఉండేదని, బిందెలు అడ్డంగా పెట్టి ధర్నాలు చేసిన రోజును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఇయ్యాళ ఆ పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇంటింటికీ నల్లా ఇచ్చి అక్కాచెల్లెళ్ల కష్టాలను తీర్చారని చెప్పారు. ఇల్లంతకుంట మండలంలో నాటి కరువు పరిస్థితిలో కైకిలు దొరకని పరిస్థితి ఉంటే.. నేడు కాళేశ్వర జలాలతో సాగు విస్తీర్ణం పెరిగి కైకిలోళ్లు దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. పక్క రాష్ట్రం నుంచి కూలీలు వచ్చి నాట్లు వేస్తున్నారని, పదిమందికి ఉపాధి కల్పించడమే కాకుండా కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎట్లుండేదో.. కేసీఆర్ ప్రభుత్వంలో ఎలా అయ్యిందో ఇదే నిదర్శనమన్నారు. చెరువులు ఎండి పోయి మత్స్య కార్మికుల ఉపాధి కోల్పోతే.. స్వరాష్ట్రంలో చెరువులు నింపి చేపల పెంపకంతో వారి వృత్తిని బలోపేతం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.
కేసీఆర్ వల్లే కావాల్సినంత కరెంటు వచ్చిందని, రెండు పంటలు పండుతున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉచిత కరెంటని ఉత్త కరెంటు చేశారని విమర్శించారు. ఒకప్పుడు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ముందు ఒక్క ఎరువుల సంచి కోసం పొద్దుగాల లైను కడితే పొద్దగూకినంక సంచి దొరికేదన్నారు. ఇయ్యాల ఎరువులకు ఇబ్బందులు లేవని, పెట్టుబడికి రూ.పదివేల సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వమని చెప్పారు. పంట పండితే చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొని వారంలోగా నగదు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నదని తెలిపారు. ఒక్కో అడుగు వేసుకుంటూ ఎదుగుతున్న సమయంలో తప్పిదారి కాంగ్రెస్కు ఓటేస్తే పెద్ద పాము మింగినట్లు తెలంగాణ బతుకులు ఆగమైతాయని హెచ్చరించారు.
అన్నీ అబద్ధాలు చెపుతారని, గతంలో ఇదే కాంగ్రెస్సోళ్లు చెప్పిన మాయమాటలను మరిచి పోవద్దని కోరారు. తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని, ఆరుకిలోల బియ్యం ఇస్తామని మాట తప్పారని విమర్శించారు. కేసీఆర్ మాట తప్పలేదని, అడగకుండానే పథకాలు ఇచ్చిన నాయకుడన్నారు. సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట, సిరిసిల్లకు రోడ్లు వేశామని, దవాఖానలను బాగు చేసుకుంటున్నామని, అన్ని గ్రామాల్లోని కులసంఘాలు, మహిళా సంఘాలకు నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఓడెక్కినంక ఓడ మల్లన్న, ఒడ్డు దాటినంక బోడ మల్లప్ప అన్న చందంగా కాంగ్రెసోళ్ల కథ ఉంటందన్నారు. తిన్న రేవును తలవాలని పెద్దలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ అన్ని విధాలుగా ధైర్యమిస్తున్న కేసీఆర్కు అండగా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని, మీ ఆశీర్వాదం ఉండాలని కోరారు.
మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను మంత్రి ప్రశంసించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి కోసం పట్టిన పట్టు విడవకుండా పని పూర్తయ్యే వరకు విశ్రమించబోరని చెప్పారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో 30 పడకల దవాఖాన కావాలని రసమయితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పట్టుబట్టినట్లు గుర్తు చేశారు. దగ్గరలోనే సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్లో మెడికల్ కళాశాలలు, పెద్ద దవఖానలు ఉండగా ఇక్కడ దవాఖాన ఎందుకన్నానని, మండల ప్రజల కోసం దవాఖాన తప్పనిసరి కావాలని ఇద్దరూ ఒత్తిడి తెస్తే అందుకు తాను 50 పడకల దవాఖానను మంజూరు చేసినట్లు చెప్పారు. నిజంగా ఇల్లంతకుంటకు ఇది శుభదినమన్నారు.
ఇప్పటి వరకు ఇల్లంతకుంటలో ఆరు పడకల దవాఖాన మాత్రమే ఉండేదని, కొత్తగా 50 పడకల దవాఖానతో ఇక్కడి గర్భిణులకు కాన్పులు ఇక్కడే చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఏ ఆపదొచ్చినా పేదలకు మెరుగైన వైద్యం అందేలా రూ.17 కోట్లతో దవాఖానకు శంకుస్థాపన చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇల్లంతకుంట ప్రజలకు సేవలు చేసుకునే భాగ్యం పెద్దమ్మతల్లి, ఎల్లమ్మతల్లి, ఆ బీరప్పదేవుడిచ్చాడన్నారు. తనకెంతో సంతోషంగా ఉందని, ఆరోజు నీళ్ల మంత్రిగా నీళ్లిచ్చే అదృష్టం కలిగిందని, నేడు వైద్య మంత్రిగా దవాఖాన తెచ్చిన అదృష్టం తనకు దొరికినందుకు సంతోషిస్తున్నానన్నారు. ఇల్లంతకుంట.. సిద్దిపేట వేరు కాదని, ఇక్కడి ప్రజలు పడ్డ కష్టాలే తామూ పడ్డామని చెప్పారు.
ఇల్లంతకుంట, సిద్దిపేటకు చాలా దగ్గర సంబంధం ఉంటదని, పిల్లను తెచ్చుకుంటరు.. పిల్లను ఇస్తరని మంత్రి పేర్కొన్నారు. అటు కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట మూడింటి మధ్య ఇల్లంతకుంట ఉందన్నారు. ఈ మండలంలోని కొన్ని ఊర్లు సిరిసిల్ల, కొన్ని ఊర్లు కరీంగనర్, మరికొన్ని ఊర్లు సిద్దిపేటకు కలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వైస్చైర్మన్ సిద్ధం వేణు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సుడా చైర్మన్ రామకృష్ణారావు పాల్గొన్నారు.
మండుటెండల్లో సైతం కాళేశ్వరం ప్రాజెక్టుతో వాగులు, వంకలను పారించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. పదేళ్ల కిందట సాగు నీరు లేక ప్రజలు కూలీ కోసం కష్ట పడే రోజులు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎడారి భూములను పచ్చని పంట పొలాలుగా మార్చారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ధి బాటలో నడిపిస్తున్న బీఆర్ఎస్ను ప్రజలు మూడోసారి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించండి.ఇతర పార్టీలకు ఓటు వేసి రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టవద్దు. రాష్ట్రం పచ్చని పంట పొలాలతో అందరూ సంతోషంగా ఉండాలంటే తప్పకుండా బీఆర్ఎస్ను గెలిపించండి.
-డాక్టర్ రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే