జమ్మికుంట, ఫిబ్రవరి 6: ‘దళితబంధు పథకం లబ్ధిదారులైన శ్రీనివాస్, అమల ఆత్మహత్యాయత్నాలకు ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వం స్పందించాలే. ఫ్రీజ్ చేసిన రెండో విడుత నిధులు విడుదల చేయాలి. ఏ ఒక్క లబ్ధిదారుడు ఆందోళన చెందొద్దు. మీకు మేమున్నం..’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి భరోసానిచ్చారు. మంగళవారం ఆయన సతీమణి శాలినీరెడ్డితో కలిసి జమ్మికుంటకు వచ్చారు. మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి(చర్చి కాలనీ)కి చెందిన దళిత బంధు లబ్ధిదారు బొటికెల శ్రీనివాస్ రెండో విడుత నిధులు విడుదల కావడం లేదని మనస్తాపంతో ఇటీవల ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించగా, బాధితుడిని ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. దళిత బంధు పథకంపై ప్రభుత్వం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పథకం నిధుల విడుదలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. లబ్ధిదారులెవరూ ఆత్మహత్యాయత్నాలకు పాల్పడవద్దన్నారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతితో ఫోన్లో మాట్లాడారు. రెండో విడుత డబ్బులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు లబ్ధిదారు శ్రీనివాస్ను ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ దళిత బంధు సాధన సమితితో కలిసి పరామర్శించారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, తదితరులున్నారు.