మానకొండూర్ రూరల్, జనవరి 20: ‘నేను మీ సేవకుడిని. ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. మీ కష్టాలు, కన్నీళ్లలో తోడుంటా’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మానకొండూర్ మండలం పచ్చునూర్లో శుక్రవారం యువజన సంఘాల యువకులు బొల్లం శశితో పాటు దాదాపు 50 మంది బీఆర్ఎస్లో చేరగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి కండువాలు కప్పి ఆహ్వానించారు. అన్నివర్గాల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ఈ క్రమంలో అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై పెద్ద సంఖ్యలో యువకులు బీఆర్ఎస్లో చేరుతుండడం సంతోషంగా ఉందని చెప్పారు. పథకాల లబ్ధిదారులు ప్రభుత్వానికి అండగా ఉండాలని, కృతజ్ఞతా భావాన్ని చాటుకోవాలని సూచించారు.
ఖమ్మం తర్వాత పచ్చునూర్లోనే చేరికలు మొదలవడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ నాయకులకు అభివృద్ధి అవసరం లేదని, మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు, సీట్లు దక్కించుకోవడమే తెలుసునని ఎద్దేవా చేశారు. ఇన్నేండ్లలో వాళ్లు చేసిందేమీ లేదని, ఓటు ఎవరికి వేయాలో ఆలోచించుకోవాలని సూచించారు. కాగా, రానున్న ఎన్నికల్లో మానకొండూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ మెజార్టీ తెచ్చేందుకు కృషి చేస్తామని పార్టీలో చేరిన యువకులు స్పష్టం చేశారు. జీవీఆర్ మాట్లాడుతూ ఖమ్మంలో నాలుగు రాష్ర్టాల సీఎంలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధిని కొనియాడితే బీజేపీ నాయకులకు నచ్చడం లేదని, జీర్ణించుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రాష్ర్టానికి చేసిందేమీ లేదని, తన నియోజకవర్గంలో ఒరగబెట్టిందేమీ లేదన్నారు.
అనంతరం పంచాయతీ ఆఫీస్ ఆవరణలో ముగ్గురికి కల్యాలణ లక్ష్మి, ఆరుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. యూత్ నాయకులు ఎమ్మెల్యేతో పాటు జీవీఆర్లను గజమాలతో సన్మానించారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ముఖ్య అతిథులకు సర్పంచ్ నర్మెట వసంత-వీరయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు రామంచ ప్రవీణ్, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ జడ్పీటీసీ సభ్యులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మండల ఆర్బీఎస్ కన్వీనర్ రామంచ గోపాల్ రెడ్డి, మానకొండూర్ సర్పంచ్ రొడ్డ పృధ్వీరాజ్, మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లగల్ల నగేష్, నియోజక వర్గ యూత్ కో ఆర్డినేటర్ సురేశ్, నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొత్తూరి జగన్ గౌడ్, మొండయ్య, పార్నంది కిషన్, ముత్తునూరి కొమురయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.