Manthani | కమాన్పూర్, మార్చి 10 : భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు గొప్ప సంఘసంస్కర్త, స్త్రీ విద్య విప్లవానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలేనని వక్తలు అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 129 వ వర్ధంతిని సామాజిక కార్యకర్త చిప్పకుర్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడారు. స్త్రీ విద్య సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన ఆమే ప్లేగువ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అసులు బాసినట్లు గుర్తు చేసుకున్నారు.
ఆధునిక మహిళా విద్య విప్లవానికి మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేశారన్నారు. సావిత్రిబాయి పూలే జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని అలాంటి మహనీయురాలు బాటలో సమాజ సేవలో నేటి తరం ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లబెల్లి శంకర్, నాయకులు రాణవేణ లక్ష్మణ్, వెంకట్ రెడ్డి, అంబటి కనుకయ్య, కుక్క రవీందర్, మాసు భీమయ్య, మట్ట నర్సయ్య, గర్రిపెల్లి వెంకటి, చిప్పకుర్తి శ్రేనివాస్, చాట్ల రాయమల్లు, కాస రవి, లల్లు, సయ్యద్ ఇక్బాల్, మల్యాల శేఖర్, ఆరేళ్లి పేరయ్య, మట్ట రాజయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.