Korutla | కోరుట్ల, ఏప్రిల్ 16 : కోరుట్ల పట్టణంలోని పురాతనమైన గడి బురుజుల స్థలాలను కాపాడాలని కోరుట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)ను గురువారం కలిసి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులతో కుమ్మక్కై చూసి చూడన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కోరుట్లకు తలమానికంగా ఉన్న గడి బురుజులను కబ్జాల బారి నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
నిరుపేదలు ఇల్లు కట్టుకోవాలనుకుంటే అన్ని డాక్యుమెంట్లు సరిపోలితేనే అనుమతులు మంజూరు చేసే అధికారులు గడి బురుజుల భూముల విషయంలో మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పట్టణంలో అక్రమ వెంచర్లు, లే ఔట్లపై మున్సిపల్ అధికారులు పట్టింపు కరువైందని ఆరోపించారు. చారిత్రత్మకమైన గడి బురుజులు అన్యక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్కు వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు పొట్ట సురేందర్, మోసిన్, కొక్కెర వెంకటేష్, నాయకులు ఎలుగూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.