లక్ష్మీ కటాక్షంలేక సరస్వతీ పుత్రుడు తల్లడిలుతున్నాడు. రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీపట్టి నీట్ పరీక్షలో సత్తా చాటాడు. ఏడు వేల ర్యాంకుతో ఖమ్మం వైద్యకళాశాలలో సీటు సాధించాడు. తనను చదివించేందుకు తల్లిదండ్రుల చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. దాతలు దయతలచి ఉన్నత చదువుకు చేయూతనందించాలని వేడుకుంటున్నాడు.
– కలెక్టరేట్, డిసెంబర్ 25
మానకొండూరు మండలం కొండపల్కల గ్రామానికి చెందిన దాసరి అరవింద్ నిరుపేద దళిత కుటుంబంలో జన్మించాడు. తండ్రి గ్రామ పంచాయితీలో సఫాయి కార్మికుడు. తల్లి కూలీనాలీ చేస్తుంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే చందంగా అరవింద్ చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. ఊరిలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి వరకు చదివాడు. అతడి ప్రతిభను గుర్తించిన స్కూల్ టీచర్ రుక్మాపూర్ గురుకుల పాఠశాలలో చేర్పించాడు.
పదో తరగతిలో 9.5 జీపీఏతో ఉత్తీర్ణుడయ్యాడు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గురుకుల కళాశాలలో 2020-21లో 902 మార్కులతో బైపీసీ పూర్తి చేశాడు. ఇటీవల నిర్వహించిన నీట్లో రాష్ట్రస్థాయిలో 7వేల ర్యాంకు సాధించాడు. ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో మెడిసిన్ సీటు పొందాడు. చేతిలో నయాపైసాలేక తల్లిదండ్రులు చదివించేందుకు వెనుకాడారు.
పలువురు గ్రామస్తులు విరాళాలు సేకరించి అడ్మిషన్ ఫీజు చెల్లించి వైద్యకళాశాలలో చేర్పించారు. అయితే, ట్యూషన్, హాస్టల్, మెస్ ఫీజులు చెల్లించేందుకు రూ.2లక్షలకు పైగా అవసరమని అరవింద్ తల్లిదండ్రులు చెబుతున్నారు. దాతలు ముందుకువచ్చి నా కొడుకు చదువుకు సాయం చేయాలని వేడుకుంటున్నారు. సాయం చేయాల్సిన వారు 7032939193 నంబర్కు గుగూల్ పే లేదా ఫోన్ పే కూడా చేయవచ్చని, తన పేరున గల తెలంగాణ గ్రామీణ బ్యాంక్, కొండపల్కల శాఖ (ఖాతానెం. 79065844874, IFSC Code SBINORRDCGB)లోనైనా జమ చేసి తనను ఆదుకోవాలని అర్థిస్తున్నారు.