పల్లెకు పండుగొచ్చింది. సంబురాలు పూయించే సంక్రాంతి వచ్చింది. వాకిళ్లకు ‘వర్ణ’కాంతులను, ఇంటిల్లిపాదికీ సకల సౌభాగ్యాలను మోసుకొచ్చింది. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. ముత్యాల ముగ్గులు.. పతంగుల ఆటలు.. ఇళ్లకు చేరే బంధువులు.. అన్నింటికీ మించి రైతన్న ఇళ్లకు చేరే పంట సిరులతో ఊరూవాడా సందడి నెలకొన్నది. ఎక్కడెక్కడి నుంచో చేరిన కొడుకులు బిడ్డలు, పిల్లాపాపలతో ఇల్లిల్లూ కళకళలాడుతున్నది. నేడు భోగి, రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి ‘కనుమ’ను కన్నుల పండువగా జరుపుకునేందుకు ప్రతి ఇల్లూ ముస్తాబైంది.
వేములవాడ టౌన్/ కమాన్ చౌరస్తా, జనవరి 13 : వాకిళ్లలో సప్తవర్ణాల రంగవల్లులు.. నడుమ ముచ్చట గొలిపే గొబ్బెమ్మలు.. లోగిళ్లలో బసవన్నల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. ఆకాశాన ఎగిరే పతంగులు.. భోగిపండ్లు.. పిండివంటల ఘుమఘుమలు.. చిన్నాపెద్దా సందడితో సంబురాల సంక్రాంతికి ప్రతి పల్లే ముస్తాబైంది. ఎక్కడెక్కడి నుంచో చేరుకున్న బంధువులతో ప్రతి ఇల్లూ కళకళలాడుతున్నది. మూడు రోజుల ముచ్చటైన ఈ పండుగలో నేడు భోగిని వైభవంగా జరుపుకునేందుకు ప్రజానీకం సిద్ధమైంది.
కోల్సిటీ, జనవరి 13: గోదావరిఖని పవర్హౌస్ కాలనీలోని పవర్ ఉమెన్ కమిటీ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ్డి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ శుక్రవారం సాయంత్రం ఆ కాలనీ మహిళలతో కలిసి భోగి మంటల కోసమని ఏర్పాట్లు చేపట్టారు. ఆవు పేడను తీసుకవచ్చి వాటితో పిడకలు తయారు చేశారు. శనివారం తెల్లవారుజామున అందరూ ఒకచోటకు చేరి భోగి మంటలు వేసుకొని పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు సిద్ధమైనట్లు మూల విజయారెడ్డి తెలిపారు. ఇక్కడ కమిటీ సభ్యులు సరిత, హరిత, లక్ష్మి, ఉమ తదితరులున్నారు.
రైతన్నకు ప్రత్యేకం..
సంక్రాంతి అంటేనే పల్లెకు ప్రత్యేక కళ వస్తుంది. పచ్చని పంట పొలాలు, ఇంటికి చేరిన ధాన్యం రాశులతో రైతన్నలు సంతోషంగా ఉండే సమయంలో ఈ పండుగ వస్తుంది. నాడు కరువు కాటకాలు, కరెంట్ కోతల మధ్య కష్టాలు, అప్పులతో తల్లడిల్లిన కుటుంబాల్లో సంక్రాంతి సంబురాలు అంతగా కనిపించేవి కావు. కానీ, స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మారుస్తుండడంతో రైతన్న కష్టాలు తీరుతున్నవి. ఇప్పటికే రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంట్, సకాలంలో ధాన్యం కొనుగోళ్లు ఇలా ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తుండడంతో కొత్త సంబురం కనిపిస్తున్నది. వానకాలంలో దిగుబడులు సైతం పెరుగడంతో ఆనందోత్సాహాల మధ్య రైతులు పండుగ జరుపుకుంటున్నారు. సంక్రాంతి రోజు తమ ఇండ్లలో పాలుపొంగించుకుంటారు. పా యసం చేసుకుంటారు. పశువులను పూజించే పండుగ అయిన కనుమను ఘనంగా జరుపుకుంటారు. దుక్కి దున్నిన నాటి నుంచి పంట ధాన్యాన్ని ఇళ్లకు చేర్చేవరకు అండగా నిలిచే పశువులను పూజిస్తారు. పశువులను కడిగి పసుపు, కుంకుమ, పూలతో అలంకరిస్తారు. సాయంత్రం వేళ ఆలయాల వద్ద ఊరేగిస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. కొట్టాల్లో పొంగలి వండి అందులో పసుపు, కుంకుమ కలిసి పొలాల్లో చల్లుతారు.
పతంగుల ఆటలు..
సంక్రాంతి అంటేనే గాలిపటాలకు స్పెషల్. పిల్లలు, పెద్దలు పండుగపూట సంతోషంగా గాలి పటాలను ఎగరేయడం కనిపిస్తుంది. నాడు పతంగులను ఎక్కువగా ఇళ్లలోనే తయారు చేసుకున్నా, నేడు షాపుల్లో ప్రత్యేకంగా దొరుకుతున్నాయి. ఇప్పడు పతంగులన్నీ ఆధునిక పోకడలు పోతున్నాయి. ఒకప్పుడు ఎక్కడచూసినా ఖాళీ ప్రదేశాలు కనిపించేవి. అందుకే ఎక్కడ చూసినా పతంగులు ఎగరే స్తూ సరదాగా గడిపేవారు. నేడు ఖాళీ ప్రదేశమే కనిపించకుండా నిర్మాణాలు వెలియడంతో కేవలం మైదానాలు, బంగ్లాలపై ఆంక్షల మధ్య ఎగరేస్తున్నారు. పిల్లలు పంతగులు పట్టుకుని వీధుల్లో సందడి చేస్తున్నారు. అయితే పతంగులు ఎగురవేసేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాల బారిన పడే ప్రమాదమున్నది. ఇండ్ల పైకి ఎక్కి గాలిపటాలు ఎగురవేసే సమయంలో ముప్పు ఎక్కువగా ఉంటుంది.
గంగిరెద్దుల ప్రదర్శనలు..
పర్వదినాన గంగిరెద్దులు లోగిళ్లకు మరింత శోభ తెచ్చి పెడుతాయి. పండుగ మూడు రోజులు ఊళ్లల్లో వీటి ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి. ఎక్కడెక్కడి నుంచో పల్లెలకు చేరుకునే గంగిరెద్దుల వాళ్లు బసవన్నలను అందంగా అలంకరించుకుని ఇంటింటికీ తిరుగుతా రు. డోలు సన్నాయి పాటలతో రైతుల ఇండ్ల ముందుకు వరి అర్తి అడుగుతారు. ‘అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు’ అంటూ గంగిరెద్దులను ఆడిస్తారు. రైతులు ధాన్యాన్ని వాళ్లకు దానం చేస్తారు. ఈ పండుగ సీజన్లోనే హరిదాసులు కనిపించేవారు. ‘హరిలో రంగ హరి’ అంటూ పాటలు పాడు తూ, ఇంటింటికీ తిరిగి భిక్ష స్వీకరిస్తారు. ఇప్పుడు ఆదరించేవాళ్లు వాళ్లు లేక గంగిరెద్దుల వాళ్లు, హరిదాసులు వీధుల్లో తిరగడం మానేశారు. ఒకప్పుడు పండుగకు పది రోజుల ముందు నుంచే వీరు పల్లెల్లో తిరుగుతూ సంద డి చేసినా, నేడు ఒకటి రెండు రోజులు మాత్రమే కనిపిస్తున్నారు.
ముత్యాల ముగ్గులు.. నోములు
ఈ పండుగలో ప్రత్యేకం ముగ్గులు. సంక్రాంతి వచ్చిందంటే ప్రతి వాకిలీ ఓ పూదోటను తలపిస్తుంది. కోడికూతతో నిద్రలేచే ఆడబిడ్డలు, ముగ్గులు వేసేందుకు పోటీ పడుతారు. వాకిలూడ్చి, అలుకు చల్లి వాకిట్లో రంగు రంగుల రంగవల్లులు వేస్తారు. గొబ్బెమ్మలు పెట్టి, పూలు, పండ్లు, నవధాన్యాలతో పూజిస్తారు. ఈ పండుగ రోజుల్లో శివుడి నంది స్వరూపాలుగా భావించే గంగిరెద్దులు ఇంటి ఆవరణలో ప్రవేశించడం శుభ సూచకంగా భావిస్తారు. హరిదాసును విష్ణుస్వరూపంగా భావించి ధాన్యాన్ని దానంగా సమర్పిస్తారు. ఇంకా ఇంటింటా బొమ్మల కొలువులు పెడతారు. సుమంగళి స్త్రీలు సంక్రాంతి నోములు నోచుకుని ముత్తయిదువులను పిలిచి వాటిని కానుకగా అందజేసి ఆశీర్వాదం తీసుకుంటారు. కలకాలం సిరి సంపదలు సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని ఈ నోములు, వ్రతాలు చేస్తారు.
నేడు భోగభాగ్యాల భోగి ..
దక్షిణాయణం దేవతలు నిద్రించే కాలంగా చెప్పుకుంటారు. దీంతో సంక్రాంతికి ఒక రోజు ముందు పీడ నివారణ కోసం వీధుల్లో భోగిమంటలు వేసి, ఇంట్లోని పాత వస్తువులను ఆహుతి చేస్తారు. మరుసటి రోజు నుంచి కొత్త వస్తువులు ఉపయోగించడం ఆనవాయితీ. భోగి రోజున తెల్లవారుజామున పిల్లలకు తలస్నానం చేయించి రేగుపండ్లు, చెరుకు ముక్కలు, అక్షింతలు కలిపి వారి తలలపై పోయడం ద్వారా దృష్టి దోషం తొలగిపోతుందని పెద్దలు నమ్ముతారు. పెద్దల చేత భోగిపండ్లను పోయించడం వల్ల చిన్నారుల ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి. భోగి రోజే గోదాదేవి రంగనాథస్వామిని వివాహమాడిందని చెబుతారు. అప్పటి నుంచే ఆమె భోగభాగ్యాలు పొందిందని ప్రతీతి. భోగి రోజున మహిళలు వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపి, వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడుతారు. వాటిపై గరక పోసలు ఉంచి, చుట్టూ నవధాన్యాలు, పళ్లు పోస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తమ ఇళ్లలోకి వస్తుందని నమ్ముతారు.
సిరుల పండుగ సంక్రాంతి. భోగభాగ్యాలతో తులతూగే పల్లెల్లోని ఇళ్లల్లో మూడు రోజుల వేడుక. మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ. సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజు వచ్చేదే భోగి. మరుసటి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు గనుక, ఈ శుభదినం మకర సంక్రాంతి. ఆ తర్వాతి పండుగ కనుమ. ముచ్చటైన ఈ మూడు రోజుల పండుగతో ప్రతి పల్లెసందడి మారుతున్నది. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధి కోసం ఎక్కడెక్కడో ఉండే కుటుంబాలన్నీ పల్లెలకు చేరుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు శుక్రవారం నుంచే సెలవులు ప్రకటించగా పిల్లాపాపలతో ఇళ్లకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం నుచే పట్టణాల నుంచి పయనమయ్యారు. నిన్నామొన్నటి దాకా బోసిపోయి కనిపించిన ఇళ్లన్నీ శుక్రవారం నుంచే కళకళలాడుతున్నాయి. దూరం నుంచి వచ్చిన కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు వారి పిల్లలతో సందడిగా కనిపిస్తున్నాయి.
సంబురాల సంక్రాంతి..
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు. ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు తిరుగుతాడు. దీనినే ఉత్తరాయణంగా చెబుతారు. ఇది మహా పుణ్యకాలం. ఏ శుభకార్యానికైనా మంచిదని హిందువులు నమ్ముతారు. అందుకే సంక్రాంతి మహత్తరమైన పండుగ అని పురాణాలు ప్రవచిస్తున్నాయి. సంక్రాంతిన పితృదేవతలకు తర్పణం విడుస్తారు. బ్రాహ్మణులకు బియ్యం, బెల్లం గుమ్మడికాయ దానం చేస్తారు. కొత్త బియ్యం, బెల్లంతో పాయసం చేసి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యంగా పెడుతారు.
పిండి వంటల ఘుమఘుమలు..
పల్లెల్లో దసరా తర్వాత ఈ పండుగకే పిండి వంటలు చేసుకుంటారు. ఈ సీజన్లో శరీరానికి వేడి అవసరం. సహజంగా శరీరంలో ఉష్ణోగ్రతను పెంచే ఆహారం నువ్వులు. ఈ నువ్వులతోనే రకరకాల పిండివంటలు చేస్తుంటారు. పండుగకు వారం పది రోజుల ముందు నుంచే బియ్యం పిండి, నువ్వులతో చేసే సకినాలు, బియ్యం పిండి, పల్లీలతో చేసే గారెలు, ఇంకా నువ్వులతో బెల్లం అరిసెలు కూడా చేసుకుంటారు. ఇప్పటికే ఈ ఇంటికెళ్లినా పిండి వంటల వాసనలే వస్తున్నాయి.
పశువుల పండుగ కనుమ..
సంక్రాంతి తర్వాత రోజు జరుపుకునే పండుగ కనుమ. ఈ పండుగను రైతులు ఘనంగా జరుపుకుంటారు. పశువులను అలంకరించి గోప్రదక్షిణం చేస్తారు. ఆ రకంగా వాటి రుణం తీర్చుకున్నట్లు భావిస్తారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడుతారు. ఎడ్లబండ్లతో ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు.