తెలంగాణచౌక్, జనవరి14: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ అక్రమాలకు పాల్పడుతున్నాడు. గ్రానైట్, ఇతర వ్యాపారులను బెదిరిస్తూ కోట్లు వసూలు చేస్తున్నాడు. మొన్నటిదాకా కార్పొరేటర్గా కేవలం ద్విచక్రవాహనం కలిగి ఉన్న ఆయన గడిచిన మూడేండ్లలోనే కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో చెప్పాలి. ఆయన ఆస్తుల మీద విచారణ చేయాలి. ఈడీ, సీబీఐతో దర్యాప్తు జరిపించాలి’ అని రాష్ట్ర ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జెల కాంతం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్వేత హోటల్లో ప్రజా సంఘాలు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ముఖ్యనాయకుల సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ దేశంలో మత విద్వేషాలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు ఉగ్రవాద, తీవ్రవాద సంస్థల కన్నా ప్రమాదకరమని, ఆ సంస్థలను దేశంలో, రాష్ట్రం లో నిషేధించాలని డిమాండ్ చేశారు. ఒకనాడు రాష్ట్రం సాధించుకోవడానికి ఉద్యమం చేశామని, అలాగే నేడు రాష్ర్టాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి రక్షించుకునేందుకు మరో ఉద్యమం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.
బండి సంజయ్కుమార్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధు లు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. విభజన హా మీలు, రాష్ట్ర అవసరాల గురించి ఒక్కనాడూ పార్లమెంట్లో మాట్లాడిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, రైతన్న సంక్షేమం కోసం ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతుబంధు లాంటి పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి పథకాలు కావాలని రైతు లు కోరుకుంటున్నారని, కేసీఆర్ ప్రధాని అయితే దేశంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుపడుతారన్నారు. ఈక్రమంలోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టగానే బీజేపీ నాయకులకు భయం పట్టుకున్నదని, దేశ వ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్సీ మీద సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తున్నదని విమర్శించా రు.
కేంద్ర నాయకత్వం వద్ద పేరు కోసం నిత్యం సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితను విమర్శిస్తున్న బండి అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఖమ్మం నుంచి మొదలు కరీంనగర్లోని గ్రానైట్, ఇతర వ్యాపారులను బెదిరిస్తూ కోట్లాది రూపాయలు వసూల్ చేశాడని ఆరోపించారు. దమ్ముంటే గ్రానైట్ వ్యాపారులపై పార్లమెంట్లో మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలు బయటపెట్టేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఊరూరా ఫిబ్రవరి16 నుంచి మా ర్చి 16 దాకా రాజ్యాంగ పరిరక్షణయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ్ర సంపత్, శంకర్, ఉపాధ్యక్షుడు కల్వల అనంద్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్కే సుల్తాన, నాయకులు అనిల్కుమార్, నరేష్, సాయి పాల్గొన్నారు.