కొత్తపల్లి, జూలై 16 : మండలంలోని ఖాజీపూర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఇసుక క్వారీని రద్దు చేయాలని గ్రామస్తులు, రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తుండగా, వీరికి గురువారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారితో కలిసి కరీంనగర్- వేములవాడ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ క్వారీ రద్దు విషయం ఇప్పటికే కలెక్టర్కు చేరిందని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. తీవ్రమైన ఎండలు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక క్వారీతో ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగుకు చుక్కనీరు లేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కేవలం ఖాజీపూర్ మాత్రమే కాకుండా ఎలగందుల, బద్దిపల్లి, నాగులమల్యాల, బావుపేట గ్రామాల్లోనూ నీళ్లు లేక ఎడారిగా మారుతున్నాయన్నారు. మానేరు డ్యాంలో పూడుకపోయిన మట్టిని తీసేందుకు ప్రభుత్వం కాంట్రాక్టర్కు అనుమతి ఇస్తే ఆ పనిలో నష్టం వస్తుండడంతో సదరు కాంట్రాక్టర్ ఇసుకను తోడుతూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కరీంనగర్లో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఖాజీపూర్లో తనకు పొలం ఉందని, సాగునీరందక అది ఎండిపోయిందని తెలిపారు. తనకు కేసులు కొత్తకాదని, రైతాంగం, గ్రామస్తుల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ ఆర్డీవో షర్మిల అక్కడికి రాగా, క్వారీని రద్దు చేయాల్సిందేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు అంజనీకుమార్, పెంచాల ఆంజనేయులు, తాండ్ర శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేని మధు, పిల్లి మహేశ్, తదితరులు పాల్గొన్నారు.