ఉమ్మడి జిల్లాలో ఇసుక దందా జోరుగా నడుస్తున్నది. మానేరు నది పొడువునా యథేచ్ఛగా సాగుతున్నది. అధికార పార్టీ నాయకుల అండదండలతో అక్రమార్కులు పెట్రేగి పోతున్నట్లు తెలుస్తుండగా, అక్రమ రవాణాకు అడ్డ్డూ అదుపులేకుండా పోతున్నది. పేరుకు మాత్రమే ఆన్లైన్ అని కనిపిస్తున్నా.. అడుగడుగునా అక్రమాలే జరుగుతున్నాయి.ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలోని మానేరు పరీవాహక ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో ఇసుక మేటలు తొలగింపు కోసం తీసుకున్న అనుమతుల మాటున మానేరు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. అంతేకాదు, పలు క్వారీల్లో గుత్తాధిపత్యం చేస్తూ.. ఇసుక ధరలు అమాంతం పెంచుతున్నారు. కొన్నిచోట్ల పోలీసులే అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వస్తుండగా, మొత్తంగా అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక తీసుకునేందుకు ఉమ్మడి జిల్లావాసులకు అన్ని సౌకర్యాలు ఉన్నా.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రస్తుతం ఇసుక ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దాంతో కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నేళ్లుగా లేని ఈ సమస్య ఉమ్మడి జిల్లాలో ఇప్పుడే ఎందుకు ఉత్పన్నమవుతున్నది? దీనికి కారణం ఎవరు? లోపం ఎక్కడ? అన్నదే ప్రస్తుత ప్రధాన అంశంగా నిలుస్తున్నది. గోదావరి ఉపనది అయిన మానేరు పరీవాహక ప్రాంతం 90 శాతం ఉమ్మడి జిల్లాలోనే ఉంటుంది. గతంలో మానేరు పొడవునా.. అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లా వరకు అనేక క్వారీలు నడేచేవి. వివిధ కారణాలతో చాలా వరకు బందయ్యాయి. ప్రస్తుతం కొన్ని మాత్రమే అధికారికంగా నడుస్తుండగా.. మరికొన్ని అక్రమంగా నడుస్తున్నాయి. నిజానికి మానేరు పొడవునా నీరు తగ్గిపోవడంతో పలు చోట్ల క్వారీలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం కొత్తవాటికి పర్మిషన్ ఇవ్వకుండా.. ఉన్న క్వారీలను మాత్రమే నడిపిస్తున్నది.
ఇదే అదనుగా అక్రమార్కులు ఇసుక కొరతను సృష్టించి అందిన కాడికి దండుకోవడం కనిపిస్తున్నది. నిజానికి ఆన్లైన్ అనుమతుల ద్వారా తరలుతున్న ఇసుకకన్నా, అనధికారికంగా తరలుతున్న ఇసుకే అధికంగా ఉన్నది. ఈ వ్యవహారంలో కొంత మంది అధికార పార్టీ నాయకులే ప్రముఖపాత్ర పోషిస్తున్నారన్న విమర్శలున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మానేరు పొడవునా 32 చోట్ల అనధికారిక క్వారీలు నడుస్తున్నాయి. ఈ దందా అంతా అర్ధరాత్రి పూట జరుగుతున్నది. రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారు జామున ఐదు గంటల వరకు నిరాటంకంగా నడుస్తున్నది. దీని గురించి చాలా చోట్ల అధికారులకు తెలిసినా ఒత్తిళ్లతో పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల పరిధిలో ఈ తరహా దందా ఎక్కువగా నడుస్తున్నది. ప్రధానంగా ఇసుక అక్రమ దందా గురించి పలుచోట్ల పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో వచ్చిన గోదావరి వరద ప్రవాహానికి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని వందలాది మంది రైతుల పొలాల్లో ఇసుక మేటలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సదరు రైతులు తమ పొలాల నుంచి ఇసుక మేటలను తొలగించుకునేందుకు అనుమతి తీసుకున్నారు. అయితే అక్రమార్కులు ఈ మేటలను సైతం వదలడం లేదు. రైతుకు నామమాత్రంగా డబ్బులు చెల్లించి.. సదరు మేటల ఇసుకను వ్యాపారులే తరలిస్తున్నారు. పేరుకు రైతులే తొలగిస్తున్నట్లుగా కనిపిస్తున్నా, జరుగుతున్న వ్యాపారమంతా అక్రమంగానే సాగుతున్నది. దీనికితోడు మేటల మాటున కొంత మంది అధికార పార్టీ నాయకులు ఏకంగా అక్కడి పరీవాహక ప్రాంతంలోని మానేరు ఇసుకను సైతం అక్రమంగా రవాణా చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ముత్తారం మండ లం ఓడేడ్ గ్రామ పరిధిలోని మానేరు నుంచి ఇసుకను తరలించేందుకు ఏకం గా మానేరులోకి రహదారి నిర్మించారు. అక్కడి నుంచి ఇసుకను రాత్రి పూట ఉమ్మడి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి అర్ధరాత్రి సమయంలో పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.
అడవి శ్రీరాంపూర్, ఖమ్మంపల్లి, జిల్లెల్లపల్లి, ముత్తారం, ఓడేడ్ అలాగే మల్హర్ మండలంలో కొన్ని ఇసుక క్వారీలకు అధికారికంగా అనుమతి ఉన్నది. వీటి పరిధిలోనూ నయా దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. రోజుకు ఎక్కువ వాహనాల్లో ఇసుక నింపడానికి అవకాశమున్నా.. కొంతమంది కాంట్రాక్టర్లు మాత్రం మార్కెట్లో కొరత సృష్టించి రేట్లు పెంచడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. కొద్ది రోజులుగా నిత్యం కొన్ని వాహనాల్లో మాత్రమే ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ఉదాహరణకు చూస్తే.. గతంలో ఒక క్వారీలో వంద వాహనాల్లో ఇసుక నింపితే.. ఇప్పుడు 30 నుంచి 50కే పరిమితం చేశారు. దీనివల్ల మార్కెట్లో ఇసుకకు డిమాండ్ పెరుగుతున్నది. ఈ దందా అంతా అధికారులకు తెలిసినా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండగా, ఈ ప్రాంతానికి వస్తున్న వాహనాలు రెండు రోజులపాటు ఇక్కడ ప్రధాన రహదారుల వెంట నిలిచిపోతున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతున్నది. మంథని-ఓడేడ్ రోడ్డు మొత్తం ఇసుక లారీలతో నిలిచిపోతున్నది. ఈ ప్రాంతం గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
ఎక్కడికక్కడ రోడ్లు దుమ్మురేగుతున్నా సదరు కాంట్రాక్టర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం రహదారులపై దుమ్ము లేవకుండా అధికారులు నీళ్లు చల్లించాలి. కాలుష్యం ఇబ్బంది కాకుండా చూడాలి. కానీ, ఈ విషయాన్ని కొద్ది రోజులుగా పూర్తిగా విస్మరించారు. దీంతో ఈ ప్రాంతంలో ఎటు చూసినా దుమ్ముతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పెద్దపల్లి జిల్లా నుంచి అర్ధరాత్రి పూట అక్రమంగా రవాణా అవుతున్న ఇసుక వాహనాల వల్ల తమ పంటపొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముత్తారం మండలంలో ఇసుక వాహనాలను రైతులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు డిమాండ్కు తగినంత సరఫరా చేయడంపై దృష్టిపెడితే నిర్మాణాదారులకు ఊరట లభిస్తుంది. అంతేకాదు, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి.. నిబంధనల ప్రకారం నడిపితే ఇసుక రేట్లు తగ్గి, కొనుగోలుదారులకు భారం తగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారుల మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.