ధర్మపురి, డిసెంబర్ 9: పల్లె రోడ్లకు మహర్దశ పట్టనున్నది. ‘రాష్ట్రంలోని రహదారులు అద్దాల్లా మారాలి. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’ అని రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించిన క్రమంలో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి ఈశ్వర్ పంపిన ప్రతిపాదనల మేరకు రోడ్ల మరమ్మతు పనులకు శుక్రవారం రూ.21కోట్ల 38లక్షల 27వేలు మంజూరయ్యాయి. వరదల కారణంగా రోడ్లతో పాటు కొన్ని చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, వెల్గటూర్, గొల్లపెల్లి, పెగడపల్లి మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో కోతకు గురైన రోడ్లు ప్రమాదకరంగా మారాయి. ఇవే కాకుండా గుంతలు పడిన రోడ్లు సైతం బాగుపడనున్నాయి. రోడ్లు కొత్తగా కనిపించేలా పూర్తిస్థాయిలో తారు వేయనున్నారు. దీంతో పల్లె రహదారులు బాగుపడి, ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ త్వరలో పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
బాగుపడే పల్లె రహదారులు, కేటాయించిన నిధులు ఇవే..
ధర్మపురి మండలంలోని దొంతాపూర్ నుంచి ఎడపల్లి వరకు రహదారి మరమ్మతు పనులకు రూ.32 లక్షలు, ధర్మపురి మండలం రాజారం గ్రామం నుంచి గోదావరి వరకు రూ.11 లక్షలు, ధర్మపురి మండలం నర్సయ్యపల్లి నుంచి తుమ్మెనాల వరకు రోడ్డు పనులకు గాను రూ.4 లక్షలు, ధర్మపురి మండలం ఆరెపల్లి నుంచి గోదావరి వరకు రూ.36 లక్షలు, వెల్గటూర్ మండలం పీడబ్ల్యూడీ రోడ్ నుంచి కొత్తపేట, పడకల్ వరకు రహదారి మరమ్మతు పనులకు రూ.1.52 కోట్లు, వెల్గటూర్ మండలం ఆర్అండ్బీ రోడ్డు గుల్లకోట నుంచి వెల్గటూర్ వరకు వయా చెర్లపల్లి, జగదేవ్పేట మీదుగా రోడ్డు పనులకు రూ.5కోట్ల 14లక్షలు, వెల్గటూర్ మండలం శాఖాపూర్ నుంచి కొండాపూర్ వరకు రూ. 20లక్షలు, కుమ్మరిపల్లి నుంచి జగదేవ్పేట వరకు రూ.13లక్షలు, గొల్లపెల్లి మండలం బొంకూరు నుంచి అబ్బాపూర్ వరకు పనులకు రూ.90లక్షలు, గొల్లపెల్లి మండలం బీబీరాజ్పల్లి నుంచి మ్యాడంపల్లి వరకు రూ.185లక్షలు, గొల్లపెల్లి నుంచి వెనుగుమట్ల వరకు రూ.157లక్షలు, గొల్లపల్లి మండలం రంగధాముని పల్లె నుంచి లక్ష్మీపూర్ వయా కొసునూర్పల్లి రోడ్డు పనులకు రూ.17.57లక్షలు, రంగధామునిపల్లి నుంచి నంచర్ల వరకు రూ.కోటి, బీబీరాజ్పల్లి బైపాస్రోడ్డు రూ.85.50లక్షలు, బీబీరాజ్పల్లి ఎస్సారెస్సీ కాలువ దారికి రూ. 22.90లక్షలు, మల్లన్నపేట ఎస్సీ కాలనీ నుంచి నందిపల్లి వరకు రూ. 85.30లక్షలు, గంగదేవునిపల్లి జీపీ రోడ్డు నుంచి మొగుళ్ల చెరువు వరకు రూ.77లక్షలు, ఇస్రాజ్పల్లి నుంచి వయా గోవిందుపల్లి మీదుగా గుంజపడుగు వరకు రూ.34లక్షలు, పెగడపల్లి మండలం ఎల్లాపూర్ నుంచి ల్యాగలమర్రి వరకు రూ.170లక్షలు, పెగడపల్లి మండలం మద్దుట్ల క్రాస్ రోడ్ నుంచి బతికపల్లి వరకు రోడ్డు పనులకు గాను రూ.98లక్షలు, కొండయపల్లి నుంచి వెంగళాయపేట వరకు రూ. 21లక్షలు, ఐతుపల్లి నుంచి దోమలకుంట రహదారి మరమ్మతు పనులకు రూ.50లక్షలు, ఎల్లాపూర్ నుంచి నక్కపల్లి వరకు రూ.13లక్షలు, ఆరవెల్లి నుంచి బతికపల్లి వరకు రహదారి మరమ్మతు పనులకు రూ. కోటి మంజూరైనట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు.