రుద్రంగి, డిసెంబర్ 12: ఒకప్పుడు నక్సల్ పీడిత ప్రాంతంగా, తీవ్రవాదానికి చిరునామాగా ఉన్న రుద్రంగి గ్రామం స్వరాష్ట్రంలో మండల కేంద్రంగా ఏర్పడి అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రుద్రంగిలో 3.50కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ విద్యాలయ నూతన భవనాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు నేతృత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో 3.50 కోట్లతో కస్తూర్బాగాంధీ విద్యాలయ నూతన భవనం ప్రారంభించడం సంతోషకరమన్నారు.
భవనం వరకు రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తామన్నారు. సంక్రాంతి తర్వాత పాత జూనియర్ కళాశాల భవనం స్థానంలో కొత్త భవనానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా ఎమ్మెల్యేతో కలిసి శంకుస్థాపన చేసి, నిర్మిస్తామన్నారు. ‘మన ఊరు మన బడి లో భాగంగా మండలంలోని 6 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, రుద్రంగిలోని బండ మీద బడి(సెకండరీ పాఠశాల)లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. 2 కోట్లతో రుద్రంగి ప్రధాన రాహదారిని అభివృద్ధి చేసి లైటింగ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో 30 పడకల దవాఖాన మంజూరు చేస్తామన్నారు. తమకంటే రెండు పనులు ఎక్కవ చేసి ప్రజల మనసులు గెలుచుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. డబుల్ బెడ్రూం ఇల్లు, బీడీ పెన్షన్లు కల్పించాలని మహిళలు కోరగా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.