తెలంగాణచౌక్, ఫిబ్రవరి 8: ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలకు శివరాత్రికి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపనున్నది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి ఈ నెల 17, 18, 19 తేదీల్లో బస్సులు తిప్పనున్నారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్ ఆర్ఎం ఖుస్రోషాఖాన్ వివరాలు వెల్లడించారు. దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడకు 316 సర్వీసులు నడుపనున్నామని చెప్పారు. కరీంనగర్, కోరుట్ల, మెట్పల్లి, జూబ్లీ బస్స్టేషన్, జగిత్యాల వయా కొండగట్టు, వరంగల్ వయా హుజూరాబాద్ మీదుగా వేములవాడకు 17న 95, మహాశివరాత్రి రోజున 100, 19న 121 బస్సు సర్వీసులు తిరుగుతాయని వెల్లడించారు. అలాగే కాళేశ్వరం క్షేత్రానికి మంథని డిపో నుంచి 17న ఐదు, 18న 15, 19న ఐదు బస్సులు నడిపిస్తామని పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా దుబ్బ రాజన్న ఆలయానికి జగిత్యాల నుంచి ఈనెల 17న ఆరు, 18న ఎనిమిది, 19న ఆరు బస్సులు, హుస్నాబాద్ పొట్లపల్లి శివాలయానికి హుస్నాబాద్ నుంచి 17న ఒకటి, 18న ఎనిమిది, 19న రెండు బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. రద్దీకి అనుగుణంగా సర్వీసుల సంఖ్యను పెంచుతామని పేర్కొన్నారు. వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వద్దకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు.