ప్రజారవాణాలో ముందున్న ఆర్టీసీపై పెను భారం పడుతున్నది. ముందస్తు ప్రణాళిక.. అంచనా లేకుండా బస్ ఫ్రీ జర్నీ చేయడంతో ఊహించలేనంతగా తాకిడి పెరుగుతున్నది. కెపాసిటీకి మించి ప్రయాణిస్తుండడంతో బస్సుపై ఓవర్లోడ్ పడుతుండగా, డ్రైవర్లు, కండక్లర్లు ఒత్తిడికి లోనుకావాల్సి వస్తున్నది. ప్రయాణికులు కూడా సీట్ల కోసం ఇబ్బంది పడుతుండగా, డిమాండ్కు అనుగుణంగా సర్వీసులు నడిపితేనే ఈ సమస్య నుంచి గట్టెక్కె పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం జాతర్ల సీజన్ కావడంతో రద్దీ మరింత పెరుగుతుండగా, యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో తలమునకలైంది.
కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ)/తెలంగాణచౌక్ : కరీంనగర్ రీజియన్లోని 11 డిపోల పరిధిలో 867 బస్సులు ఉన్నాయి. అందులో 339 అద్దె బస్సులు నడుస్తున్నాయి. అయితే రాష్ట్ర సర్కారు గతేడాది డిసెంబర్ 9 నుంచి మహిళలకు బస్సు ఫ్రీ జర్నీని ప్రవేశపెట్టింది. మొత్తం 667 పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తుండగా, మిగిలిన 200 బస్సుల ద్వారానే సంస్థకు నేరుగా ఆదాయం వస్తున్నది. రాష్ట్రంలో అత్యధికంగా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించే రీజియన్లలో కరీంనగర్ ప్రథమ స్థానంలో ఉన్నది. కాగా, ఫ్రీ జర్నీకి ముందు రీజియన్లో సగటున రోజుకు 2.40 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా, 1.50 కోట్ల ఆదాయం వచ్చేది. మ హిళల ఉచిత ప్రయాణం ప్రారంభమైన తర్వాత బస్సు ల్లో ప్రయాణించే వారి సంఖ్య 3.90 లక్షలకు పెరిగింది. అలాగే ఆదాయం కూడా పెరిగింది. కానీ, ప్రయాణికుల నుంచి నేరుగా సంస్థకు వస్తున్న ఆదాయం మాత్రం సగటున 92 లక్షలకు పడిపోయింది.
మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఒక్కసారిగా ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. దీంతో ఏ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నది. సీట్ కెపాసిటీ ప్రకారం చూస్తే.. పల్లెవెలుగులో 55, ఎక్స్ప్రెస్లో 50 సీట్లు మాత్రమే ఉంటాయి. కానీ, ఒక్కో బస్సులో 80 నుంచి 100 మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు సీట్ల కో సం పోటీ పడుతున్నారు. ఒక్కోసారి గొడవల దాకా వెళ్తున్నారు. అది ఏ రూట్ అయినా ఇదే పరిస్థితి ఉం టుంది. దీంతో పూర్ పర్ఫార్మెన్స్ ఉన్న దూ ర ప్రాం త సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసి.. లోక్ల్ ట్రిప్పులకు వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిం ది. ఈ రకంగా ఇప్పటి వరకు రీజియన్ పరిధిలో మంథని డిపో నుంచి మహారాష్ట్రలోని చంద్రపూర్కు వెళ్లే రెండు ఎక్స్ప్రెస్లు, మెట్పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్లోని పామూరుకు వెళ్లే ఒక ఎక్స్ప్రెస్ని, కరీంనగర్ -1 డిపో నుంచి ఆంధ్రప్రదేశ్లోని నర్సారావుపేటకు వెళ్లే మరో ఎక్స్ప్రెస్ సర్వీసును తాత్కాలికం గా రద్దు చేసి స్థానిక అవసరాలకు వాడుకుంటున్నా రు. సేవా భావంతో నడుస్తున్న సంస్థలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు అందుబాటులో లేక పోవడంతో పరిస్థితి దారుణంగా మారింది.
ప్రతి రీజియన్కు కొత్త బస్సులు ఇస్తామని రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే ప్రకటించారు. అయితే, కరీంనగర్కు ఎన్ని వస్తాయనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. నిజానికి ఇప్పుడున్న డిమాండ్ను బట్టి మరో 300 బస్సులైనా ఇవ్వాల్సిన అ వసరమున్నది. కానీ, ప్రభుత్వం రాష్ర్టానికి తెస్తున్న కొత్త బస్సుల సంఖ్యను చూస్తే 150 వరకే వచ్చే అవకాశమున్నది. ఈ బస్సులు త్వరగా వస్తే కొంత వరకైనా భారం తగ్గేది. కానీ, ఇవి ఎప్పుడు వస్తాయా..? అని అధికారు లు ఎదురు చూడాల్సి వస్తున్నది. ఉచిత బస్సు ప్రయా ణం కల్పించే ముందు రాష్ట్ర ప్రభుత్వం సరైన అంచ నా వేయని కారణంగానే ఇబ్బందులు తప్పడం లేదు.
ఆర్టీసీలో ఉద్యోగులకు కూడా ఒత్తిడి తప్పడం లేదు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలనే ఉద్దేశంతో అధికారులు ఉన్నంతలో సంస్థ అంతర్గత సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లతోపాటు ప్రతి ఉద్యోగి అవసరాన్ని బట్టి గంట, రెండు గంటలు అదనంగా పనిచేస్తున్నారు. ఒక్కో బస్సు రోజుకు సగటున 400 నుంచి 420 కిలోమీటర్లు తిరుగుతుంటాయి. అయితే, బస్సుల సామర్థ్యాన్ని మించి ప్రయాణికులు వస్తున్న నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లు ఒత్తిడికి గురవుతున్నన్నారు. బస్సులో కాలు తీసి కాలు పెట్టలేనంతగా జనం ఉండడంతో టికెట్లు కూడా ఇచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల అవసరానికి అనుగుణంగా బస్సుల సంఖ్య పెరిగితే గానీ తమపై ఒత్తిడి తగ్గే పరిస్థితి కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు.
రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క, సారలమ్మ జాతరలు వచ్చే నెల 18 నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే, మేడారం వనదేవతల వద్దకు వెళ్లే ప్రతి ఒక్కరూ కరీంనగర్ రీజియన్ పరిధిలో ఉన్న వేములవాడ రాజన్నను దర్శించుకోవడం సెంటిమెంట్. ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల, వేములవాడ డిపోలకు తాకిడి పెరిగింది. వేములవాడలో 57, సిరిసిల్లలో 60 బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే రీజియన్ పరిధిలోని 9 డిపోల నుంచి 80 బస్సులను వేములవాడ జాతర కోసం ఎంగేజ్ చేశారు. సమ్మక్క, సారలమ్మ జాతర దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశముంటుంది. దీనిని అధిగమించేందుకు కరీంనగర్ రీజియన్ ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ ప్రతి జాతర సీజన్లో కరీంనగర్ రీజియన్ బస్సులు మొత్తం 5 వేల నుంచి 6 వేల ట్రిప్పులు నడుస్తుండగా, ఈ డిమాండ్కు అనుగుణంగా ఇతర రీజియన్ల నుంచి బస్సులు సర్దుబాటు చేసుకోవాలని భావిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన తరుణంలో ఇది ఎంత వరకు సాధ్యమవుతుందనేది వేచి చూడాలి.